|
|
Articles: TP Special | శ్రీ వికృతి నామ పంచాంగం - Site Administrator
| |
చాంద్రమాన ప్రకారం ఈ సంవత్సరాన్ని శ్రీ వికృతి నామ సంవత్సరంగా పిలుస్తారు. బార్హస్పత్యమానం ప్రకారం శుభకృన్నామ సంవత్సరమని, గురుదయాబ్ధముచే ఆశ్వయుజాబ్దమని పిలుస్తారు. ప్రభవాది 60 సంవత్సరాల్లో 24వది వికృతి నామ సంవత్సరం.
గ్రహణాలు : ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ లో కనిపించే గ్రహణాలు లేవు.
ఈ ఏడాది వైశాఖం అధికమాసమైంది. అధిక వైశాఖ మాసంలో శుభకార్యాలు ఉండవు. నిజవైశాఖంలోనే శుభముహూర్తాలు ఉంటాయి. (ఏప్రిల్ 15 నుంచి మే 14 వరకు అధిక వైశాఖం, మే 15 నుంచి జూన్ 12 వరకు నిజ వైశాఖం.)
ఈ ఏడాది వర్షలగ్నం ధనుస్సు, లగ్నాధిపతి గురుడు తృతీయ స్థానమైన కుంభంలోనూ, లగ్నంలో రాహువు, చతుర్థస్థానంలో రవి, బుధ, చంద్ర, శుక్రులు, సప్తమమైన మిథునంలో కేతువు, అష్టమంలో కుజుడు నీచస్థితి పొందాడు. శని దశమస్థానంలో సంచారం.
ఇక జగర్లగ్నం వృషభం. లగ్నాధిపతి శుక్రుడు వ్యయస్థానమైన మేషంలో రవి, బుధులతో కలయిక. ద్వితీయమైన మిథునంలో కేతువు, ద్వితీయ, పంచమాధిపతి బుధుడు వ్యయస్థానంలో, తృతీయ మందు సప్తమ, వ్యయాధిపది కుజుడు నీచస్థితిలో, భాగ్య, రాజ్యాదిపతి అయిన శని పంచమైన కన్యలో, అష్టమ, లాభాధిపతి గురుడు రాజ్యస్థానం కుంభంలో ఉన్నారు. అష్టమ స్థానం ధనుస్సులో రాహువు సంచారం. శ్రీ వికృతినామ సంవత్సరానికి రాజు కుజుడు కాగా, మంత్రి బుధుడు. సైన్యాధిపతి, ఆర్ఘ్యాధిపతి, మేఘాధిపతి కుజుడు, సస్యాధిపతి గురుడు, రసాధిపతి చంద్రుడు, నీరసాధిపతి శుక్రుడు. నవనాయకుల్లో నలుగురు శుభులు కాగా, ఐదుగురు పాపులు. రాజు కుజుడై పాపి కావడం, సైన్యాధిపత్యం, ఆర్ఘ్యాధిపత్యం, మేఘాధిపత్యం పొందుటవల్ల రాజకీయ వైషమ్యాలు, ప్రజాసమస్యలు పెరుగుతాయి. అధికారంలో ఉన్నవారు ఒత్తిడులు ఎదుర్కొంటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అవగాహన లోపం వల్ల చిక్కులు తప్పకపోవచ్చు. తూర్పు, ఉత్తర ప్రాంతాల్లో ప్రకృతి వైపరీత్యాల వల్ల జననష్టం, వ్యాధులు. పంటలు సామాన్యంగా ఉంటాయి. ధరలు పెరుగుతాయి. ముఖ్యంగా ఆయిల్, పంచదార, ఇనుము, సిమెంట్, బియ్యం ధరలు పెరిగే సూచనలు. ప్రజల మధ్య కలహాలు, ఇరుగుపొరుగు దేశాలతో వివాదాలు నెలకొంటాయి. ఉగ్రవాదులతో ముప్పు ఏర్పడవచ్చు. రాజకీయాల్లో ఆశ్చర్యకరమైన పరిణామాలు చోటుచేసుకుంటాయి. వృద్ధ నాయకులకు గడ్డుకాలం. కళాకారులకు ఈ ఏడాది గతం కంటే మెరుగ్గా ఉంటుంది. వాహన, రోడ్డు ప్రమాదాలు అధికం. ఎవరికీ అంతుచిక్కని వ్యాధులు ప్రబలుతాయి. సాఫ్ట్వేర్, రియల్ ఎస్టేట్ రంగాలు కాస్త ఊపిరిపీల్చుకుంటాయి. 22-06-2010వ తేదీ జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి, మంగళవారం సా.5-28లకు స్వాతి నక్షత్రం, శివయోగం. భద్ర కరణం, వృశ్చిక లగ్నంలో సూర్యుడు ఆరుద్ర నక్షత్రంలో ప్రవేశం వల్ల ధరలు పెరుగుతాయి. వర్షాలు అంతగా ఉండవు. ఈ ఏడాది పశునాయకుడు యముడు అయినందున పశునష్టం, పాడిపరిశ్రమలకు గడ్డుకాలం.
ఈ ఏడాది పుష్కర నామం కలిగిన మేఘం ఉత్పత్తి వల్ల తక్కువ వర్షాలు ఉంటాయి. గాలులు అధికం. అన్ని దిక్కులకు అరిష్టదాయకం.
నవనాయక ఫలాలు :
రాజు కుజుడు : ప్రతిపక్షాలు, అధికార పక్షం మధ్య కీచులాటలు. అధికారం కోసం తాపత్రయం. ప్రజల మధ్య వైరుధ్యాలు, అగ్ని, చోర, రోగ భయాలు.
మంత్రి బుధుడు : పాలకులు సమన్వయంతో సమస్యలు అధిగమిస్తారు. వర్షం వాయువులతో కూడిన వాతావరణం ఉంటుంది.
సైన్యాధిపతి కుజుడు : అంటురోగాలు, యుద్ధ భయాలు, పొరుగు దేశాల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి.
సస్యాధిపతి శని : నువ్వులు, నల్లధాన్యాలు బాగా పండుతాయి.
ఆర్ఘ్యాధిపతి కుజుడు : తక్కువ వర్షాలు, కొన్ని ప్రాంతాలలో క్షామం.
మేఘాధిపతి కుజుడు : గాలులు అధికం, ధరలు పెరుగుతాయి. ఎర్రధాన్యాలు విశేషంగా పండుతాయి.
రసాధిపతి చంద్రుడు : నువ్వులు, నూనెలు, బెల్లం, తేనే, పాలు, చెక్కెర ధరలు పెరుగుతాయి.
నీరసాధిపతి శుక్రుడు : మంచి గంధం, బంగారం, ముత్యాలు, వస్త్రాల ధరలు అధికంగా ఉంటాయి.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|