13న 'బాలరత్న'కు పోటీ
నిజామాబాద్ : బాలల్లో దాగి ఉన్న ప్రతిభను ప్రోత్సహించేందుకు నిర్వహించే 'బాలరత్న, బాలసూర్య' అవార్డులకోసం స్థానిక స్థాయి పోటీలు ఈనెల 13న ఏర్పాటు చేయనున్నట్లు బాలభవన్ పర్యవేక్షకుడు వి ప్రభాకర్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. జవహర్ బాలభవన్ (హైదరాబాద్) సంచాలకుల నుంచి జిల్లా బాలభవన్ కు నిర్వాహకుల ఆదేశాలు అందడంతో ఈ ప్రకటన చేసినట్లు ఆయన తెలిపారు.
2009 సెప్టెంబర్ ఒకటి నాటికి సంవత్సరం నుంచి 16 సంవత్సరాల వయస్సు గల బాల, బాలికలను 'బాలరత్న అవార్డు'కు పోటీ చేసేందుకు అనుమతిస్తారు. వాద్య సంగీతం, నృత్యం, గాత్రం, సృజనాత్మకత ప్రదర్శన, నటనా రంగాల్లో వీరి ప్రతిభ నిరూపించుకోవాల్సి ఉంటుంది. అలానే 'బాలసూర్య' అవార్డు కోసం పోటీ చేసేవారు 2009 సెప్టెంబర్ 1వ తారీఖు నాటికి ఐదు సంవత్సరాల వయసు నిండిన వారు ఏ రంగంలో ప్రతిభ ఉన్నా ఈ పోటీకి అర్హులని తెలిపారు. వయసు ధ్రువీకరణ పత్రంతో, ప్రతిభకు గుర్తింపుగా పొందిన ధృవ పత్రాలు పాటుతప్పని సరి అని, ఇంతకు ముందు పురస్కారం వచ్చి ఉంటే వారు పోటీకి అర్హులు కాదని అన్నారు. ఈ రెండు పోటీలకు గాను దరఖాస్తులను 12వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు 'పర్యవేక్షకులు, జిల్లా బాలభవన్, నిజామాబాద్' అనే చిరునామాకు పంపాలని సూచించారు. పోటీల్లో పాల్గొనేవారు అందుకు అవసరమైన సామాగ్రిని పోటీ దారులే సమకూర్చుకోవాలని చెప్పారు. మరిన్ని వివరాల కోసం 08462-225503 నంబరకు సంప్రదించవచ్చని పర్యవేక్షకులు తెలిపారు.
News Posted: 7 October, 2009
|