|
|
Articles: TP Features | భావం పరాయీకరణ - Site Administrator
| |
(డా.పి.శివరామకృష్ణ)
తెలుగు పునరుజ్జీవనానికి ఎన్నో సంస్థలు నేడు పుట్టాయి. అవి కొందరు భాషా తత్వవేత్తలను నియమించి వ్యుత్పత్తి పదకోశాన్ని కేవలం భాషాశాస్త్ర దృష్టితో కాక సాంఘిక, మానవజాతి, రాజనీతి శాస్త్రాల దృష్టితో నిర్మించాలి. (`నుడి-నానుడి'- తిరుమల రామచంద్ర - 1980)
బ్రిటీష్ వారి రాకతో అచ్చుయంత్రం మన దేశంలోకి ప్రవేశించింది. పుస్తక ప్రచురణ ప్రారంభమయింది. విద్యారంగం వ్యవస్థీకృతమయింది. బ్రిటీష్ వారు వారి శాస్త్ర గ్రంథాలను అనువదించి పాఠశాలల్లో ప్రవేశపెట్టారు. అప్పటి వరకు కొనసాగుతున్న మార్గ దేశి సంప్రదాయాలకు చెందిన విజ్ఞానాన్ని గ్రంథస్థం చేయడానికి, బోధించడానికి కొందరు చేసిన ప్రయత్నాలు క్రమంగా క్షీణిస్తూ వచ్చాయి. జాతి పునరుజ్జీవనం కోసం పాటుపడితే వైతాళికులందరూ అభివృద్ధికీ సామాజిక, రాజకీయ స్వాతంత్ర్యానికీ విదేశీ విద్య తప్పనిసరి అని విశ్వసించారు. కొమర్రాజు లక్ష్మణరావు పంతులుగారి ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం నుండి - తెలుగుభాషా సమితి వారి విజ్ఞాన సర్వస్వం వరకు మనకు పాశ్చాత్య విజ్ఞానాన్నే అందించాయి.
1950లోనే దేశి సాహిత్య సేకరణ ఊపందుకుంది. వృత్తులవారీగా దేశీయ విజ్ఞానం గ్రంథస్థం చేయడం తెలుగు మాండలిక వృత్తి పదకోశాల (1963)తో మొదలయింది. తెలుగు సామెతలు, మాండలిక పదకోశాలను తెలుగు అకాడమి ప్రచురించింది. అప్పటివరకు అందుబాటులో గల పద సంపదతో ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు వ్యుత్పత్తి పదకోశం (1989) తయారుచేసింది.
మాతృభాషలో విద్యాబోధన కోసం తెలుగు అకాడమీ శాస్త్రగ్రంథాల అనువాదాలను ప్రచురించసాగింది. ఈ అనువాదాలలో ప్రామాణిక పరిభాషతో పాటు మాండలిక పదాలు కూడా ఇస్తే బాగుంటుందని భాషా పండితులైన మాండలిక వృత్తి పదకోశ సంపాదకులు సలహా ఇచ్చారు. కానీ, తెలుగు అకాడమీ పండితులు ఈ సలహాను తిరస్కరించారు. తిరస్కరించిన వారిలో ఒకరు మాండలిక పదకోశం (వాస్తు) సంపాదకులు కావడం ఆశ్చర్యకరం. ఇటువంటి విధానపరమైన వివాదాలను నాటి విద్యామంత్రి పి.వి.నరసింహారావు దృష్టికి తెస్తే ఎలా ఉండేదో? ప్రామాణిక భాషకు పట్టంగట్టి మాండలికాలను నిర్లక్ష్యం చేయడం, ఉపప్రాంతీయ ఉద్యమాలకు దారితీసింది.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|