గ్రామాలకు 'ఉపాధి' పధకాలు
కరీంనగర్ : గ్రామ పంచాయితీలలో వారం రోజుల్లో గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు. కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఎంపిడిఓలు పీల్డు అసిస్టెంట్లు పంచాయితీ రాజ్ అధికారులతో గ్రామీణ ఉపాధీ హామీ పథకం అమలుపై గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వర్షాభావ పరిస్థితుల నెలకొన్నాయని, గ్రామాలలోని ప్రజలకు చేతినిండ పనులు కల్పించి ఆదుకోవడానికి ఉపాధి హామీ పథకం చక్కని మార్గమని అన్నారు. ప్రతి గ్రామంలో కనీసం 10 లక్షల వరకు పనులు గుర్తించి ప్రారంభించాలని ఆదేశించారు. నిధులకు కొరత లేదని, ఏ గ్రామంలో కూడ కూలీలకు పనులు దోరుకడం లేదనే సమస్య రాకూడదని అన్నారు.
ఉపాధి హామీ పనుల పర్యవేక్షణ బాధ్యత పూర్తిగా ఎంపిడిఒలపైనే ఉందని, దీనికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఎంపిడిఓలు రోజుకు ఐదుగ్రామాల్లో పర్యటంచి ప్రజలసమస్యలను పరిష్కరించడంతో పాటు ఉపాధి పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రస్తుతం జిల్లాలో 885 గ్రామాలలో పనులు జరుగుతున్నాయని మిగిలిన 309 గ్రామాలలో పనులు గుర్తించి ప్రారంభించాలని ఆదేశించారు. పనుల వద్ద విజిటర్ రిజిస్టర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామాల్లో జరుగుతున్న పనులకు ఎంబీ రికార్డు చూసి, మూడు రోజుల్లో కూలీ లకు వేతనాలు చెల్లించాలని కోరారు. కరువు ఎక్కువగా ఉండడంతో వంద రోజులుదాటినా పనులు కల్పించే విధంగా అధికారులు ప్రణాళిక రూపొందించాలని కోరారు.
News Posted: 7 August, 2009
|