|
|
Articles: TP Features | తెలుగు విజ్ఞానం అనంతం - Site Administrator
| |
కేతన తిక్కన కాలంనాటి విశిష్టకవి. తిక్కన చేతనే 'అభినవ దండి' అని ప్రశంసలందుకున్న కవి. దండి మహాకవి రాసిన 'దశకుమార చరిత్ర' అనే గద్యకావ్యాన్ని కేతన చంపూకావ్యంగా రాసి తెలుగులో కథాకావ్యాలనే ప్రక్రియకు శ్రీకారం చుట్టాడు. తెలుగువారి కోసం తెలుగులో మొదటి వ్యాకరణాన్ని 'ఆంధ్ర భాషాభూషణం' అనే పేరుతో కేతన రాశాడు. అంతేకాదు 'విజ్ఞానేశ్వరం' అనే పేరుతో తెలుగువారికి మొదటి ధర్మశాస్త్ర గ్రంథాన్ని కూడా కేతనే రాసి ఇచ్చాడు. ఇంత ప్రతిభావంతుడి గురించి మనం ఎంత చెప్పుకున్నా చాలదు.
భారతీయులకు న్యాయపద్ధతుల్ని పాశ్చాత్యులే నేర్పారని, బ్రిటీషువారు రూపొందించిన చట్టాన్నే భారతీయులు నేటికీ అనుసరిస్తున్నారని కొంతమంది చెప్తూ ఉంటారు. అంతకంటే దారుణం ఏమిటంటే న్యాయపద్ధతి అన్నదే భారతీయులకు తెలియదని పాశ్చాత్యుల నుంచే దాన్ని నేర్చుకున్నారని కొందరు భావిస్తుంటారు. కాని భారతీయ న్యాయపద్ధతులకు రెండువేల సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. హిందూ న్యాయ చట్టాలు చాలావరకు భారతీయ స్మృతుల మీదనే ఆధారపడి ఉన్నాయి. భారతీయులు నేటికీ అనుసరించే పద్ధతులు యాజ్ఞవల్క్య స్మృతి లాంటి సాంప్రదాయిక జ్ఞానానికి సంబంధించినవే.
యాజ్ఞవల్క్యుని పేరుతో అనేకులున్నారు. క్రీస్తుపూర్వం సుమారు వెయ్యి సంవత్సరాలనాడే శుక్ల యజుర్వేదాన్ని ప్రత్యక్షించుకున్న యాజ్ఞవల్క్యడున్నాడని శతపథ బ్రాహ్మణం చెప్తోంది. యాజ్ఞవల్క్య స్మృతిని రచించిన ఋషి క్రీస్తు శతాబ్ది ఆరంభ కాలానికి చెందినవాడని పండితుల అభిప్రాయం. యాజ్ఞవల్క్య స్మృతికి చాలా వ్యాఖ్యానాలున్నాయి. విజ్ఞానేశ్వరుడు రాసిన 'మితాక్షర' చాలా ప్రసిద్ధమైంది. హిందూ న్యాయశాస్త్రానికి సంబంధించిన అనేక విషయాలకు ఆధారం 'మితాక్షర' వ్యాఖ్యానంతో కూడిన యాజ్ఞవల్క్య స్మృతి.
'మితాక్షర' రాసిన విజ్ఞానేశ్వరుడు కర్నాటకలోని గుల్బర్గా జిల్లాకు చెందినవాడు. ఇటీవలి కాలంలో కర్నాటక ప్రభుత్వం విజ్ఞానేశ్వరుని రచనని కన్నడానికి అనువదించాలని నిర్ణయించుకుంది. గుల్బర్గా జిల్లాకు చెందిన శాసనసభ్యులు, మంత్రులు కలిసి విజ్ఞానేశ్వరుని గురించి లోకానికి తెలియజెప్పే ప్రణాళికను రూపొందించారు. అయితే ఇక్కడ ఒక విశేషం ఉంది. విజ్ఞానేశ్వరుడి పుస్తకం విలువని ఈనాడు కన్నడిగులు గుర్తిస్తే తెలుగుకవి కేతన 13వ శతాబ్దిలోనే గుర్తించాడు. కేతన కాలానికి హిందువుల మీద, హిందూమతం మీద ఇస్లాం తాకిడి ప్రారంభమయింది. హిందూ ధర్మశాస్త్రాల సహాయంతో దాన్ని ఎదుర్కొనే బృహత్కార్యాన్ని ఎంతోమంది చేపట్టారు. కేతన ఇలాంటి ఆదర్శంతోనే 'విజ్ఞానేశ్వరం' రచించాడు. ఇది యాజ్ఞవల్క్య స్మృతికి, 'మితాక్షర'కు కేవలం అనువాదం కాదు. ఆనాటి తెలుగు సమాజాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని కేతన ఈ గ్రంథాన్ని రచించారు. అందువల్ల తెలుగువారి సాంఘిక మత పరిస్థితులు, ఆచార సంప్రదాయాలు, న్యాయ, శిక్షా, నేరాలకు సంబంధించిన పలు విషయాలను తెలుసుకోవాలంటే సుమారు ఏడు శతాబ్దాల క్రితమే తెలుగువాడు రచించిన విజ్ఞానేశ్వరాన్ని పరిశీలించాలి.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|