|
|
Articles: TP Features | అమ్మో... మనిషి! - Site Administrator
| |
అసలు ఇంత కిరాతకానికి వారెందుకు ఒడిగట్టారు? కాసుల కోసమే అని ఇప్పుడు తెలుస్తోంది. అదే కాసులను పుష్కలంగా సంపాదించిన ప్రభాకర్, తన ముద్దుల కూతురు మరణ వార్త విని తట్టుకోలేక 'చిట్టి తల్లీ నేనూ నీ వెంటే వస్తున్నా'నంటూ గుండె ఆగి మరణించడం ప్రతి ఒక్కరినీ దుఃఖసముద్రంలో ముంచేసింది. లెక్కకు మిక్కిలి డబ్బులు సంపాదించిన ప్రభాకర్ కూడా పోతూ పోతూ ఒక్క పైసా కూడా తన వెంట తీసుకుపోలేదు కదా. రేపు ప్రభాకర్ ఆస్తిని సొంత చేసుకోవాలనుకున్న ఆ సైతానులు సైతం చచ్చిపోయాక ఖాళీ చేతులతోనే నరకానికి వెళ్ళాల్సి వస్తుందని తెలుసుకోలేకపోయారా? ధనం కోసం ముగ్గురి ప్రాణాలు తీయడం ఎంత తెలివి తక్కువతనం, ఎంత అనాలోచిత విధ్వంసం.
ఏ మతంలోనైనా, ఏ గ్రంథంలోనైనా, ఏ దేవుడైనా ఒక్కటే చెప్పారు. 'మానవ సేవే మాధవ సేవ' అని. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇలా అంటాడు... 'ఈశావాస్యమిదగమ్ సర్వం యత్కంచ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీథా మా గృథ కస్య స్విద్ధనమ్' అని. అంటే 'ఈ విశ్వంలో ఉన్న చేతనాచేతన వస్తువులన్నీ భగవంతునికే చెంది, ఆయన చేతనే నియమించబడుతున్నాయి. అందుచేత మానవుడు తన కొరకే ఏర్పరచబడిన వాటిని, తనకు కావలసిన వస్తువులను మాత్రమే తీసుకోవాలి. ఎవరూ కూడా ఇతరుల వస్తువులను ఆశించకూడదు. అవి ఎవరికి చెందినవో తెలుసుకుని ఉండాలి' అని. అలాగే జాతిపిత మహాత్మా గాంధీజీ అంటాడు 'ఈ లోకం వేరొకరి ప్రాణం తీసే హక్కు, తన ప్రాణమైన చంపుకొనే హక్కు ఏ మనిషికీ లేదు. అది ఒక్క ఆ దేవునికే సొంతం. ఎందుకంటే దేవుడొక్కడే ప్రాణం పోయగలడు కనుక' అని ఇలా ఎందరో మహానుభావులు ఎన్నో విధాలుగా మానవుడు ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదో విపులంగా జగతికి, మానవజాతికి వివరించారు. అయినప్పటికీ ఫలితం శూన్యం అనే చెప్పాలి.
గజానికో గాంధారి సుతుడు, గాడ్సేలు ఇప్పుడు సమాజంలో సంచరిస్తూ అమాయక ప్రణీతలపై యాసిడ్ పోస్తూ, ఆయేషా వంటి అభాగ్యులను అత్యాచారం చేసి హత్య చేస్తూ, నైనా వంటి యువతులను తందూరి పొయ్యిలలో సజీవ దహనం చేస్తూ, వైష్ణవి వంటి చిన్నారులను కొలిమిలలో కాల్చి బూడిద చేస్తూ మానవులంటే అర్థం ఒక రెండు కాళ్ళ జంతువు, రెండు చెబుల మధ్య ఉన్న మస్తిష్కంలో క్షుద్రదేవతలను తలదన్నే రీతిలో మారణకాండ పథకాలు రచించే కలియుగ రాక్షసులుగా మార్చి పారేస్తున్నారు. మానవ సంబంధాల్లో విలువలు లేని వధ్యశిలపై నరజాతిని నిలబెడుతున్నారు. మానవత అనే పదానికే అర్థం చెరిపేస్తున్నారు. మానవీయత సిగ్గుతో చచ్చి తల దించుకునేలా చేస్తున్నారు.
వెరసి 'అమ్మో... మనిషి' వస్తున్నాడు అని సమస్త జీవరాశి భయంతో నిలువెల్లా వణికిపోయేలా ప్రవర్తిస్తున్నారు. ఛీ... ఛీ... వీళ్ళా మానవులు? వీళ్ళేం మానవులు అని అందరూ బాధాతప్త హృదయాలతో కళ్ళ నుంచి రక్తశ్రువులు కారేలా ఏడిపిస్తున్నారు. అందుకే ఓ కవి ఇలా ఉన్నాడు... 'అనుబంధం ... ఆత్మీయత... అంతా ఒక బూటకం. ఆత్మ తృప్తికై మనుషులు ఆడుకొని వింత నాటకం... వింత నాటకం..'అని.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|