|
|
Articles: My Thoughts | ఆత్మ విశ్వాసం - Mr. Pratap Cherukuri Pratap
| |
పూర్వం మగధదేశంలో నివసించే రామశర్మ అనే బ్రాహ్మణుడు వర్తకం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య చాలా అనుకూలవతి. సత్వ గుణ సంపన్నురాలు. ఫిల్లలను, భర్తనూ ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉండేది. కోరికలను అదుపులో ఉంచుకుంటూ సంతృప్తితో జీవిస్తుండడం వలన ఆందోళనలు, అశాంతి వారికి ఆమడదూరంలో ఉంవి. అత్యాశకు పోకుండా కొద్దిపాటి లాభాలతో వర్తకం చేస్తుండడం వలన రామశర్మ వ్యాపారం సాఫీగా సాగిపోతూ ఉండేది. పైగా కల్తీ లేని సరుకులను తక్కువ ధరకు అమ్ముతాడన్న మంచి పేరు కూడా వచ్చింది.
రోజులన్నీ ఒకేలా ఉంటే దానిని జీవితం అని ఎందుకు అంటారు? రామశర్మ భార్యకు అనారోగ్యం వచ్చింది. దూర దేశంలో వైద్యం చేయించడం మొదలుపెట్టాడు. ఇద్దరు పిల్లలకు పెళ్ళిళ్ళు కూడా చేసేశాడు. వయో భారం వలన ఇదివరకటిలా వ్యాపారం చెయ్యలేకపోతున్నాడు. ఆదాయం మందగించింది, ఖర్చులు ఎక్కువయ్యాయి. పిల్లలు వ్యాపారం నిమిత్తం దూరదేశాలకు వలస వెళ్ళిపోయి తల్లిదండ్రులను పట్టించుకోవడం మానేశారు. జీవితంలో ఎదురైన ఈ కష్టాల పరంపరను తట్టుకోలేక తల్లడిల్లిపోయాడు.
ఆ సమయంలో వారి గ్రామానికి ఒక సాధుపుంగవుడు వచ్చాడు. ఆయన సర్వసంగ పరిత్యాగి. సకల వేద పారంగతుడు. ఊరూరూ తిరుగుతూ అధ్యాత్మిక గోష్టి గావిస్తూ ప్రజలను సన్మార్గంలో నడిపించే యత్నించేవాడు. ఆయన వద్దకు వళ్ళి పాదాలపై పడి తన కష్టాలను విన్నవించుకున్నాడు రామశర్మ.
అతని మాటలను విన్న ఆ సాధుపుంగవుడు చిరునవ్వుతో 'నాయనా! కష్టాలు, సుఖాల పరంపర ప్రతీ వారి జీవితంలో తప్పనిసరి. వాటిని ధైర్యంతో, ఆత్మ విశ్వాసంతో ఎదుర్కోవాలే గాని పిరికితనంతో వాటి నుండి పారిపోకూడదు. పిరికివానికి ఇహ పరాలు రెండూ చెడతాయి. ధర్మానికి మారుపేరైన శ్రీరామ చంద్రునికి, మహలక్ష్మీ అవతారమైన సీతమ్మ తల్లికీ కష్టాలు తప్పలేదు కదా! రాజ్య భోగాలు దూరమై పన్నెండేళ్ళూ వనవాసం చేసి పడరాని కష్టాలు పడ్డారు. సాక్షాత్తు శ్రీకృష్ణుడు తోడున్నా పాండవులు ఎంతటి కష్టాలు పడ్డారో మనందరికీ తెలుసు కదా! వారి కష్టాలతో పోలిస్తే నీకు వచ్చినవి ఎంతటివో ఒక్కసారి ఆలోచించు. జీవితాంతం సుఖాలు మాత్రమే ఉండాలి కష్టాల నీలినీడ మనపై పడకూడదని భావించడం అవివేకం. చేదు తిన్న తర్వాతే తీపి తీయనత్వం అనుభవం అవుతుందన్న రీతిన కష్టాలను చవిచూసినప్పుడే సుఖాలలోని మాధుర్యం మనకు అర్ధమౌతుంది. అన్ని ద్వంద్వాలనూ సమంగా స్వీకరించే ఓర్పు, నేర్పు మనం అలవరచుకోవాలి.
కష్టాలు గురువు వంటివి. మనకు జీవిత సత్యాలను బోధించదానికి, ఓర్పు, సహనం, విశ్వాసం వంటి సద్గుణాలను నేర్పడానికే వస్తాయి. వాటిని చిరునవ్వుతో ఎదుర్కొని అధిగమించాలే కాని బెంబేలెత్తి పారిపోకూడదు' అని ఉద్బోధించారు.
అమృతతుల్యమైన ఆ మాటలకు రామశర్మకు జ్ఞానోదయం అయ్యింది. జారిపోయిన ఆత్మవిశ్వాసాన్ని మళ్ళీ నింపుకున్నాడు. ధైర్యంతో ముందుకు సాగి మళ్ళీ జీవితంలో ఉన్నత స్థాయిని సాధించాడు.
చీకటి వెలుగులు, అమావాశ్య పౌర్ణమి, రాత్రి పగలు వలె ద్వంద్వాలు. ప్రతీవారి జీవితంలో ఈ చక్రభ్రమణం తప్పనిసరి. కష్టాలు వచ్చినప్పుడు పరిస్థితులను, ఇతరులను నిందించకుండా భగవంతునిపై భారం వేసి ఆత్మవిశ్వాసంతో ఆ పరిస్థితి నుండి బయటపడే మార్గం ఆలోచించాలి.
సుఖాలలో మునిగి తేలుతున్నప్పుడు భగవంతుని విస్మరించరాదు. సదా భగవన్నామస్మరణ చేయడం, సత్కర్మలు ఆచరించడం, కరుణ, జాలి, క్షమలతో పరులను ప్రేమించడం, ఇతరులకు వీలైనంతగా సహాయం చేయడం, అన్నార్తులను ఆదుకోవడం వంటి సత్కార్యాలను చేస్తే భగవంతుడు సంతోషించి మానవులను భవిష్యత్తులో కష్టాల కడలిలో మునిగిపోకుండా కాపాడుతాడు. కామ, క్రోధాది అరిషడ్వర్గాలను లోబర్చుకొని సత్వగుణ సంపన్నులమై శాంతియుత జీవనం సాగించటం అత్యావశ్యకం. ఇతరులను తమతో పోల్చుకొని తాము దురదృష్టవంతులమన్న నైరాశ్యాన్ని సత్వరం విడనాడాలి. ఈ సృష్టిలో జరిగే ప్రతీ సంఘటన ఈశ్వరేచ్ఛ ప్రకారమే జరుగుతుంది. సంపదలు కోల్పోతే తిరిగి సాధించుకోవచ్చు కానీ ఆత్మవిశ్వాసం, ధైర్యం కోల్పోతే మాత్రం తిరిగి సాధించుకోలేము.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|