కార్తీక శోభతో శైవ క్షేత్రాలు
కడప : జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాలు సోమవారం కార్తీక శోభతో కళకళలాడుతున్నాయి. నగర శివార్లలోని దేవుని కడప సోమేశ్వర ఆలయంలో స్వామివారికి అభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చనలు చేపట్టారు. గడ్డిబడారులోని శ్రీకామకోటి కళాంబదేవి, శ్రీ సోమసుందరేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మహాన్యా పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, కామకోటి కళాంబదేవి అమ్మవారికి కుంకుమార్చన, మంగళహారతి, తీర్థ ప్రసాద వినియోగాలు జరిగాయి. అలానే సిద్ధవటంలోని బాలబ్రహ్మేంద్రస్వామి, కామాక్షిసిద్ధవటేశ్వరస్వామి ఆలయాల్లో ఘనంగా పూజలు జరిగాయి. కడపకు చెందిన కాశీ విశ్వేశ్వర విశాలాక్షి అన్నదాన కమిటీ కార్యదర్శి కామ సముద్రం సాయిబాబా ఆధ్వర్యంలో బాలబ్రహ్మేంద్రస్వామి సన్నిధి నందు మహాభిషేకం, పంచామృతాభిషేకం నిర్వహించారు. నవంబర్ 2న కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని బాలబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో మహాభిషేకం, తీర్థ ప్రసాదాలు, దీపాలంకరణ కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. పలు ఆలయాల్లో 9 శ్రీ చక్రాలు, శివలింగాలు, అమ్మవారి విగ్రహాలు ప్రతిష్ఠించేందుకు కృషి చేస్తున్నామన్నారు.
News Posted: 27 October, 2009
|