TeluguPeople
  are the trend-setters

 
Articles: My Thoughts
ఆధ్యాత్మిక సంపద
- Mr. Pratap Cherukuri Pratap
  Page: 1 of 1    
ప్రపంచ దేశాలన్నింటిలోకెల్లా భారతదేశం ఆధ్యాత్మిక సంపదలలో సుస్సంపన్నం. వేదభూమిగా కీర్తిగాంచిన మన దేశం ధర్మ శాస్త్రాలకు నిలయం. అరవై నాలుగు కళలకు పుట్టిల్లు. ఫరమ నిష్టాగరిష్టులు, తపోనిష్టులైన మహర్షులెందరో వెలసి అనితర సాధ్యమైన తపశ్శక్తిని సాధించి తద్వారా మనకు ఒక చక్కని సంస్కృతీ, సాంప్రదాయాలను ఏర్పాటు చేశారు. వేదశాస్త్రాలను అర్ధం చేసుకోలేని వారి కోసం ఉపనిషత్తులను, పురాణేతిహాసాలను రచించి తిరుగులేని ఆధ్యాత్మిక సంపదను మనకు అందించారు. అవి మనకు శిరోధార్యం. సదా అనుసరణీయం. వాటిని శ్రద్ధగా చదివి, ఆకళింపు చేసుకొని ఆచరించిన వారి జీవితంలో ఎల్లప్పుడూ ఆనందమే. అశాంతి, అలజడులు మచ్చుకైనా కనిపించవన్నది యుగ యుగాలుగా నిరూపింపబడిన సత్యం. చరిత్రను పరికిస్తే ఎందరో పరాయి దేశస్థులు, మతస్థులు మన దేశంపై దండెత్తి విలువైన రాజ్య సంపదను దోచుకుపోయారు. కాని మన అతి విలువైన ఆధ్యాత్మిక సంపదను మాత్రం ఏమీ చేయలేకపోయారు. అవి ఈనాటికీ వివిధ రూపాలలో గుప్తమై ఉన్నాయి. జిజ్ఞాస కలిగిన వారు శ్రద్ధతో, పట్టుదలతో యత్నిస్తే మనకు లభ్యం అవుతాయి. మన జీవిత విధానాన్నే మార్చేస్తాయి. మన మహర్షుల తాపసిక విధానమే మన దేశాన్ని ఇంతకాలం కాపాడుతూ వచ్చింది. విషపు విదేశీ సంస్కృతి అతి వేగం గా చొచ్చుకొస్తున్న ప్రస్తుత తరుణంలో మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. విదేశీ సంస్కృతిని అవలంబిస్తే అధోగతి పాలు కావడం తథ్యం. ప్రపంచ విజేత అయిన అలెగ్జాండర్ ఒకసారి తన జైత్ర యాత్రలో భాగంగా భారతదేశం వచ్చాడు. ఒక రాజ్యంపై దండయాత్ర కోసం వెళ్తుండగా ఒక అడవిలో ఒక చెట్టు కింద తపోనిష్టలో ఉన్న ఒక మహర్షిని చూశాడు. అతను ఆశించినట్లు ఆ మహర్షి కళ్ళు తెరవలేదు. భగవధ్యానంలో మునిగి చుట్టూ ఏమి జరుగుతున్నదీ పట్టించుకోవడం లేదు. దీనితో అలెగ్జాండర్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ప్రపంచాన్నే గెలిచి విశ్వ విజేతగా నిలిచిన తనకు ఒక సాధారణ వ్యక్తి తలవంచి అభివందనం చేయకపోవడమా? పైగా తనను గమనించనట్లు కళ్ళు మూసుకొని కూర్చొని తన పట్ల నిర్లక్ష్య వైఖరి ప్రకటించడమా? అవమానంతో రంకెలు వేస్తూ ఖడ్గం తీసి అమాంతం ఆ తపస్వి తల నరకబోయాడు. అప్పుడు కళ్ళు తెరిచిన ఆ మహర్షి అతనిని చూసి బిగ్గరగా నవ్వాడు. ఆయన ప్రవర్తన చూసిన అలెగ్జాండర్ కోపం మరింతగా హెచ్చింది. 'ఎందుకలా నవ్వుతున్నావు? మరణమంటే నీకు భయం లేదా ?' అని ప్రశ్నించాడు. అందుకు ఆ మహర్షి ఒక్క క్షణం తపోనిష్టలోనికి వెళ్ళి అనంతరం ఎంతో మృదుస్వరంతో శాంతంగా 'నాయనా, నువ్వు ఖడ్గం తీసి నన్ను చంపాలనుకున్నావు. నువ్వు నా శరీరాన్ని మాత్రమే ఖండ ఖండాలుగా నరకగలవు, శరీరం అనిత్యం. ఏనాటికైనా నశించేది కాబట్టి అది నీకు సాధ్యం. కాని నువ్వు నన్నేమీ చెయ్యలేవు. నాకు మరణం రాదు. ఎందుకంటే నేను నిత్య సత్య ఆత్మ స్వరూపుడిని. ఆత్మను శస్త్రాలు ఛేదించలేవు. అగ్ని దహించలేదు. నీరు తడుపజాలదు. ఆత్మ నిత్యం. సత్యం. అమరం' అని అన్నారు. ఆ మాటలు విన్నంతనే అలెగ్జాండర్ సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాడు. ఆత్మతత్వం గురించి ఇంతటి అద్భుతమైన ప్రబోధాన్ని అతను ఇంతవరకూ విని ఉండలేదు. ఆధ్యాత్మిక వైభవంతో విరాజిల్లుతున్న ఇటువంటి పరమ పవిత్రమైన దేశంపై దండెత్తడం మహా పాపమని తలిచి ఆ మహర్షికి శిరస్సు వంచి అభివాదం చేసి తిరిగి తన దేశానికి వెళ్ళిపోయాడు. చూసారా! మన దేశ వైభవం? విశ్వ విజేత అయిన అలెగ్జాండర్ చక్రవర్తినే ఒక మహర్షికి శిరస్సు వంచి నమస్కారం చేసేలా చేసింది. ఆ మహర్షికి ఉన్న ధైర్యం, నిర్భయత్వం కేవలం ఆత్మజ్ఞానంతోనే వస్తాయి. అది సాధించేందుకు నిరంతర కృషి, మనసును నిర్మలంగా ఉంచుకోవడం సదా భగవన్నామస్మరణ వలనే సాధ్యం. భగవంతుని నీడలో బ్రతికేవారికి కష్టాలు దూరంగా ఉంటాయి. అందుకే మనం వేసే ప్రతి అడుగూ భగవంతుని ఆజ్ఞానుసారం వెయ్యాలి. ఎల్లప్పుడూ సత్యం పలుకుతూ ధర్మయుతంగా జీవించాలి. తన కోసమే కాక తనకు ఇంత నిలువ నీడ కల్పించి తన ఉనికికి అర్ధం కల్పించిన సమాజం కోసం ఇతోధికంగా కృషి చెయ్యాలి. నైతిక విలువలను ప్రాణం కంటే ఎక్కువగా కాపాడుకుంటూ నిత్యం ఆచరించాలి. ఇచ్చేది, తీసుకునేది ఆ సర్వేశ్వరుడే కాబట్టి జీవితంలో సంభవించే కష్టనష్టాలకు ఏ మాత్రం ఆందోళన పడకుండా భగవంతునిపై భారం వేసి నిశ్చలంగా ఉండాలి. ఐహిక సంపదలు అశాశ్వతం. ఏనాటికైనా నశించేవే. ఆధ్యాత్మిక సంపదే శాశ్వతమైనది. ఇహంలోనూ, పరంలోనూ పరమార్ధం కల్పించి ముక్తిని ప్రసాదిస్తుంది. కాబట్టి నిత్యమైన ఆధ్యాత్మిక సంపదను పోగుచేసుకొనేందుకు మనమంతా కృషి చేయాలి. మనమంతా ఆ భగవంతుని బిడ్డలం. బిడ్డల అవసరాలను తల్లి అడుగకుండానే తీరుస్తుంది. అట్లే మన భౌతిక అవసరాలను కూడా ఆ భగవంతుడే తీరుస్తాడు. అందుకోసం రాత్రింబవళ్ళూ ఆందోళనకు గురవడం అనవసరం. భగవంతుడు మనల్ని ఎలా సృష్టించాడో మనం కూడా అలాగే జీవించాలి. సంతృప్తి అనేది ఆనందమయ జీవితానికి అత్యావశ్యకం. కోరికలు ధు:ఖానికి హేతువులు. ఒకటి తీరినా పరిస్థితుల ప్రభావం వలన క్రొత్తవి చిగురించి మునుపటి కోరికలు తీరిన సంతోషం కూడా మయమౌతుంది. క్రొత్త వాటిని తీర్చుకోవాలన్న ఆరాటం మొదలై తత్ఫలితంగా అశాంతి, ఆందోళన మొదలౌతాయి. అందుకే కోరికల వేటలో సాగే మానవునికి ఆనందం ఎప్పుడూ ఆమడదూరంలో నిలిచి పోతుంది. కోరికలు లేని మనస్సు నిశ్చల సాగరం వంటిది. శాశ్వత ఆనందానికి చిరునామా! హిమాలయ శిఖరాల కంటే ఉన్నతంగా ఎదిగిన మన దేశ సంస్కృతిని కాపాడుకోవలసిన బాధ్యత మనందరిపై ఉందన్న విషయాన్ని మనందరం గుర్తెరగాలి.

Read 1 Comment(s) posted so far on this Article!

  Page: 1 of 1    



 
Advertisements
Advertisements
Advertisements
Get the best Results!
Reach potential customers thru TeluguPeople.com, advertise with us!!
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
College Admissions in USA
Guaranteed Admissions or Processing Fee will be refunded. At USAdmissions.com
EducationAndhra.com
One-stop Destination for Information on Educational Resources related to Andhra Pradesh
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2023 TeluguPeople.com, All Rights Reserved.