|
|
Articles: Devotion | సాయి లీలామృతం - Mr. Pratap Cherukuri Pratap
| |
భక్తుల పాలిట ఆశ్రిక కల్పవృక్షం, కామధేనువు, భక్త జన బాంధవుడు, కలియుగ దైవం శ్రీ సాయినాధునిది ఒక అద్భుతమైన, అసామాన్యమైన విశిష్ట అవతారం. అఖిలాండకోటి బ్రహ్మాండాలకు నాయకునిగా, యోగులందరికీ సామ్రాట్టుగా కీర్తించబడుతున్న శ్రీ సాయినాధుడు భక్త సులభుడు. భక్తులకు ఎట్టి కఠోర నియమాలకు పెట్టక, కేవలం దర్శన, స్మరణలతోనే ప్రసన్నులౌతారు. తనకు సంపూర్ణ, సర్వస్య శరణాగతి ఒనరించిన భక్త జనావళికి వారి లలాట లిఖితంలో లేని వాటిని సైతం ప్రసాదించే బ్రహ్మదేవుడు శ్రీ సాయి. భక్తులకు ఇహపర శ్రేయస్సు చేకూర్చడానికే వచ్చానని తరచుగా బాబా చెప్పేవారు. ఐహికపరమైన, ప్రాపంచిక కోరికలతో దర్శించరాదని ఇతరులకు బోధిస్తున్న ఒక భక్తునితో 'అలా చెప్పవద్దు. నా సన్నిధికి మొదట అందరూ అలానే వస్తారు, కష్టాలు, కోరికలు తీరి, జీవితంలో ఒక స్థాయి చిక్కాక నా మార్గంలో ప్రయాణం చేసి సన్మార్గులౌతారు' అని అన్నారు శ్రీ సాయినాధులు.
శ్రీ సాయి షిర్డీకి వచ్చిన తొలి రోజులలో ఆకుపచ్చని కఫనీ, తలకట్టు ధరించి, సటకా చేత బట్టుకొని, నిత్యం ఆ గ్రామంలో కేవలం అయిదు ఇళ్ళలో మాత్రమే భిక్షాటనం చేసేవారు. అంతేకాక, ఆయన రోగులకు ఉచితంగా వైద్యం చేసేవారు. ఇతర వైద్యుల వలే కాక శ్రీ సాయి వైద్య విధానం చాలా విభిన్నంగా ఉండేది. ఒకసారి షిర్డీ గ్రామంలో గణపతి హరికణాడే అనే ఒక భూకామందుకు కుష్ఠువ్యాధి వచ్చింది. బాబా అనుగ్రహం ఫలితంగా ఆ వ్యాధి వెంటనే తగ్గిపోయింది. కానీ బాబా అతనికి విధించిన కొన్ని కట్టుబాట్లను హరికనాడే ఉల్లంఘించడంతో ఆ వ్యాధి మళ్ళీ ప్రాణాంతకంగా తిరగబెట్టి కొద్ది రోజులలోనే అతను మరణించాడు. హరికణాడే మరణవార్త విన్న శ్రీ సాయిలో ఒక విధమైన పరవర్తన వచ్చింది. 'ఈ మనుషులు ఎంత పిచ్చివారు? వారి మంచి కోరి చెప్పినా, తమకు నచ్చిందే చేస్తారు కాని మొరొకటి చెయ్యరు గాక చెయ్యరు' అనుకొని ఆనాటి నుండి రోగులకు మందులు ఇవ్వడం మానేసి తాను షిర్డీలోని మసీదులో తన యోగశక్తితో వెలిగించిన పవిత్రమైన ధుని నుండి వచ్చే బూడిదను ప్రసాదంగా ఇవ్వసాగారు. శ్రీ సాయి తన భక్తులకు ఆశీర్వదించి ఇచ్చే బూడిదనే ఊదీ (విభూతి) అని అంటారు. అది ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించడమే గాక సమస్త దుఃఖాలను, భయాందోళనలను దూరం చేసేది. అన్ని రుగ్మతలకు దివ్యౌషధం, సకలైశ్వర్య ప్రదాయిని అయిన శ్రీ సాయినాధుని ఊదీ చేసే మహిమలలో ఒక దానిని ఇప్పుడు స్మరించుకుందాం.
మహారాష్ట్రలోని హర్ధా గ్రామంలో నివసించే ఒక వృద్ధుడు మూత్రకోశంలో రాయితో బాధపడేవాడు. ఆ రాయిని ఆపరేషను చేసి తీయాలని దాక్టర్లు సలహా ఇచ్చారు. కాని అప్పటికే 70 సంవత్సరాల వయస్సు కలిగిన ఆ వృద్ధుడు స్వతాహాగా మనోబలం లేనివాడు కావడం చేత ఆపరేషనుకు ఒప్పుకోలేదు. ప్రసిద్ధులైన దాక్టర్లు మందుల ద్వారా ఆ రాయిని కరిగించాలని చూశారు గాని అది సాధ్యపడలేదు. కనుక ఆ బాధ వలన ఇక మరణమే శరణ్యమని ఆ వృద్ధుడు తీవ్రమైన మనోవేదన అనుభవించసాగాడు. ఒకరోజు ఆ గ్రామపు ఇనాముదారు ఆ వృద్ధుడు ఇంటికి ఏదో పని మీద వచ్చాడు. ఆ వృద్ధుడు పడే బాధను గమనించి తన వద్దనున్న శ్రీ సాయి విభూతిని నీటిలో కలిపి ఆ వృద్ధుడి చేత తాగించాడు. అపర యోగీశ్వరుడూ, పరబ్రహ్మ స్వరూపీ అయిన శ్రీ సాయినాధుని విభూతి మహిమ చూడండి.... అయిదు సంవత్సరాలలో కరగని ఆ రాయి విభూతిని సేవించిన అయిదు నిమిషాలలోనే కరిగి మూత్రంతో పాటు బయటకు వచ్చింది. ఆ వృద్ధుని బాధ శీఘ్రమే మటుమాయం అయ్యింది. తాను కోరకుండానే తన బాధను తగ్గించి తన జీవితంలో వెలుగురేఖలు నింపిన కలియుగదైవం శ్రీ సాయికి ఆ వృద్ధుడు అనేక వేల కృతజ్ఞతలు తెలియజేసుకున్నాడు.
మరో సందర్భంలో బొంబాయిలోని కాయస్త ప్రభు కులానికి చెందిన ఒక మహిళ ప్రసవ సమయంలో చాలా బాధపడేది. ప్రతీ ప్రసవమూ ఆమెకు ఒక కొత్త జన్మలా ఉంది. ఒక సందర్భంలో ఆమె గర్భవతి అయ్యింది. ఎప్పటి వలే ఈసారి కూడా ప్రసవ సమయంలో తాను పడే బాధలను తలుచుకొని ఆందోళన పడసాగింది. ఆమె దూరపు బంధువైన కళ్యాణ్ నివాసి అయిన రామ మారుతి ప్రసవానికి ముందు షిర్డీ వెళ్ళమని ఆ కుటుంబానికి సలహా ఇచ్చాడు. ఆ భార్యా భర్తలిద్దరూ షిర్డీకి పోయి కొన్ని నెలల పాటు ఉన్నారు. ప్రతిరోజు మసీదుకు పోయి బాబాను పూజించసాగారు. ప్రసవ సమయంలో ఎప్పటివలే ఆమె సమస్యలు ఎదుర్కోసాగింది. చుట్టుపక్కల వారు బాబా భజన చేస్తూ ఆమె చేత విభూతిని తాగించారు. ఆశ్చర్యంగా కొద్దిసేపటిలోనే ఆమె నొప్పులన్నీ తగ్గిపోయాయి. సుఖ ప్రసవం జరిగింది. పండంటి కొడుకు పుట్టాడు. కొద్ది రోజుల తర్వాత శ్రీ సాయిని దర్శించి ఉదీ ప్రసాదాలు తీసుకొని ఆనందంగా తమ ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు. శ్రీ సాయి ఊదీ చేసే మహిమలింతింత కాదయా!
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|