|
|
Articles: TP Features | ప్రయోజనాత్మక దృష్టి - Site Administrator
| |
(ఆర్వీయస్ సుందరం)
ఒక జాతిని, ఒక భాషని ఎన్నో విధాలుగా పరిశీలించవచ్చు. పరిశీలన కంటే ప్రయోగం ముఖ్యం. ప్రయోగం వల్ల ప్రయోజనం ఉండాలి. 'ప్రయోజనాన్ని ఉద్దేశించకుండా మందబుద్ధులు కూడా ప్రవర్తించరు' అన్నాడు కాళిదాసు. తెలుగు జాతిని, భాషని నేడు చాలామంది పరిశోధన దృష్టితో చూస్తున్నారు. జాతికి అభిమానం పెంచడానికి, ఆలోచింపజేయడానికి ఒక్కొక్కసారి కొన్ని విషయాల్ని పరిశోధన దృష్టితో వెలికితీసి చెప్పాల్సిందే, తప్పదు. శాతవాహనులు తెలుగువాళ్ళని, నన్నయ మాత్రమే కాక కన్నడ కవి పంప కూడా తెలుగువాడే అని, శ్రీకృష్ణదేవరాయలు తెలుగువాడని, త్రిమతాచార్యులు తెలుగువారే అని చెప్పుకొని సంతోషించడం ఇలాంటిదే. 'మేం తెలుగు వాళ్ళం కాదు' అని సాధించే కరుణానిధి, కన్నడ కంఠీరవ రాజకుమార్, విజయకాంత్ లాంటివాళ్ళని కూడా 'కాదు కాదు తెలుగువాళ్ళే' అని వారి మూలాలు, కులాలు వెతికి మనం మనం చెప్పుకోవడమూ ఇలాంటిదే. ఇది అభిమాన దృష్టి అని సరిపెట్టుకుందాం. మరో దారుణమైన దృష్టి కోణం ఉంది. ఈ పరిశోధకులు అజ్ఞానం వల్లనో, చారిత్రక దృష్టి లేకనో, ఎవరినో మెప్పించాలనో, 'నన్నయ్య, పాల్కురికి సోమనాధుడు, శ్రీనాథుడు, శ్రీకృష్ణదేవరాయలు, త్యాగరాజు, రాజరాజనరేంద్రుడు వీళ్ళెవరూ తెలుగువాళ్ళు కారు' అని సిద్ధాంతాలు చేస్తుంటారు. ఇది విపరీత దృష్టి.
నన్నయ్య అనే పేరు తమిళం, కన్నడం, తెలుగు - ఈ మూడిట్లోనూ ఉంది. తెలుగు శాసనాల్లో ఉంది. నన్నయ్య, నన్నిచోడుడు లాంటివి ఆ కాలంలో తెలుగువారి పేర్లే. పాల్కురికి సోమనాథుడు ఆంధ్రదేశంలోని పాల్కురికి వాడని కన్నడంలో పాల్కురికి సోమేశ్వర పురాణం రాసిన తోంటదార్యుడనే కవి స్పష్టంగా చెప్పినా మన పరిశోధకులు కొందరు అతణ్ణి కన్నడిగుణ్ణి చేసేశారు. శ్రీనాథుడు తన ప్రత్యర్థుల్ని నిరసిస్తూ 'నాది కొందరు సంస్కృతమంటారు, కొందరు తెలుగంటారు, ఎవరేమంటే నాకేమి కొరత, నిజానికి నాది కర్ణాట భాష (చెవులకు ఇంపైనది) అని ధ్వన్యాత్మకంగా చెప్తే 'పాకనాటింటి బాంధవుడ'యిన వాడిని కన్నడిగుణ్ణి చేశారు కొందరు. రాజులు ఏ భాషకు చెందినవారో చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. వాళ్ళు ఏ దేశానికి వెళ్తే అక్కడి స్త్రీలను పెళ్ళి చేసుకుంటారు.
అందువల్ల తండ్రి భాష తెలుగయినా తల్లి భాష తెలుగు కాలవసిన అవసరం లేదు. అలాంటి వాళ్ళని ఏమని పిలవాలో ఎవరికీ తెలియదు. అలాంటప్పుడు వీటిని సాగదీయడం పనికిరాదు. శాతవాహనరాజు సంస్కృతం తెలీక భార్య 'మోదకైస్తాడయ' అంటే, మోదకాలు (పిండి వంటలు) తెప్పించాడని, అతని భార్య ఎగతాళి చేసిందని ఐతిహ్యం. అంటే అతను అనార్యుడు, ఆమె ఆర్యస్త్రీ అయ్యుండాలి. రాజరాజ నరేంద్రుని పూర్వులు నిజంగా చాళుక్యులయితే వాళ్ళు కన్నడిగులు. కాని, అతని పూర్వులు అచ్చమైన స్థానికాంధ్రులని వాళ్ళ పేర్లే చెప్తున్నాయి. వీళ్ళు తమిళ స్త్రీలని పెళ్ళి చేసుకున్నారు. మరి వీళ్ళని ఏమని పిలవాలి? ఇలాంటప్పుడు 'రాజరాజ నరేంద్రుడు తమిళుడైనా తెలుగు భాషకు సేవ చేశాడని' ప్రకటనలు చేసే పండితులు తెలుగుకు అపకారం చేస్తున్నారనుకోవాల్సిందే. చాళుక్యులు కన్నడదేశం నుంచే వచ్చారు. కాని తర్వాత స్థానికులు కూడా చాళుక్యులనే పేరు పెట్టుకున్నారు. అలాగే తెలుగు ఇక్ష్వాకులు ఆ పేరు పెట్టుకున్నంత మాత్రాన వారు అయోధ్య నుండి వచ్చారని అర్థం కాదు. చోళులందరూ తమిళులు కారు. అయితే తమ మూలస్థానం తమిళనాడులోని ఒరయూరని, తమ మూలపురుషుడు కరికాల చోళుడని చెప్పుకుంటారు. అంతమాత్రం చేత స్థానిక చోళులంతా తమిళులని అర్థం కాదు.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|