|
|
Articles: TP Features | తల్లికి దండకాలు అక్కర్లేదు - Site Administrator
| |
ఇంకొక ఘోరం ఏమిటంటే - మాతృభాషను ఒక్క అక్షరం నేర్చుకోకపోయినా పాఠశాల విద్యను పూర్తిచేసుకొని పోగల దుస్థితిని పోగొట్టాలని 2003లో తెలుగు భాషోద్యమ సమాఖ్య గట్టిగా ప్రయత్నించి, ప్రభుత్వాన్ని దారికితెచ్చి, జి.ఒ.నెం.86/2003ను సాధించినా, దాని అమలు నత్తనడక నడిచింది. ఇప్పటికీ పరిస్థితి అస్పష్టమే. ఆ చట్టం ప్రకారం త్రిభాషా సూత్రాన్ని పూర్తిగా అమలుపరచి తీరాలి. జి.ఒ.ని అమలు చేయని పాఠశాలల గుర్తింపును రద్దుచేయాలని అందులో స్పష్టంగా ఉంది. తెలుగులో పిల్లలు మాట్లాడితే శిక్షించే విద్యాసంస్థలకు కూడా ఈ శిక్ష విధించాలని రానున్న శాసనసభల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టాలి. అది చట్టమై వస్తేనే తెలుగువారి పరువు నిలుస్తుంది. అసలు ఈ మైదుకూరు స్కూలులాంటి ఆంగ్ల మాధ్యమ పాఠశాలలు 86 జి.ఒ.ను ఆచరణలో పెట్టాయా లేదా అన్నది వెంటనే తెలుసుకోవలసిన అంశం. అమలు చేస్తున్నట్లయితే ఒక పాఠ్య విషయంగా తెలుగును నేర్పుతున్నప్పుడు ఆ భాషలో మాట్లాడుకోవద్దనడమేమిటి? ఈ చర్యను ఏ చట్టం, ఏ పాలనాసూత్రం సమర్ధిస్తుంది? రాజ్యాంగంలోని 350 అధికరణానికీ, మానవుల సహజమైన హక్కులకూ మైదుకూరు ఉదంతం లాంటివి భంగకరం కాదా?
గౌరవనీయ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఈ విషయంలో వెంటనే స్పందించారు. అందుకు ఆయనకు అభినందనలు. తొలి నుండీ తెలుగు సాహిత్యంలో ఆసక్తి, అభినివేశం కలిగిన వ్యక్తి అనీ, ఉద్యమాల్లో అనుభవం గడించి వచ్చారనీ, పట్టుదల గలవారనీ ఆయన నియోజకవర్గంలో ప్రఖ్యాతి ఉంది. 'ఐ నెవర్ స్పీక్ ఇన్ తెలుగు' అని రాసి ఉన్న అట్టల్ని విద్యార్థుల మెడల్లో పాఠశాల యాజమాన్యం వేసిన సంఘటన తమను కలచివేసిందని ఆయన ప్రకటించారు. ఈ సంఘటన తెలుగు ప్రజలందరికీ ఆగ్రహం తెప్పించిందనీ, పాఠశాల బోధన ఏ భాషలో ఉన్నప్పటికీ, తెలుగును ఒక భాషగా నేర్చుకోవాలన్నదే ప్రభుత్వ విధానమనీ, ఇంగ్లీష్ మీడియం అయినా, మరో భాష మీడియం అయినా తెలుగును ఒక భాషగా నేర్చుకోవాలన్న ఉద్దేశ్యంతో జి.ఒ.86ను అమలు చేస్తున్నామని ఆయన ప్రభుత్వ విధానాన్ని ప్రస్తావించారు కూడా.
మంత్రి విషయం పట్ల పూర్తి అవగాహనతో పాటు, తెలుగు విషయంలో నిబద్ధత ఉన్నందుకు సంతోషం. ఈ విషయమై ఆయన ఎలాంటి చర్యలు తీసుకొంటున్నారనేది ముఖ్యం. మైదుకూరు పాఠశాల యాజమాన్యంపై కఠినచర్యలు తీసుకొంటున్నట్లు మంత్రి ప్రకటించారు. కడపజిల్లా విద్యాశాఖాధికారి బాధ్యతలో ఉన్న ప్రాంతీయ సంయుక్త సంచాలకుడు మన్మథరెడ్డి స్వయంగా విచారణకు వెళ్తానని, బాధ్యులెవరో తెలుసుకొని చర్యలు తీసుకొంటామని, పాఠశాల గుర్తింపును సైతం రద్దు చేస్తామని బహిరంగంగా ప్రకటించారు. తాజా సమాచారం ప్రకారం భారతీయ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 355 వ సెక్షన్ క్రింద సుమోటోగా యాజమాన్యంపైన, సిబ్బంది పైన కేసును దాఖలు చేశారు. జన మాధ్యమాలు చేసిన ఫిర్యాదును అనుసరించి ఐ.పి.సి. 352 సెక్షన్ క్రింద - మీడియాను అడ్డుకొన్నందుకు కరస్పాండెంట్ ప్రభాకర్, మరి ముగ్గురి మీద కేసును దాఖలు చేశారు. ఈ రెండు నామాత్రపు జరిమానాతో తప్పంచుకోవడానికి వీలున్నవే. అరెస్టయినట్లు నమోదుచేసి, బెయిలు ఇచ్చివేయడానికి బాగా వీలున్న కేసులు. ఇంతటితో కథ కంచికి వెళ్తుంది. ప్రభుత్వం ఇంతకంటే ఏమీ చెయ్యబోదని అభిజ్ఞుల అభిప్రాయం.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|