|
|
Articles: My Thoughts | తెలుగు యాస మనది - Site Administrator
| |
కానీ మన పాఠశాలలు తెలుగు మాట్లాడితేనే ఆ ప్రపంచ బ్యాంకు ఇచ్చిన వరాలు ఎక్కడ రాలిపోతాయని కాబోలు ప్రభుత్వం గజగజలాడుతున్నది. అటు యాజమాన్యాలు తెలుగులో రెండక్షరాలనగానే తను నేర్పిన చదువు ఎక్కడ కలుషితమౌతుందోనని భయపడుతున్నది. ఇది అమెరికాలో కాదు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నది. అమెరికాలో నా విద్యార్ధులు ఎంతో ముచ్చటగా తెలుగులో మాట్లాడారు. తమ ఇంటిభాషలోనే మనసువిప్పి మాట్లాడారు. తెలుగులో మాట్లాడటమే కాదు మేము మీరు వచ్చాక చాలా కాలం తరువాత హాయిగా మీతో తెలుగులో మాట్లాడుతున్నామని సంతోషపడ్డారు. తమిళులతో పోటీపడి ఆంధ్రరాష్ట్రం సాధించుకున్నారు. పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగం చేశారు. తెలుగు పేరు మీద పీఠాలు ఏర్పాటు చేసుకున్నాము. ఆ పీఠాల పేర్లు జెప్పుకొని మన వాళ్ళు వెలిగిపోయారు. ఇదే తెలుగు వైభవమని చూపించారు. చివరకు పసిపిల్లలు తెలుగు రెండక్షరాలు మాట్లాడితే ప్రపంచమంతా కూడా నేరమని చాటే ధైర్యం తెచ్చుకున్నట్లుంది. ఈ ధైర్యం వెనుక ఒక రాజకీయ శక్తి ఉన్నది. తమ విధేయతను చూపించి ఊహించని మేడలు ఎక్కుదామనే ఆశలు పెరిగాయి. ఇలా ప్రవర్తించినందుకు తల్లిదండ్రులు, మొత్తం సమాజం ఎర్రతివాచీ పరుస్తుందని ఊహించారు. కానీ ప్రజల్లో ఇంకా తమ మాతృభాషపైన, తల్లిభాషషైన, ఇంటిభాష పైన మమకారం తగ్గలేదని నిరూపించారు.
ఊహించని నిరసన వ్యక్తమయింది. ఇపుడు ప్రభుత్వం దిగివచ్చి చర్య తీసుకుంటామంటోంది. వెంటనే తెలుగు సంబంధిత టీచరుపై చర్యలు తీసుకున్నారు. మన పాలకులు ప్రజల నిరసనలను ఎట్లా చల్లార్చాలోనన్న విషయం బాగా తెలిసినవాళ్ళు కదా! కానీ ప్రజలు కోరేదది కాదు. కనీసం ప్రాథమిక స్థాయిలోనైనా తమ నాగరికతను, తమ సంప్రదాయాలను, తమ ఆచారాలను, తమ ఇంటిభాషలను బతకనియ్యండని అడుగుతున్నారు. ఇప్పటికే ఎన్నో మాతృభాషలు ఈ ప్రపంచీకరణలో భాగంగా ప్రపంచ పటం నుంచి కనుమరుగవుతున్నాయి. గత సాంస్కృతిక వైభవాలకు, గత సమాజం అందించిన సాంస్కృతిక సంపదలైన పాటలను, ఆ యాసలను, ఆ భాషలను, ఆ ఊసులను పిల్లల నాలుకపై సజీవంగా ఉండనివ్వండి. నైజాం లాంటి నిరంకుశుడు కూడా తెలుగు భాషను ప్రజల నాలుకలపై ఉండే అవకాశాన్ని ఇచ్చాడు కాబట్టే అక్షరజ్ఞానం లేనివారు ఎంతో గొప్ప సాహిత్యం సృష్టించారు.
'బండెనుక బండికట్టి' పాట రాసిన యాదగిరి విశ్విద్యాలయాల్లో డిగ్రీలు పొందినవాడు కాదు. తన నోటి పాటలతో ప్రజా ఉద్యమాలకు ఊపిరిపోశాడు. ఊతమిచ్చాడు. తెలుగు భాషను బతికించింది పొలాల్లో నాట్లేసే ఆ తల్లులు, బాలసంతులు నైజాం రాష్ట్రంలో జనం సంస్కృతిని బతికించారు. ఇప్పుడు నైజాంను మించిన రాజ్యంలో మా నోటిపైన కూడా తాళం వేసే ప్రయత్నం చేయటం ప్రపంచీకరణ సంస్కృతిలో భాగమేమో! ప్రతి విద్యార్ధి తన పక్కవారితో తెలుగులో మాట్లాడటం సహజం. మేమడిగేది వచ్చే తరానికి మా భాషను, మా జీవన విధానాన్ని, నాలుగు కాలాలపాటు ఉండనీయండని. మాకు ప్రాచీన భాషా హోదాకన్నా, మా సంస్కృతీ నాగరికతలు నాలుగు కాలాలపాటు బతకటమే ప్రధానం. గతంపైన విర్రవీగే వాళ్ళం కాదు మేం. గతం కన్నా భవిష్యత్తే ప్రధానం. రాజుల దర్పం కన్నా వచ్చీరాని పిల్లల అడుగులు, మాటలే గొప్ప సాహిత్యం. ఇది సెంట్ జోసెఫ్ స్కూలుకు హెచ్చరిక కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హెచ్చరిక. ఏ పీఠం మీద మీరు కూర్చున్నారో అది వూగిసలాడకుండా చూసుకోండి. గజనీమహమ్మద్ దెబ్బకన్నా కడపలో సెంట్ జోసెఫ్ స్కూల్లో దెబ్బ ఎంతో ప్రమాదకరమైనది. అది సభ్యసమాజాన్ని గాయపరిచింది. గాయాలనుంచి స్రవించిన రక్తంతోనే అసంతృప్తి జ్వాలలు అంటుకుంటాయని చెప్పవలసిన పనిలేదు. ఇది భాషా ఉన్మాదం నుంచి వచ్చిన స్వరం కాదు. మానవ హక్కుల కోణం నుంచి పెల్లుబుకుతున్న స్వరమిది. ఇది రాజ్యాధికారం కోసం కాదు. భావవ్యక్తీకరణ కోసం. భాషా సంస్కృతి పరిరక్షణ కోసం. మనందరం మన ఇంటి పెరళ్ళల్లో ఉన్న మన సంస్కృతిని కాపాడుకుందాం!
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|