|
|
Articles: TP Features | ధృతరాష్ట్రుని ఆత్మలు! - Site Administrator
| |
ధృతరాష్ట్రుని ఆత్మ ఆవహించిన రాజకీయ నాయకుడు ములాయం ఒక్కరే కారు. తమిళనాడు ముఖ్యమంత్రి, డిఎంకె కురువృద్ధుడు ఎం. కరుణానిధి సదా ధరించే నల్ల కళ్లద్దాలు... ఆయన కుమారులు స్టాలిన్, అళగిరి విషయానికి వచ్చేసరికి ఆయనకు దృష్టి ఆనకుండా చేస్తున్నాయి. తన కుడిభుజం, ఎప్పుడూ రక్తం కుతకుత ఉడుకుతుండే, ధారాళంగా ఉపన్యాసం ఇచ్చే శక్తి ఉన్న వైకో (వై. గోపాలస్వామి) సేవలను కరుణానిధి కోల్పోయారు. తన రాజకీయ వారసత్వం ఎవరిది అవుతుందో డిఎంకె కురువృద్ధుడు స్పష్టంగా ప్రకటించినప్పుడు వైకో ఆయనకు దూరమయ్యారు.
బాలాసాహెబ్ థాకరే కూడా అదే కోవకు చెందుతారు. చొరవ తక్కువైన, వన్యప్రాణులను ఫోటోలు తీయడంపై అమితాసక్తి గల తన కుమారుడు ఉద్ధవ్ కన్నా తన సోదరుని కుమారుడు, జనాకర్షణ శక్తి అమితంగా గల రాజ్ కే తన రాజకీయ వారసుడు కాగల సత్తా ఉందని అంతరాంతరాల్లో బాల్ థాకరే గ్రహించి ఉండాలి. కాని తన వారసుని ఎంపిక విషయం వచ్చేసరికి బాలాసాహెబ్ తన కుమారుడు ఉద్ధవ్ నే పీఠం ఎక్కించారు. ఫలితంగా శివసేన నుంచి రాజ్ థాకరే నిష్క్రమించారు. రాజ్ పోకతో పార్టీ బలహీన పడిపోయింది.
కర్నాటకలో హెచ్.డి. దేవెగౌడ సారథ్యంలోని జనతాదళ్ (సెక్యులర్) పార్టీలో ఎస్. సిద్ధరామయ్య పార్టీకి వెనుకబడిన కులాల (బిసి) ఓటు బ్యాంకు చెక్కుచెదరకుండా చేసిన కురుబ నాయకుడు. దేవెగౌడకు కుడిభుజంగా పేరుపొందారు ఆయన. కాని రాష్ట్రానికి ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేయవలసి వచ్చినప్పుడు దేవెగౌడ కుమారుడు హెచ్.డి. కుమారస్వామి వైపే మొగ్గు చూపారు. పర్యవసానంగా సిద్ధరామయ్య పార్టీకి గుడ్ బై చెప్పారు. దానితో చెప్పుకోదగిన బిసి మద్దతును జెడి (ఎస్) కోల్పోయింది. ఇక కేరళలో కాంగ్రెస్ వృద్ధ నాయకుడు కె. కరుణాకరన్ కు రాజకీయ ప్రజ్ఞా ధురీణుడిగా పేరు ఉన్నది. కాని తన కుమారుడు కె. మురళీధరన్ ను భావి నేతను చేయాలనే ఆయన తపన పార్టీ నుంచి ఆయన నిష్క్రమణకే కారణమైంది.
ధృతరాష్ట్ర జాడ్యం కారణంగా పార్టీ వ్యవస్థ క్రమంగా పతనం అవుతోంది. చట్టం ప్రకారం ప్రజాస్వామ్యబద్ధంగా సంస్థాగత ఎన్నికలను నిర్వహించవలసి ఉన్నప్పటికీ ప్రాంతీయ పార్టీలు అలా చేయడం లేదు. ఫలితంగా రాజకీయ పార్టీ పేరుకే పార్టీ అవుతోంది కాని పక్కా కుటుంబ వ్యాపారంగా మారిపోతున్నది. కుటుంబం ఇంటి పేరు ఉన్న వారికే పార్టీలో పదవులు దక్కుతున్నాయి. బీహార్ లో లాలూ ప్రసాద్ యాదవ్ సారథ్యంలోని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్ జెడి) గాని, జమ్ము కాశ్మీర్ లో అబ్దుల్లా కుటుంబ నాయకత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్ సి) గాని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారిపోయాయి. వాటిలో కుటుంబంలో భాగం కాని వారు ఏదో ఒక స్థాయికి మించి పదవులు ఆశించలేరు. చివరకు ఆనువంశిక రాజకీయాలకు వ్యతిరేకంగా గళమెత్తిన శరద్ పవార్ కూడా తన కుమార్తె సుప్రియా సూలెని బారామతి నియోజకవర్గానికి ఎంపీగా చేశారు.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|