బుల్లితెరపై 'సంతు నామదేవ్'
డిడి-1 ఛానెల్ లో బెంగాలీ దర్శకుడు శ్యాంబెనగల్ దర్శకత్వంలో 'అమరావతి కథలు' ప్రసారం చేసిన ప్రో వీడియో సంస్థ తాజాగా 'సంతు నామ్ దేవ్ ' అనే భక్తిరస సీరియల్ ను అందించనుంది.పాండురంగడి భక్తుడైన సంతు నామ్ దేవ్ జీవిత కథాశంతో రూపొందిన ఈ సీరియల్ ఈనెల 18వ తేదీ నుంచి ఎస్.వి.భక్తి ఛానెల్ లో ప్రసారం కానుంది. ప్రతి శుక్రవారం రాత్రి 9.30 గంటలకు, తిరిగి శనివారం ఉదయం 10 గంటలకు ఈ సీరియల్ ప్రసారమవుతుంది.
నిర్మాత వేణుగోపాల్ కె.ఠక్కర్ ఆ విశేషాలను తెలియజేస్తూ, గతంలో తమ సంస్థ పలు మరాఠీ, బెంగాలీ, హిందీ సీరియల్స్ రూపొందించిందనీ, వీటికి విశేష ఆదరణ లభించడంతో పాటు అవార్డులు కూడా వచ్చాయనీ అన్నారు. ఆ ప్రోత్సాహంతోనే ఇప్పుడు తెలుగులో కూడా బుల్లితెర వీక్షకులకు మంచి సీరియల్స్ అందించేందుకు 'సంతు నామ్ దేవ్' అనే భక్తిరస సీరియల్ తో అడుగుపెడుతున్నామని అన్నారు. పాండురంగ భక్తుడుగా సంతు నామ్ దేవ్ మరాఠీ వారికి సుపరిచితులనీ, ఆ భక్తుడి గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో తెలుగులో రూపొందించామని చెప్పారు. దర్శకుడు దేవేంద్ర సుపేకర్ మరాఠీ వ్యక్తి అయినప్పటికీ తెలుగు నేటివిటీకి దగ్గరగా చాలా కేర్ తీసుకుని పని చేశారని చెప్పారు. మరాఠీ ఆర్టిస్టులతో పాటు తెలుగు కళాకారులు కూడా ఇందులో నటించారని తెలిపారు. దర్శకుడు సుపేకర్ మాట్లాడుతూ, ఈ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతుండటం సంతోషంగా ఉందని అన్నారు. ఈ అవకాశమిచ్చిన నిర్మాతకు తన కృతజ్ఞతలనీ, ఈ సీరియల్ కు తప్పుకుండా తెలుగు ప్రేక్షకుల ఆదరణ లభిస్తుందనే నమ్మకం ఉందనీ అన్నారు. దీనికి తెలుగు రచయిత యర్రంశెట్టి సాయి కథ, మాటలు అందించారనీ, సంతు నామదేవ్ మరాఠీ వాస్తవ్యుడు కావడంతో నేటివిటీకి దగ్గరగా మహారాష్ట్రలోనే షూటింగ్ చేశామనీ చెప్పారు. ఇందులో కుమార్, గుత్తికొండ భార్గవి, భవాని, మాస్టర్ విజయ్, చేతన్ చావడ, రాఘువేంద్ర కడకుళే తదితరులు నటించారు. నందకుమార్ పాటిల్ సినిమాటోగ్రఫీ, బాల్ పోసలే సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|