|
|
Articles: TP Features | తెలుగా, ఆంద్రమా? - Site Administrator
| |
(వాగరి)
1. వింతపోకడ
మనం మాట్లాడేది తెలుగా, ఆంద్రమా? మనం తెనుగులమా, ఆంద్రులమా? మనం నివసించేది తెలుగునాడా, ఆంద్రప్రదేశమా?
'తెలుగా, ఆంద్రమా అనే వివాదానికి తావే లేదు. మనం మాట్లాడేది తెలుగే, కాని ఆంద్రము అనే మాట, పరాయిది అయి ఉండి కూడా, తెలుగులోకి వచ్చి నిలిచిపొయ్యింది. కాబట్టి రెండు మాటలను - తెలుగు, ఆంద్రము -వాడుకొంటే సరిపోతుంది' అంటారు కొందరు విరివి చూపు వాదులు. వారితో మనకు పేచీ లేదు.
కానీ పోయిన వారు పెద్దలు కాశీనాథు నాగేశ్వరరావు తన ఆంద్రవాఙ్మయ చరిత్రలో పయి బావాన్నే ఉటంకించి, తరువాత పొత్తము అంతా ఆంద్రము అనే మాటనే వాడినారు ఎక్కువగా. తెలుగు నానుడి (literary) రంగంలో సాగుచేసిన, నేడు చేస్తూ ఉండే రచయితలు అందరు కూడా ఈ రాగాన్నే ఆలపిస్తున్నారు, ఆ పోకడనే పోతున్నారు.
ఇదే తెనుగులలో నేడు కనిపిస్తుండే ఒక వింత పోకడ - మొండి పోకడ. 'అన్నము శివసారూపము. ఏ అన్నము అయితే ఏమి, వరి అన్నమే పెట్టు' అనే తెలుగు సామెత ఈ మొండి వయికరినే చూపుతుంది.
మనది తెలుగే అని ఒప్పుకోవడము, అక్కరపడిన అప్పుడు ఆంద్రము అని వాడడము, మనము తెలుగులమే అని అంగీకరించడము, తీరా ఒచ్చినాక ఆంద్రులము అని అనిపించడము, పిలిపించుకోవడము, ఇది తెలుగునాడే అని నొక్కి చెప్పడము, అరుగు ఎక్కుతూనే ఆంద్రప్రదేశము అని డబ్బా కొట్టడము - తెలుగుల మొండి వయికరికి మచ్చులు.
తెలుగులలో విరివిగా సాగుదల కలిగి ఉండే ఈ వింత పోకడను కొంచెము దగ్గరగా చూచి దానిని చర్చించడమే ఈ చిరు పొత్తము ఉద్దేశం. మనలో నేడు మసకగా మసులుతూ ఉండే ఈ తప్పుడు భావాన్ని కొంచెము దులపడమే ఈ చిన్న రచనలోని ఉల్లనము (purpose). తెలుగు జనులకు నేడు ముమ్మరంగా పట్టి ఉండే ఈ ముభావాన్ని రెండు జాడించడమే ఈ ఉరువు గురి.
కొన్ని వేల ఏళ్ళ కిందట సంస్కృతాన్ని మాట్లాడే, సంస్కృతంలో రాసే, సంస్కృతాన్ని ఆదరించే ఒక చిరు గుంపు (minority) పెక్కు చరితా కారణాలుగా యారాళము అయిన తెనుగులకు తరపు హోదాలో నిలవగలిగినవారు, నిలిచి సాగించుకోగలిగినారు. ఆ నాటి నుండి మందినాలించబడినారు (neglect), వారి తిండి తిప్పలు, కట్టు బొట్టులు, తీరు తెన్నులు, నుడి నానుడులు (language and literature) నాలించబడినాయి. ఆ చిరు గుంపు (వారిని సంస్కృతీయులు అందాము) నుడి నాడులు, తీరుతెన్నులు, విసాగు మప్పితాలు (culture and civilisation) మందికి చెందిన అట్టివి గానే చాటించబడినాయి, లెక్కకు ఎక్కినాయి.
కొన్ని నూరేళ్ళు గడిచిన తరువాత, తెలుగు జాతిని చూచిన వారికి, వారిలో రెండు పోకడలు కనిపించాయి. ఒకటి వారి సొంతము అయిన అది, రెండవది తమది అని వారు అనుకొనేది. తొలిది తెలుగు పోకడ, మలిది ఆ చిరు గుంపు లేక సంస్కృతీయులది. మెల్ల మెల్లగా తొలిది బతకడానికి, మలిది తమది అని బయట చెప్పుకోడానికి మొదలు పెట్టినారు తెనుగులు. దానితో మనము పూరాగా నూటికి నూరు పాళ్లు ఇరులము (dualists) అయినాము - ఇంట్లో ఒకటి బయటి ఒకటి, లోపల ఒకటి బయట ఇంక ఒకటి, మొగము ముందు ఒకటి, ఎనకాల మరి ఒకటి.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|