|
|
Articles: My Thoughts | వినయమే శ్రేయోదాయకం - Mr. Pratap Cherukuri Pratap
| |
మానవాళిని నేడు పట్టి పీడిస్తున్న దుర్గుణ భూతాల్లో అత్యంత ముఖ్యమైనవి గర్వాహంకారాలు. నేడు మానవాళికి ఎన్నడూ లభించని విధంగా భోగభాగ్యాలు, సుఖ సౌఖ్యాలు లభిస్తున్నాయి. మొత్తం ప్రపంచాన్ని గురించి తెలుపగలిగే కంఫ్యూటర్లు వచ్చాయి. ధనార్జన విపరీతంగా పెరిగింది. జీవితం విలాసవంతం అయ్యింది. వాటితో పాటుగా గర్వాహంకారాలు కూడా కొండంత పెరిగాయి. గోరంత తెలిసి ఉన్నా కొండంత తెలిసిందని విర్రవీగడం, ఎదుటి వారిని చులకనచేసి మాట్లాడడం, అసభ్య, పరుష పదజాలంతో దూషించడం సర్వ సాధారణమైపోయింది. నేటి మానవాళిలో వినయ, విధేయతలు, వినమ్రత మచ్చుకైనా కానరావడం లేదు.
మనిషికి గర్వం ఎప్పుడూ పనికి రాదు. అణుకువలోనే అందం ఉంది. భగవంతుడు మెచ్చని దుర్గుణం గర్వం. కొందరు పరిస్థితులను గమనించక అన్నివేళలా గర్వాహంకారాలతో మిడిసిపడుతుంటారు. అందరినీ ఎదిరించగలమని దర్పాన్ని ప్రదర్శిస్తుంటారు. శత్రువులు బలంగా ఉన్నప్పుడు తనను తాను తగ్గించుకొని, తదనంతరం తలెత్తుకు తిరగడం వివేకపూరితమైన చర్య. జీవితంలో ఎదురయ్యే కష్ట నష్టాలు కూడా మనకు శత్రువులే.
ఈ సందర్భంలో ఒక కథను స్మరించుకుందాం.
ఒకసారి సముద్రుడు తన భార్యలను పిలిచి 'నదులన్నీ తమ ప్రవాహంలో అడ్డుగా ఉన్న పెద్ద పెద్ద వృక్షాలను, బండలు, దుంగలను ఒక్క ఉదుటున పెకలించి తమతో పాటు తీసుకుపోతున్నాయి. కాని తమ ఒడ్డున ఉన్న అత్యంత అల్పమైన గడ్డిమొక్కను పెకలించలేకపోతున్నాయి. ఎన్ని వరదలు వచ్చినా, నదులెంత ఉధృతంగా ప్రవహించినా గడ్డిమొక్క మాత్రం సుఖ జీవనం సాగించగలుగుతోంది. కారణం ఏమిటి ?' అని అడిగాడు. సముద్రుని భార్య అయిన గంగాదేవి ముందుకు వచ్చి మిక్కిలి వినయ విధేయతలతో ' స్వామీ! తాము ఉధృతంగా ప్రవహిస్తున్నప్పుడు మార్గంలో అడ్డుగా ఉండే వృక్షాలు, బండరాళ్ళను అవలీలగా పెకలించి వేయడానికి కారణం ఆ వృక్షాలు, బండలు నదీ ప్రవాహాన్ని ఎదిరించేందుకు యత్నించడమే. అదే ఒడ్డున ఉండే గడ్డిమొక్క ప్రవాహం వచ్చినప్పుడు అణిగి ఉంటుంది. ఉధృతం తగ్గాక తిరిగి తలెత్తుకు నిలబడుతుంది. ఆ గడ్డిమొక్క సమయోచిత ప్రవర్తనే దానిని అన్ని ఉపద్రవాలకు ఎదురు నిలవగలిగే శక్తిని ఇస్తోంది' అని వివరించింది.
ఈ కథ మానవులకు అణుకువ, విధేయతల ఆవశ్యకత గురించి అద్భుతంగా తెలియజేస్తోంది. కష్ట నష్టాలు, ఆందోళనలు ప్రతీ ఒక్కరి జీవితంలోనూ తప్పనిసరి. చీకటి వెనుకే వెలుగు, రాత్రి వెనుకే పగలు వలె కష్టం తర్వాత సుఖం రావడం తప్పనిసరి. కష్టాలు వచ్చినప్పుడు గర్వాహంకారాలతో ప్రవర్తించరాదు. ఆ కష్టాలను ఎదిరించి నిలవగలిగే శక్తి ఉన్న వారి విషయం వేరు. వాటిని ఎదిరించి, ఎదురొడ్డి నిలువలేని వారు తమ శక్తి సామర్ధ్యాలను గ్రహించుకొని, గర్వాహంకారాలను విడిచిపెట్టి, అణిగి మణిగి ఉండగలిగితే ఎలా వచ్చిన కష్టం అలానే పోతుంది. తిరిగి జీవితంలో ఆనంద పరిమళాలు విరబూస్తాయి. అట్లా కాక తగినంత శక్తి సామర్ధ్యాలు లేకపోయినా కష్టాలకు, ప్రతికూల పరిస్థితులలో ఎదురు నిలిస్తే వినాశనం ఖాయం.
దుర్యోధనుడికి పాండవులను ఎదిరించగల శక్తి సామర్ధ్యాలు లేవు. అయినా గర్వాహంకారాల వలనే వారితో ఏరి కోరి శత్రుత్వం తెచ్చుకొని చివరకు దుర్భరమైన మరణం పొందాడు. రావణాసురునికి శ్రీ రాముని ఎదిరించగల శక్తి లవలేశమైనా లేదు. సీతను అపహరించి, ఎందరు హితవు చెప్పినా పెడచెవిన పెట్టి, సీతను రామునికి అప్పగించక, ఏరి కోరి విరోధాన్ని తెచ్చుకొని, యుద్ధంలో బంధు మిత్ర, సపరివారాన్ని మొత్తం పోగొట్టుకొని చివరకు హతం అయ్యాడు. ఎదుటివారి గొప్పదనాన్ని తెలుసుకోకుండా అయిన దానికి, కానిదానికి అహంకారంతో విర్రవీగడం, ఎదుటివారు తనకంటే అల్పులని భావించి మిడిసిపడడం వినాశకారి అన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. వినయ విధేయతలు మనిషికి అందానిచ్చే ఆభరణాలు. అందుకే ఏమీలేని తాటాకు ఎగిరెగిరి పడ్తుంది, అన్నీ వడ్డించిన అరిటాకు అణిగి మణిగి ఉంటుందని మన పెద్దలు చెబుతూ ఉంటారు.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|