|
|
Articles: TP Features | ఆరిన జ్వాల నక్సల్ బరీ - Site Administrator
| |
నిప్పుల విత్తనాలను చల్లి మంటలను పండించిన నేల... సాయుధ రైతాంగ ఉద్యమంతో రక్త పతాకాలను ఎగరేసిన వీర భూమి... దేశ రాజకీయ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేసి భారత చరిత్రలో సగర్వమైన పుటను కేటాయించుకున్న గ్రామం... భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సస్ట్-లెనినిస్ట్) సాయుధ కార్యకర్తకు నక్సలైట్ బిరుదు ఇచ్చి నిఘంటవులో కొత్త పదాన్ని చేర్చిన నక్సల్ బరీ... గ్రామం. తాజాగా లాల్ ఘడ్ మావోయిస్టు ఉద్యమం దేశాన్ని కుదిపేస్తున్నప్పుడు అక్కడకు కొన్ని వందల మైళ్ళ దూరంలో ఉన్న నక్సల్ బరీ గ్రామం ప్రశాంతంగా కనిపించింది. పశ్చిమ బెంగాల్ లోని సిలిగురి నుంచి అరగంట ప్రయాణం చేస్తే నక్సల్ బరీ గ్రామం వస్తుంది. ఇప్పుడు ఆ గ్రామాన్ని చూస్తే వేల మంది యువకులను అడవి దారి పట్టిస్తున్న నక్సలైట్ (మావోయిస్టు) ఉద్యమం పురుడు పోసుకున్నది ఇక్కడే అంటే నమ్మడం కష్టమే.
గ్రామీణ బెంగాల్ లో ఉండే అన్ని గ్రామాల మాదిరిగానే నక్సల్ బరీ ఉంది. పచ్చని పంట పొలాలు. కోతల కోసం ఎదురుచూస్తున్న చేలు. టీ దుకాణాలు...ఇక్కడే వృద్దులు, యువకులు తమ కాలక్షేపం కబుర్లు చెప్పుకుంటూ కనిపిస్తారు. ప్రస్తుతం నక్సల్ బరీ గ్రామ పంచాయతీలో 21 గ్రామాలు ఉన్నాయి. 25 వేల మంది జనాభా ఉంది. దీనికి పక్కనే ఉన్న మూడు టీ తోటల్లో ఆరు వేల మందికి పైగా పనిచేస్తున్నారు. చాలా మంది తమ పొలాలను దున్నుకుంటున్నారు. ఇక్కడ పుట్టిన నక్సలైట్ ఉద్యమం గురించి అర్ధం చేసుకోవాలంటే 1940ల్లో ఆంధ్రదేశంలో సాగిన తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటాన్ని, పశ్చిమ బెంగాల్ లో సాగిన తెభగ ఉద్యమాన్ని ఆలోకన చేయాలి. ఈ దేశంలో రైతులు ఆయుధాలు పట్టిన ఏకైక ఉద్యమం తెలంగాణా పోరాటం అయితే హక్కుల సాధన కోసం వ్యవసాయ కూలీలు నడిపిన తెభగ ఉద్యమాన్ని బెంగాల్ ప్రజలు చూశారు.
బెంగాల్ లో యాభయ్యవ దశకంలో రైతుల అణచివేత ధోరణి, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కూలీల్లో ఆగ్రహాన్ని రగిల్చింది. తెరాయ్ ప్రాంతంలో తెభగ ఉద్యమం ప్రభావం కనిపించింది. కాని టీ తోటల కార్మికుల అసంతృప్తిని బయటకు తెచ్చింది. `టీ తోటల కార్మికుల సంఘమే నక్సలైట్ ఉద్యమానికి అంకురార్పణ చేసింద'ని అప్పట్లో నక్సలైట్ ఉద్యమ నాయక ప్రముఖుల్లో ఒకరైన ముజిబుర్ రహ్మాన్ చెప్పారు. 1967 సంవత్సరంలో రైతాంగ ఉద్యమం అప్పటి రాజకీయ వాతావరణం నుంచి అనుకోకుండా పుట్టిందే అయినా అప్పటి నక్సల్ బరీ స్థానిక నాయకులు దానిని సాయుధ పోరాటంగా తీర్చిదిద్దారని నక్సలైట్ ఉద్యమ నిర్మాత, సిపిఐ (ఎంఎల్) వ్యవస్థాపకుడు చారు ముజుందార్ కుమారుడు అభిజిత్ ముజుందార్ పేర్కొన్నారు. `తెభగ ఉద్యమం సంపన్న రైతుల కుట్ర వల్ల భగ్నమైపోయిందని, ఈ ఉద్యమాన్ని మరింత శక్తిమంతంగా నిర్వహించాలంటే రైతులు ఆయుధం ధరించాల్సిన అవసరాన్ని మా నాన్న గ్రహించార'ని ఆయన చెప్పారు. ఆ తరువాత కానూ సన్యాల్ గా పేరుగాంచిన కృష్ణకుమార్ లో సరైన సహచరుడిని చారు ముజుందార్ గుర్తించారు. ఉద్యమం కాలంలో ఆయన సిపిఐలో చురుగ్గా పనిచేస్తున్న జంగల్ సంథాల్, కేసబ్ సర్కార్, బాబులాల్ విశ్వకర్మ, కదం మల్లిక్ తదితర నాయకులతో పరిచయాలు పెంచుకున్నారు. '1964లో సిపిఐ నుంచి విడిపోయి సిపిఐ(ఎం) ఏర్పడినప్పుడు, మావోయిస్టు విధానం పట్ల తనకున్న నిబద్ధతను మా నాన్నగారు ఎంత మాత్రం దాచుకోకుండా ప్రకటించేవార'ని అభిజిత్ వివరించారు.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|