బాలాజీ కల్యాణోత్సవాలు
రాజమండ్రి : పవిత్ర వైనతేయ గోదావరి నదీ తీరంలో కొలువుతీరిన అప్పనపల్లి బాలాజీ స్వామి దివ్య తిరు కల్యాణమహోత్సవాలు నేడు ప్రారంభమయ్యాయి. 3వ తేదీ రాత్రి 9.01 గంటలకు శ్రీస్వామివారి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. గోదావరి నుంచి ఒక పాయను వినతాపుత్రుడైన గరుత్మంతుడు అప్పనపల్లి మీదుగా తీసుకువచ్చి సాగర సంగమింపచేశాడని ప్రతీతి. శ్రీ వెంకటేశ్వరస్వామి ఇక్కడ బాలాజీ స్వామి రూపంలో వెలిసాడని భక్తుల నమ్మకం. బుధవారం లలితా, విష్ణు సహస్రనామ పారాయణ, స్వామివారి తిరువీధి ఉత్సవం తదుపరి రాత్రి 9.01 గంటలకు శ్రీవారి కళ్యాణం, గురువారం బాలభోగ నివేదన, బలిహరణ, వేదపారాయణ, పండితులకు సన్మానం, శుక్రవారం శ్రీవారికి చక్రస్నానం, ధ్వజారోహణ, శనివారం నిత్యారాధాన ఉత్సవాలు, ద్వాదశ ప్రదక్షిణలు, శ్రీవారి పుష్పయాగం, పవళింపు సేవ జరుగునని కార్యనిర్వహణాధికారి సిహెచ్ దుర్గాప్రసాద్ తెలిపారు. కల్యాణానికి తరలివచ్చే భక్తులకు అన్నదానం ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.
News Posted: 2 June, 2009
|