అనంతపురం : అనంతపురం జిల్లాలోని ఏడు నెంబర్ రోడ్ ఆదివారం రాత్రి రక్తసిక్తమయ్యింది. ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. అనంతపురం జిల్లాలోని శింగనమల మండలం లోలూరు వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
కర్నూలు నుంచి అనంతపురం వస్తున్న ఆర్టీసీ బస్సు లోలూరు వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. రాయదుర్గం డిపోకు చెందిన ఈ బస్సు ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని భావిస్తున్నారు. ప్రమాద సంఘటన వార్త తెలిసిన వెంటనే జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హుటాహుటిన వెళ్ళి సహాయ చర్యలు చేపట్టారు.