|
|
Articles: Devotion | సాయి పూజా వైశిష్ట్యం - Mr. Pratap Cherukuri Pratap
| |
ఈ కలియుగం లో క్షీణించిపోతున్న ధర్మాన్ని పరిరక్షించడానికి, పెచ్చు పెరుగుతున్న అధర్మాన్ని శిక్షించడానికి, ఆశ్రిత భక్త జనావళిని శ్రేయోమార్గంలో నడిపించి వారిని మోక్షార్హులను చేసేందుకు నిర్గుణ, నిరాకార, త్రిగుణాతీతమైన పరబ్రహ్మ ఒక మానవదేహం ధరించి 19వ శతాబ్దంలో దివి నుండి భువికేగింది. ఆ పరిశుద్ధ పరమేశ్వర అవతారమే శ్రీ శిరిడీ సాయినాధుడు. శ్రీ సాయినాధుని కృపను కోట్లాది మంది పొందారు. ఆయన అపురూపమైన కరుణా కటాక్షాలు ఇప్పటికీ ఆయనను చిత్తశుద్ధితో స్మరించుకునేవారికి లభ్యమౌతూనే ఉన్నాయి. అయితే అందుకు కావల్సింది నిరంతర చింతన, సదా స్మరణ, అనునిత్యం భక్తి విశ్వాసాలతో ఆరాధన. ఒక్క మాటలో చెప్పాలంటే మనం సాయి నిత్య భక్తులం కావాలి.
భక్తులలో గురువారం భక్తులు కూడా ఉన్నారు. కేవలం సాయిని గురువారం మాత్రమే గుర్తుంచుకొని ఆరాధించడం, పూజాది కార్యక్రమాలు నిర్వర్తించడం, సాయి దేవాలయానికి వెళ్ళి కోరికల మూట విప్పి ప్రార్ధన చేయడం, ఆ మర్నాడు మళ్ళి సాయిని మర్చిపోవడం. సాయి సంపూర్ణ అనుగ్రహం నిత్య భక్తులకు మాత్రమే లభ్యం. గురువారం భక్తులపై వర్షించే సాయి కరుణాకటాక్షాలు అతి స్వల్పం.
సాయి తనను ఏ విధంగా సేవించాలో చాలా స్పష్టంగా చెప్పారు. సాయి సచ్చరిత్రలోని ఈ కింది వాక్యాలు గమనించండి :
'నన్ను శ్రద్ధాభక్తులతో సదా స్మరించండి. నన్ను నిస్వార్ధంగా సేవించండి. మీకు అన్ని విధాలా శ్రేయస్సు కలుగుతుంది. నిత్యం నా స్మరణ చేసేవారిని, నన్ను ఆరాధించే వారిని నేను తప్పక ఉద్ధరిస్తాను. ఇదే నా వాగ్దానం'
శ్రీ సాయిదేవుని పలుకులు నిశితంగా పరిశీలిస్తే సదా స్మరణ, నిస్వార్ధంగా సేవ, నిత్య నామస్మరణయే ఉత్తమమైన ఆరాధన అని మనకు అవగతమౌతుంది. అనగా సాయి నిత్య భక్తులకే ఆయన సంపూర్ణ అనుగ్రహం ప్రాప్తం.
భగవద్గీతలో కూడా శ్రీ కృష్ణ భగవానుడు అనన్య చింతన, ఉపాసన, నిత్యం ఆరాధన చేయాలని అప్పుడు వారి యోగ క్షేమాలను తప్పక చూస్తానని అద్భుతంగా తెలియజేశారు.
పనుల ఒత్తిడి వలన లేక, ఆలసత్వం లేక స్వార్ధ చింతనతోనో ఈ కాలంలో చాలా మంది భక్తులు కేవలం గురువారాలలోనే సాయిని సేవించడం ఒక కార్యక్రమంగా పెట్టుకున్నారు. వారంలో కనీసం ఒక రోజు దైనందిన కార్యక్రమాలను పక్కన పెట్టి దేవాలయానికి వెళ్ళడం మంచిదే. కాని అటువంటి భక్తులకు శ్రీ సాయి నుండి లభించే కటాక్షం, అనుగ్రహం స్వల్పంగా ఉంటుంది. అందుకే ఈ కలి కల్మషం నుండి విడిపడాలన్నా, శ్రీ సాయి చేత ఉద్ధరింపబడాలన్నా శ్రీ సాయి అనూపమానమైన రక్షణ కవచం లభించాలన్నా మనం చేయాల్సింది నిరంతర, నిత్య సాయి ఆరాధన.
శరీరం ఏ కర్మ చేస్తున్నా మనస్సు దైవ విచారణలో, స్మరణలో, చింతనలో మునిగి ఉండాలి. ఆహారం స్వీకరించే ముందు సర్వం శ్రీ శిరిడీ సాయి సమర్పయామి అని మనస్సులోనే అర్పించాలి. ఆహారంలో ఒక ముద్ద పక్కన పెట్టి ఇంటి బయట విడిస్తే పక్షులు, చీమలు వంటి క్రిమి కీటకాదులు వాటిని స్వీకరించి తమ ఆకలిని తీర్చుకుంటాయి. ఫని ప్రారంభించబోయే ముందు సాయి అని ఒకసారి తలుచుకుంటే చాలు ఎటువంటి కష్టతరమైన కార్యమైనా దిగ్విజయంగా పూర్తవుతుంది. చివరగా కోరికలతో కాక నిస్వార్ధంగా సాయిని ప్రార్ధించాలి. మనం అడిగింది కాక మనకు అవసరమైన వాటిని శ్రేయోదాయకమైన వాటిని సాయి తప్పక ప్రసాదిస్తారు.
'మన భక్తి ఆరాధనలను కేవలం గురువారాలకు మాత్రమే పరిమితం చేయక అన్ని రోజులలోనూ నిత్య భక్తుల వలె సాయిని సేవించడం సాయి కరుణా కటాక్షాలకు పాత్రులవడానికి అతి సులభమైన మార్గం'.
సర్వం శ్రీ శిరిడీ సాయినాధార్పణమస్తు
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|