|
|
Articles: TP Features | తెలుగు భాషకు భూషణం - Site Administrator
| |
'కవిత చెప్పి యుభయకవిమిత్రు మెప్పింప
నరిది బ్రహ్మకైన నతడు మెచ్చ
బరగ దశకుమార చరితంబు జెప్పిన
ప్రోడ నన్ను వేరె పొగడనేల' అన్నాడు కేతన.
ఈ విశిష్టకవి రచించిన విజ్ఞానేశ్వరం గొప్పతనమేమిటో లోగడ వివరించాను. ఇదే కవి తెలుగువారి కోసం తెలుగులో మొదటి వ్యాకరణాన్ని కూడా రాశాడు. 'ఆంధ్రభాషా భూషణం' 192 పద్యాల చిన్న రచన అయినా తెలుగుభాషా చరిత్రలో చాలా విలువైంది.
'మన్ను తెనుగునకు లక్షణ
మెన్నడు నెవ్వరును జెప్పరే జెప్పెద వి
ద్వన్నికరము మది మెచ్చగ
నన్నయభట్టాది కవి జనంబుల కరుణన్'
అన్నాడు కేతన. తెలుగులో ఎవ్వరూ అంతవరకు చెయ్యని పని తాను చేస్తున్నట్లు చెప్పాడు. సంస్కృత, ప్రాకృతాది లక్షణాలు చెప్పి తెలుగు భాషకు లక్షణం చెప్పకపోవడం వల్ల తనకా అవకాశం కలిగిందని పొంగిపోయాడు. అంతే కాదు, వ్యాకరణాన్ని సామాన్యులకు కూడా అర్థమయ్యే భాషలో చక్కని తెలుగు పదాలు వాడుతూ రాయడం సామాన్యమైన పనికాదు. సంస్కృతం రాజ్యమేలుతున్న కాలంలో 'సంస్కృతమే అన్ని భాషలకు తల్లి' అని నమ్మిన కాలంలో కేతన తెలుగుభాషను గౌరవించిన తీరు పొగడదగింది.
'ఒప్పులు గల్గిన మెచ్చుడు, తప్పులు గల్గిన నెరింగి తగదిద్దుడు, తప్పొప్పనకుడొప్పు తప్పని చెప్పకుడు' అని కేతన చెప్పిన మాటలు ఒక సుభాషితంగా అందరూ ఎప్పుడూ గుర్తుంచుకోదగినవి. తెలుగు భాషకు కొత్తగా లక్షణాన్ని చెప్తున్నందుకు మంచి మనసుతో తనని ఆశీర్వదించాలని కవులకు మ్రొక్కి వేడుకున్నాడు కేతన.
కేతన రాసిన ఆంధ్రభాషా భూషణంలో తెలుగు భాష స్వరూపం గురించిన ఎంతో సమాచారం ఉంది. అదంతా ప్రస్తుతం అక్కరలేదు. కాని కేతన చెప్పిన కొన్ని ముత్యాల లాంటి మాటల్ని మనం మళ్ళీ మళ్ళీ మననం చేసుకోవలసి ఉంది.
తెలుగు భాషకు ఎన్నో దారులున్నాయని, అది చాలా సత్త్వం గల భాష అని చెప్పడానికి కేతన ఒక పద్యం రాశాడు.
కంచి నెల్లూరు మరి యోరుగల్లయోధ్య
యను పురంబులపై గంగ కరుగు మనిన
పగది నొక త్రోవ జూపెద బహుపథంబు
లాంధ్ర భాషకు గలవని యరసికొనుడు.
భారతీయులకు గంగ చాలా పవిత్రమయింది. గంగ లాంటిదే భాష. గంగను చేరుకోవడానికి ఎన్నో దారులున్నాయి. అలాగే ఆంధ్రభాషని అర్ధం చేసుకోవడానికి ఎన్నో దారులున్నాయి. అయితే కాశికి వెళ్ళడానికి కంచి, నెల్లూరు, ఓరుగల్లు, అయోధ్య మీదుగా ఒక త్రోవ ఉంది. అలాంటి త్రోవనే వ్యాకరణం రాయడం ద్వారా చూపుతానని కేతన అంటున్నాడు.
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|