వైభవంగా శ్రీవారి రథోత్సవం
నిజామాబాద్ : నింబాచలంపై కొలువున్న శ్రీ లక్ష్మీనృసింహ స్వామి రథోత్సవం సోమవారం కార్తీక పౌర్ణమి రోజున అత్యంత వైభవంగా జరిగింది. లింబాద్రి గుట్టలో ఉన్న శ్రీ లక్ష్మీనృసింహ స్వామికి గత 15 రోజులుగా వివిధ ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం ఉదయం నుండి ప్రత్యేక పూజలందుకున్న నింబాచలుడు నూతన వరుడిగా భక్తులకు దర్శనమిచ్చారు. గర్బాలయంలోని శ్రీవారిని శ్రీపాదుల వారు దర్శించుకున్న తర్వాత ఉత్సవ మూర్తులను గర్భాలయం నుండి పుష్పాలతో అలంకరించి రథంపై కొలువుంచారు. దక్షిణ భాగాన ఉన్న పుష్కరిణి వైపు భక్తులు రథాన్ని తాళ్లతో లాగుతూ గోవింద నామస్మరణతో రథోత్సవాన్ని నిర్వహించారు. శ్రీ పాదుల స్వామి కూడా రధంపై ఊరేగి రథోత్సవం జరిపారు.
రథోత్సవాన్ని నేరుగా చూస్తే జన్మధన్యమవుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. దానికి అనువుగా ఆర్మూర్ సబ్డివిజన్ నుండే కాకుండా పొరుగున ఉన్న మహారాష్ట్ర నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి రథోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. రథం ఊరేగింపుకు రథానికి ఇరువైపులా ఏర్పాటు చేసిన పొడవాటి తాళ్ళను పట్టి లాగడంలో భక్తులు పోటీపడ్డారు. రథోత్సవం ప్రారంభంలో జిల్లా పరిషత్ చైర్మన్ కాటిపెల్లి వెంకటరమణారెడ్డితో పాటు ఎంపిపి కన్నె సురేంధర్, సర్పంచులతో పాటు గోవింద నామస్మరణ చేస్తూ రథాన్ని లాగారు. కొండంతా గోవింద నామస్మరణతో మారుమ్రోగింది.
News Posted: 3 November, 2009
|