చిత్తూరు : చిత్తూరు జిల్లాలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది మరణించారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను పుత్తూరు ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. చిత్తూరు జిల్లా కార్వేటి నగరం మండలం చిన్నకనుమపల్లి వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతులంతా తమిళనాడులో షోలింగర్ కు చెందిన వారిగా గుర్తించారు. పెళ్ళి బృందంతో వెళుతున్న లారీ అదుపు తప్పి బోల్తా పడిపోయింది. వీరంతా గురువారం ఉదయాన్నే తిరుమలలో వివాహ వేడుకలు ముగించుకొని తమ స్వగ్రామానికి తిరుగుప్రయాణమయ్యారు. కానీ లారీ అదుపుతప్పడంతో 8 మంది తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. ప్రమాద స్థలి వద్ద పరిస్థితి భయానకంగా ఉంది. ప్రమాదం సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.