|
|
Articles: TP Features | తెలుగుజాతిని రక్షించుకుందాం - Site Administrator
| |
ఏ భాషా ప్రాతిపదికతో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందో ఆ భూమికనే మన నాయకులు మరచిపోయారు. తెలంగాణ నుండి వచ్చినా, రాయలసీమ నుండి వచ్చినా, కోస్తా నుండి వచ్చినా, ఉత్తరాంధ్ర నుండి వచ్చినా - నాయకులందరికీ కావలసింది అధికారం. ఈ అధికారాన్నివ్వగల అంశాలలో స్వభాష, స్వాభిమానం అనేవి ఏ పార్టీ అజెండాలోనూ లేవు. పొరుగు రాష్ట్రాలు మనతో పాటే భాషా రాష్ట్రాలుగా ఆవిర్భవించినా, తమ భాషా సంస్కృతుల విషయంలో వారికున్న శ్రద్ధాసక్తుల్లో పదవశాతం కూడా మనలో లేవని మన నాయకులు నిరూపించుకొన్నారు. అనేక సంవత్సరాలుగా సాంస్కృతిక సంబంధాలకు దూరమైన ప్రాంతాల ప్రజలు ఒక రాష్ట్రంగా ఏర్పడినందున వారి మధ్య సాంస్కృతిక సంబంధాలను పెంపుచేసేందుకు గాని, భాషా జాతీయతను ప్రచారం చేసేందుకు గాని, మన ప్రభుత్వాలు ఏ మాత్రం శ్రద్ధ వహించలేదు. పైగా వివిధ ప్రాంతాల మధ్య వైమనస్యాన్ని పెంచే చర్యల్ని అడ్డుకొనే ప్రయత్నం కూడా చేయలేదు. పాలకవర్గాలను నియంత్రించే శక్తులు కొన్నాళ్ళు పరోక్షంగా పెత్తనం చేసి, క్రమంగా ప్రభుత్వాన్నే స్వాధీనపరచుకొన్నాయి.
ఫలితంగా సామాన్య ప్రజల కోసం గాక పెట్టుబడిదారులు, కబ్జాదారులు, పారిశ్రామికవేత్తల, ఫ్యాక్షనిస్టుల చేతుల్లోకి పరిపాలన వెళ్ళిపోయింది. ఇందుకు రాజధాని నగరం సహజంగానే కేంద్రమయింది. ప్రాంతాల సమతౌల్యం దెబ్బతిన్నది. రాజకీయ స్వార్థాలకే పెద్దపీట పడింది. ఆంధ్రప్రదేశ్ పరిపాలనా రంగంలో ఒక రాజశేఖరరెడ్డి, ఒక చంద్రబాబు వంటి నాయకులకు తప్ప తెలంగాణ నుండి, గాని మరో వెనుకబడిన ప్రాంతం నుండి గాని ముఖ్యమంత్రిగా మరొకరు ఎవరైనా ఎదగగలరని సమీప భవిష్యత్తులో ఊహించలేని పరిస్థితి ఏర్పడింది. మూడు ప్రాంతాలూ కలిసినప్పుడు చేసుకున్న ఒప్పందాలు గాలిలో కలిసిపోయాయి.
ఈ నేపథ్యంలో బలంగా తెలంగాణ వాదం ముందుకొచ్చింది. కెసిఆర్ రాజకీయ పరపతి అడుగంటిన దశలో ఆయన చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఇప్పుడాయన్ని తెలంగాణకు తిరుగులేని నాయకుడిగా చేసింది. ప్రత్యేక తెలంగాణ తప్ప మరొకటి ఆమోదయోగ్యం కాదనే స్థితిలో ఆయనకు అనుకూల, వ్యతిరేక తెలంగాణ ఉద్యమకారులంతా ఏకాభిప్రాయంతో ముందుకు వచ్చారు. ఈ దశలో హోంమంత్రి ద్వారా కేంద్రం చేయించిన ప్రకటనకు తక్కిన రాష్ట్రంలోని రాజకీయ నాయకులంతా పార్టీ భేదాలకు అతీతంగా ఎదురుతిరిగారు. శాసనసభను నిరుపయోగం చేసేందుకు రాజీనామాలు చేసి - ప్రత్యేక తెలంగాణ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టలేని పరిస్థితిని కల్పించారు. ముందు తెలంగాణలో, అనంతరం కోస్తా, రాయలసీమల్లో అరాచకం తాండవిస్తున్నది. విద్యార్థులు ఉద్యమంలో ముందున్నారు. ఉద్యమ ధోరణులకు బెదరిన రాజకీయ నాయకులు తమ తమ పార్టీల అధినేతలకు ఎదురు తిరిగారు. రాష్ట్ర రాజకీయాల్లో మొట్టమొదటిసారిగా ఈ పరిస్థితి నెలకొంది.
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|