వరదతో కనువిప్పు...
రాజమండ్రి : వరదల వల్ల ఐదు జిల్లాల్లో సంభవించిన అపార ప్రాణ, ఆస్తి నష్టాలు అధికార యంత్రాంగానికి కనువిప్పు కలిగించాయి. దీంతో గోదావరి నదికి వరద సంభవిస్తే ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సమాయత్తమవుతోంది. ప్రస్తుత గోదావరి నీటి పరిస్థితిపై కాటన్ అతిథి గృహంలో ఫ్లడ్ కన్జర్వేటర్, హెడ్ వర్క్స్ ఈఈ విప్పర్తి వేణుగోపాల్ మంగళవారం రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే చందన రమేష్ భేటీ అయ్యారు. మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిస్తే గోదావరి ఉప్పొంగే అవకాశాలు ఉండటంతో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. వాతావరణ శాఖ అధికారులతో, ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతూ పరిస్థితిని అంచనా వేస్తున్నారు.
మహారాష్ట్రలో వర్షాలు కురుస్తున్నా అవి గోదావరి పోటెత్తే స్థాయిలో లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. అయినప్పటికి రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు జిల్లాలో ఏటిగట్లను పరిశీలిస్తున్నారు. బలహీనంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి వాటి పటిష్టతకు చర్యలు చేపడుతున్నారు. డెబ్బై శాతం పూర్తయిన ఏటిగట్ల పటిష్ట పనులను పూర్తి చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కృష్ణా నదిలా కాకుండా గోదావరి నది వరద పరిస్థితిని అంచనా వేయడానికి వీలు ఉండటంతో పరిస్థితిని ముందుగానే ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం కసరత్తులు చేస్తోంది.
News Posted: 7 October, 2009
|