పేదల పెన్నిది కాంగ్రెస్సే : పితాని
ఏలూరు : దేశంలో, రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నా ప్రజలెప్పుడూ కాంగ్రెస్ ను ఆదరిస్తూనే ఉన్నారని, వారిచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకొని, ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడమే ప్రస్తుత తమ లక్ష్యమని రాష్ట్ర ఆరోగ్యశ్రీ శాఖా మంత్రి, మౌలిక సదుపాయాల శాఖామంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. పేదవాడికి గుండె ధైర్యాన్ని, మనో ధైర్యాన్ని అందించడమే కాక, సుస్థిర పాలన కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యమనే అభిప్రాయంతోనే ప్రజలు కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీని గెలిపించారని ఆయన అన్నారు. కృతజ్ఞతా పర్యటనలో భాగంగా మంత్రి పెనుగొండ మండలంలోని ఇలపర్రు గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఇలపర్రు సర్పంచ్ కేతా సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సభలో ప్రసంగించారు. పేదలను, బలహీనర్గాలను దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హయాం నుంచీ కాంగ్రెస్ పార్టీయే ఆదుకుంటూ వస్తున్నది మంత్రి పితాని పేర్కొన్నారు.
ఆరోగ్యశ్రీ వంటి విశిష్టమైన శాఖను రాష్ట్రముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనకు ఇచ్చారని, తనను గెలిపించినవారి రుణాన్నేకాక, కాంగ్రెస్ ను గెలిపించిన మొత్తం రాష్ట్ర ప్రజల రుణం తీర్చుకుంటానని మంత్రి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మంత్రి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ పర్యటనలో ఎఎంసి చైర్మన్ కర్రి వెంకటప్రసాద్ రెడ్డి, మండల పరిషత్ అధ్యక్షుడు పి.సత్యనారాయణ, ములపర్రు సర్పంచ్ బొక్కా విశ్వనాథం, సొసైటీ అధ్యక్షులు చేకూరి సుబ్బరాజు, మండల తహసీల్దార్ ఎస్ శివకుమార్, ఎంపిడివో వాసపల్లి విజయలక్ష్మి, కాంగ్రెస్ నాయకులు మేడపాటి సాయిచంద్రమౌళేశ్వరరెడ్డి, పిల్లి త్రిమూర్తులు, చిన్నం రామిరెడ్డి, బళ్ళ రాంబాబు, పులగం బుచ్చిరెడ్డి, అధికారులు వి వెంకటేశ్వరరావు, చక్రధరరావు, శ్యామూల్ తదితరులు పాల్గొన్నారు.
News Posted: 14 July, 2009
|