లేపాక్షిలో వైఎస్ మ్యూజియం
అనంతపురం : రైతుల సంక్షేమం కోసం సుదీర్ఘ పాద యాత్ర జరిపిన లేపాక్షిలో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి జ్ఞాపకార్ధంగా మ్యూజియంను ఏర్పాటు చేయనున్నట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. 1986లో వైఎస్ రాజశేఖరరెడ్డి పాద యాత్ర ప్రారంభించిన లేపాక్షిలోని రామదేవాలయంలో వారు సమావేశమయ్యారు. వైఎస్ కు సన్నిహితులైన మార్కెట్ యార్డ్ ఛైర్మన్ డాక్టర్ లక్ష్మీనారాయణరెడ్డి, తిరుపతి కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ భూమన్, రిటైర్డ్ డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాగునీటి ద్వారా అభివృద్ధి సాధ్యమని నమ్మిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ అని కొనియాడారు. రైతుల సంక్షేమం కోసమే ఆయన నిరంతరం శ్రమించారన్నారు. హెలికాప్టర్ ప్రమాదంలో అకాలం మరణం పొందిన వైఎస్ రాజశేఖర రెడ్డి శాశ్వత జ్ఞాపకార్ధంగా లేపాక్షిలో మ్యూజియంను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. వంద ఎకరాల విస్తీర్ణంలో్ చక్కటి ఉద్యానవనం కూడా నిర్మిస్తామన్నారు. అంతేకాక 22 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు వారు వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు జయరామిరెడ్డి, రామకృష్ణప్ప, అంజిరెడ్డి, రామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
News Posted: 8 September, 2009
|