జీయర్ ట్రస్ట్ శ్రీ యాగం

న్యూజెర్సీ : ప్రపంచ శాంతి, సౌభాగ్యాల కోసం జూలై 23 శుక్రవారం నుంచి ఆగస్టు 1వ తేదీ ఆదివారం వరకూ విశ్వశాంతి శ్రీ యాగం నిర్వహిస్తున్నట్లు జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ (జెఇటి) తెలిపింది. న్యూజెర్సీ రాష్ట్రం క్రాన్ బరీలోని 222 డే రోడ్ లో ఉన్న జీయర్ ఆశ్రమంలో నిర్వహించనున్న ఈ శ్రీ యాగంలో పాల్గొనాల్సిందిగా జీయర్ ట్రస్ట్ అందరినీ ఆహ్వానించింది. జీయర్ ట్రస్ట్ అధిపతి శ్రీ శ్రీమన్నారాయణ చిన్న జీయర్ స్వామి ఈ యాగాన్ని స్వయంగా నిర్వహిస్తున్నారు. 'మానవ సేవే మాధవ సేవ' అంటూ చిన్నజీయర్ స్వామి గత మూడు దశాబ్దాలుగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఈ శ్రీ యాగం నిర్వహించే తొమ్మిది రోజులూ ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ నక్షత్ర హోమం, శ్రీ యాగం, పూర్ణాహుతి, ఇస్తి హోమం, జీయర్ స్వామి ప్రవచనం, మహా ప్రసాద వితరణ కార్యక్రమాలు ఉంటాయి. సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల వరకూ శ్రీ యాగం, పూర్ణాహుతి, జీయర్ స్వామిజీ ప్రవచనం, సాంస్కృతిక కార్యక్రమం, మహా ప్రసాద వితరణ నిర్వహిస్తారు.
ఇంతకు ముందెన్నడూ కనీ వినీ ఎరుగని రీతిలో ప్రపంచం ఎదుర్కొంటున్న యుద్ధాలు, ఆర్థిక మాంద్యం, దారిద్ర్యం, ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంటున్న సమయంలో విశ్వ మానవాళికి శాంతి, సౌభాగ్యాలు కలిగించే శ్రీ యాగం చేయాలని స్వామి సంకల్పించారు. ఈ యాగంలో స్వామితో పాటు వేదం, ఆగమ శాస్త్రంలో నిష్ణాతులైన 108 మందికి పైగా ఋత్విక్కులు పాల్గొంటున్నారు. తొమ్మిది రోజుల పాటు అమెరికా సంయుక్త రాష్ట్రాల వ్యాప్తంగాను, భారతదేశం నుంచి, ఇతర దేశాల నుంచి సుమారు 20 వేల మందికి పైగా భక్తులు శ్రీ యాగానికి హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ పేర్కొంది.
ఇతర వివరాలు తెలుసుకోవాలనుకునే వారు Viswa Santhi Sri Yagam Committee, Jeeyar Educational Trust (JET) USA Inc.
Ph: 209-253-8872 | Email: sriyagam@jetusa.org | http://www.jetusa.org/ లో సంప్రతించవచ్చు.
Be first to comment on this News / Article!
|