|
|
Articles: TP Features | మాతృభాష-జాతీయ విధానం - Site Administrator
| |
(సామల రమేష్ బాబు)
ఇది లోహియా శతజయంతి సంవత్సరం. మాతృభాషల గురించీ, భారతదేశంలోని మాతృభాషల పరిస్థితి గురించీ మనం మాట్లాడుతున్నాం గనుక, అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాలు జరుపుకొంటున్నాం గనుక - మనం లోతుగా చర్చించుకోవడానికి లోహియా శతజయంతి సంవత్సరాన్ని కేటాయించుకొంటే బాగుండునని నేను అనుకొంటున్నాను. అదే విధంగా భారతదేశంలో కులాలు, వాటి పరిణామాలు, కులాలకూ భాషకూ గల సంబంధాలు గురించి కూడా విస్తృతమైన చర్చను ఈ ఏడాదిలో సాగించాలని నేను ప్రతిపాదిస్తున్నాను. ఎందుకంటే తెలుగు భాషోద్యమ నిర్మాణంలో గత పదేళ్లుగా నేను సాగించిన, సాగిస్తున్న ప్రయాణంలో ఎన్నెన్నో పరిశీలనలు, అధ్యయనాలు, అనుభవాలు నా ఆలోచనలను విస్తృతపరుస్తున్నాయి.
కులాల సమస్య మీదా, భాషా సమస్య మీదా లోహియా వెళ్లినంత లోతుగా పరిశోధనాత్మక చర్చ చేసిన వ్యక్తి మన ఆధునిక భారత రాజకీయ నాయకుల్లో మరొకరు కన్పించరు. భారతీయ సమాజం గురించి బాబాసాహెబ్ అంబేడ్కర్ తరచి తరచి చేసిన అధ్యయనంలో కూడా కులాల లోతుల్లోకి వెళ్ళాడు కాని, భాషకు సంబంధించి అంత లోతుగా అధ్యయనం చెయ్యలేదు. అయితే కొందరు పండితులు, మేధావులు, ఉన్నత స్థానాల్లోని లబ్ధప్రతిష్ఠులైన నాయకుల కాపట్యాన్ని, అతి లౌక్యాన్ని, స్వార్థాన్ని వాసనపట్టి, వెల్లడి చేయడంలో అంబేడ్కర్ నూ, లోహియాను కలిపి చూస్తే, భారత స్వాతంత్ర్యానికి పూర్వమూ తర్వాతా కొద్ది దశాబ్దాల చరిత్రలో మనకు దిగ్భ్రాంతికరమైన అంశాలు సాక్షాత్కరిస్తాయి.
దాదాపు మూడు దశాబ్దాల క్రితమే నేను కొంతవరకు లోహియా, అంబేడ్కర్ ల భావాలను - కులాల సమస్యకు, భాషా సమస్యకు సంబంధించి చదివాను. కాని, ఈ పదేళ్ళ తెలుగు భాషోద్యమ అనుభవాల తర్వాత మళ్లీ ఈ అంశాలను గురించి అధ్యయనం చెయ్యాలనుకొనుకొంటున్నాను. ఇదే సమయంలో లోహియా శతజయంతి రావడం నన్ను ఇందుకు ప్రేరేపించింది. 'చదువుకున్నవారి చేత పనిచేయించాలంటే చదువురానివారు కర్ర పుచ్చుకొని వారి తలల మీద నిరంతరం స్వారీ చేస్తూ ఉండవలసిందే' అంటారు లోహియా. ఈ మాటను చెప్పి - 'అలా స్వారీ చేయడానికి వారికి మాతృభాషోద్యమం ముందువెనుకలు తెలియాలి' అంటారు నరసింహమూర్తిగారు.
ఈ దేశంలోని కోట్లాది ప్రజలు 'తనకేమీ తెలియదు' అనే అజ్ఞానంలో ఉంటున్నప్పుడు జరిగేదేమిటి? మాతృభాషలో వారేమీ తెలుసుకోలేనప్పుడు వారి జీవనాన్ని ఎలా మెరుగుపరుచుకోగలరు? తమకున్న స్వేచ్ఛను, స్వాతంత్ర్యాన్ని, పాలనాధికారాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడుకోగలరు? ఈ మొత్తానికీ ప్రాణావసరమైన తమ మాతృభాష అన్నివిధాలా చంపివేయబడుతున్నప్పుడు తామెలా వికసించగలరు? చివరకు తమ సామర్థ్యాన్ని కోల్పోతున్నప్పుడు - వికసించడానికి గల అవకాశాలనెలా అందిపుచ్చుకోగలరు?
లోహియా ఈ అంశాలపైన ఎంతో మాట్లాడారు. ఎంతో రాశారు. ఆంగ్లాన్ని పారద్రోలుమని ఏభై ఏళ్ళ క్రితం ఆయన చేసిన ఉద్యమంలో మాతృభాషల రక్షణకు, ప్రజల భాషలను సర్వసంపన్న భాషలుగా ఎదిగింపజేసేందుకు ప్రాతిపదికలున్నాయి. 'ఇంగ్లీషు సంపన్న భాష, భారతీయ భాషలు పేద భాషలు' అనే వాదాన్ని తిప్పికొట్టడానికి లోహియా వాదనలు భాషోద్యమకారులు మళ్ళీ చదవాలి. సురమౌళి తెలుగులో రచించగా తెలుగు అకాడమీ వారు ప్రచురించిన లోహియా 'భాషా సమస్య' ఈ అవసరాన్ని తీరుస్తుంది.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|