తెలుగులో ఆర్మీ ఎంపిక పరీక్ష
అనంతపురం : జిల్లాలో నిర్వహించిన ఆర్మీ రిక్రూట్ మెంట్ కు ఏడు జిల్లాల నుంచి అభ్యర్థులు తరలివచ్చారు. నీలం సంజీవరెడ్డి స్టేడియంలో జరిగిన ఆర్మీ రిక్రూట్ మెంట్ క్యాంపస్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్మీ రిక్రూట్ డైరెక్టర్ సంజయ్ ఠాకూర్ తో కలసి, పంకజ్ సిన్హా మాట్లాడారు. ఆర్మీలో చేరిన వారు క్రమశిక్షణను నేర్చుకుంటారు, పెద్దల పట్ల గౌరవాన్ని పెంచుకుంటారు, తల్లిదండ్రులను దైవంలా పూజిస్తారు, దేశ భక్తిని పురికొల్పి ఆ భావాలను బయటకు తెచ్చేది, ఒక కొత్త వ్యక్తిని రూపొందించేది ఆర్మీ అని బ్రిగేడియర్, డిప్యూటి డైరెక్టర్ ఆఫ్ జర్నల్ సిన్హా అన్నారు. గత రెండు రోజులుగా అనంతపురంలో ఏడు జిల్లాల అభ్యర్థులకు నిర్వహిస్తున్న ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని పరిశీలించేందుకు వచ్చిన ఆయన ఇక్కడకు విచ్చేశారు. దేశ రక్షణ కోసం అభ్యర్థుల నుంచి వస్తున్న స్పందన బాగుందన్నారు. ప్రపంచంలోనే రెండవ పెద్ద రక్షణ వ్యవస్థ ఇండియన్ ఆర్మీ అని ఆయన అన్నారు.
ఆర్మీకి ఎంపికైన అనంతరం యువకులు గతంలో వారు ఎలా ఉన్నా, ఆర్మీలో చేరాక శిక్షణలోనూ, అనంతరం పూర్తిగా మారిపోతారని అన్నారు. ఈ నియామకానికి ఎవరి సహకారం అవసరం లేదని, ఓ ఒక్కరికీ ఒక పైసా కూడా ఇవ్వాల్సిన పని లేదని, విద్యార్హతలు కలిగి ఉండి, దేహ దారుఢ్యం, కాసింత పరిజ్ఞానం ఉన్న వారికి ఖచ్చితంగా ఉద్యోగం వస్తుందని అన్నారు. యువకుల్లో ఆర్మీ పట్ల అవగాహన కల్పించేందుకు ప్రచార కార్యక్రమాలను కూడా తాము చేపడుతున్నామని ఆయన చెప్పారు. అలాగే రిక్రూట్ మెంట్ లో ఎంపిక కాని వారు నిరాశ చెందకుండా వారి గ్రామాల్లో, పట్టణాల్లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన పదో తరగతి, ఇంటర్ చదివిన విద్యార్థులే ఎక్కువగా పాల్గొంటున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి రఘువీరా రెడ్డి అన్నారు. అయితే వీరు దేహదారుఢ్యం వంటి పరీక్షల్లో విజయం సాధించినా హిందీ, ఇంగ్లీషు భాషలలో రాత పరీక్ష ఉన్నందున ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ, అందువల్ల రాత పరీక్షను మున్ముందు తెలుగు భాషలో నిర్వహించేలా సంబంధింత రాష్ట్ర మంత్రితో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ విభాగం డైరెక్టర్ వర్గీస్, జిల్లా యువజన సంక్షేమ శాఖ అధికారి వెంకటేశ్నాయక్ తదితరులు పాల్గొన్నారు.
News Posted: 18 November, 2009
|