'వైద్యశాలలను మెరుగు పరచాలి'
నెల్లూరు : ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ పరిధిలోఉన్న జిల్లాలోని ఆరు ఆసుపత్రులలో రోగులకు సకాలంలో మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన చర్యలు ఎప్పటికప్పుడు చేపట్టాలని జిల్లా పరిషత్ చైర్మన్ కాకాణి గోవర్థన్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో విద్య, వైద్య సేవలపై నాలుగవ జిల్లా స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విద్య, వైద్యాధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో ముఖ్యంగా ఆడపిల్లల పాఠశాలల్లో అవసరమైనన్ని మరుగుదొడ్లను నిర్మించాలని, అందుకు సంబంధించిన నిధులను తాము మంజూరు చేస్తామన్నారు. ఎస్సి కార్పొరేషన్ ఇఇతో వంట గదుల నిర్మాణానికి సంబంధించి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి త్వరితగతిన వాటిని పూర్తి చేసే విధంగాచర్యలు తీసుకుంటామన్నారు. పాఠశాలల్లో అవసరమైన హిందీ, లెక్కల ఉపాధ్యాయుల స్థానంలో విద్యావాలెంటీర్లను నియమించేందుకు ప్రభుత్వం నుంచి తక్షణ అనుమతి పొందే దిశగా చర్యలు చేపట్టాలని ఆయన జిల్లా విద్యాశాఖాధికారికి సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సిఇఒ బి.రామిరెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి ఆంజనేయులు, వయోజనవిద్య ఉపసంచాలకులు ఎం.రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
News Posted: 27 October, 2009
|