|
|
Articles: TP Features | తెలుగు వారంతా ఒక్కటే - Mr. Tirumalarao Jayadheer
| |
ఇతర రాష్ట్రాల తెలుగు రక్తకణాలని మనం చాలా కాలంగా కోల్పోతూ వచ్చాం. తాజాగా 1956 అనబడే ఒక కొత్త అపసవ్య గీతల కూటమిలో ఆ రక్తకణాలు మరింత దూరమయ్యాయి. కొన్ని గీతలు అనవసరంగా విలీనమయ్యాయి. ఆ విలీనాన్ని రద్దు చేసి విడిపోవాలని కోరుతున్నాయి. అవే ఇప్పుడు భాషా సాంస్కృతిక రంగాలకు చెందిన కొత్త ప్రశ్నలను మన ముందు నిలిపాయి.
1956కి ముందు హైదరాబాద్ సంస్థానం ఆంధ్ర ప్రాంతానికి పరాయిదే. చాలా మంది రాజకీయ నాయకులు కూడా ఆ ప్రాంతాన్ని తెలుగు సోదరుల ఆవాసంగా గుర్తించలేదు. పాలకవర్గం పరాయివారనుకోవచ్చు. దానికి కొంత అర్థం ఉంది. కాని తొంభై శాతం తెలుగు ప్రజలను తెలుగు మాతృభాషీయులను గుర్తించ నిరాకరించే స్వభావం ఏర్పడిపోయింది.
కాని నిజానికి గోలకొండ ప్రభువులు అదే హైదరాబాద్ సంస్థానాన్ని ఏలిన నైజాం రాజుల అధీనంలోనే ఈనాడు చెప్పుకుంటున్న ఆంధ్రప్రదేశ్ భౌగోళిక ప్రాంతమంతా ఉండింది. వందా ఏభై ఏళ్ళ క్రితం అటునిటుగా కోస్తా ప్రాంతం పరాయి పాలకులకి ధారాదత్తమైంది. రాయలసీమ ఆంగ్లేయులకి దత్తుగా ఇవ్వబడింది. అందుకే ఈ ప్రాంతాల్లోనూ, ఇతర రాష్ట్రాల తెలుగు భాషలోనూ దేశీయం అనుకునే చాలా పర్షియన్, అరబిక్, ఉర్దూ మూల తెలుగు పదాలే ఎక్కువ వ్యవహారంలో ఉన్నాయి. అవి ముఖ్యమైన రెవెన్యూ, ఎక్సైజ్, పంటలు తదితర విభాగాలకు సంబంధించిన పదాలు. అవి ఈ నాటికీ ఆ ప్రాంతాల్లో వాడుకలో ఉన్నాయి. నన్నయ, తిక్కన, పోతన, శ్రీనాథుడు వాడిన అనేక పదాల మూల రూపాలు హైదరాబాద్ సంస్థానంలో కనిపిస్తాయి. సుప్రసిద్ధ పాత్రికేయులు జి. కృష్ణ తదితర పండితులు ఈ విషయాన్ని పలుమార్లు నొక్కి చెప్పారు.
కేవలం భాషే కాదు, సాంస్కృతకాంశాలు కూడా చాలా వరకూ కలగలసిపోయాయి. కాకతీయుల పూర్వ కాలం నుండి రాజకీయ అధికార కేంద్రంగా (విష్ణుకుండినులు, కాకతీయులు, రాచకొండ రెడ్డిరాజులు, గోలకొండ నైజాం రాజుల కింద) హైదరాబాద్ సంస్థానంలోని పలు ప్రాంతాల నుండి పరిపాలన జరిగిందని చరిత్ర పరిశోధకులు చెప్పారు. ఆయా రాజ్యాల రాజధానులూ ఇక్కడివే.
అయినా హైదరాబాద్ సంస్థానంలో ఉన్న తెలుగువారు తమ వారేననే తలంపు ఆంధ్ర ప్రాంత పెద్ద తలలకు రాలేదు. ఒకరిద్దరిలో వచ్చినా భాషా చరిత్ర జాతి సంస్కృతిలో వారి స్థానానికి నిరాకరణే మిగిలింది. ఈ నిరాదరణ దృక్పథం ఈ నాటికీ ఎంతో కొంత కొనసాగడం గమనించవచ్చు. అలాంటి ఒక వ్యవస్థీకృత అనవగాహన ఇప్పుడు ఇతర రాష్ట్రాలలోని తెలుగువారిపై కూడా అదే విధానంలో కొనసాగుతున్నది. ఈ దృక్పథంలో మార్పు ఎప్పుడు ఎలా వస్తుందో ఇప్పుడే చెప్పలేం. కాని రాక తప్పదు. ఒకవేళ రాకపోతే జాతిగా, భాషగా, సంస్కృతిగా తెలుగు ప్రజలు తమ విశిష్టతని కోల్పోతారు. రాజకీయంగా కూడా దేశ స్థాయిలో గౌరవనీయమైన మనుగడ సందేహమే. అందుకే ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా వాళ్ళు తెలుగువాళ్ళే. వారి మనోభావాలను, ప్రజాస్వామిక ఆకాంక్షలను గౌరవించడం ఒక్కటే దారి. ఆధిపత్య రాజకీయాల కళ్లజోడులోంచి మేధావులు ఇలాంటి విషయాలను చూసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|