|
|
Articles: TP Features | వోటు మారితే సీటు 'చే'జారినట్టే! - Site Administrator
| |
(వై.బి.నరేందర్ రెడ్డి)
మే 16వ తేదీ తర్వాత రాష్ట్రంలో ఏర్పడబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమా? మహా కూటమి అధికారంలోకి వస్తుందా? లేక హంగ్ అసెంబ్లీ ఏర్పడి సంకీర్ణ ప్రభుత్వం వస్తుందా? అన్నది నేడు రాష్ట్రంలో అందరి మెదళ్ళనూ తొలుస్తున్న ప్రశ్నలు.
తొలిసారి జరుగుతున్న ముక్కోణపు పోటీ ఎవరికి లాభిస్తుంది. తాను ముఖ్యమంత్రి పదవి చేపట్టి సంక్షేమ రాజ్యాన్ని అందివ్వాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చిన చిరంజీవి ఈ ఎన్నికల్లో ఎవరి వోట్లు చీలుస్తారు? హంగ్ అసెంబ్లీ ఏర్పడితే ఆయన మద్దతు ఇచ్చేది కాంగ్రెస్ కా, మహాకూటమికా? అన్న ప్రశలకూ సమాధానాలు దొరకడం లేదు. ఎన్నికలకు ముందే మొత్తం 42 లోక్ సభ స్థానాలకూ, 294 అసెంబ్లీ సీట్లకూ అభ్యర్థులను ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచిన కాంగ్రెస్ పార్టీ కొంత ముందున్నట్లు కనిపిస్తున్నది. ఎంతకూ తెగని సీట్ల పంపిణీ వ్యవహారంతో మహాకూటమిలోని నాలుగు పక్షాలూ ఇప్పటికీ పూర్తి సమన్వయాన్ని సాధించలేకపోతున్నాయి. కాంగ్రెస్ ను ఓడించడమే ఉమ్మడి ఎజెండాగా ఏర్పడిన మహాకూటమి సంపూర్ణ 'మిత్రలాభం' పొందే సూచనలు కనిపించడం లేదు. టిక్కెట్ల పంపిణీలో డబ్బే ప్రధాన పాత్ర వహించిందన్న ఆరోపణలను ఎదుర్కొంటున్న ప్రజారాజ్యం పార్టీకి ఆదిలోనే అపశకునాలు ఎదురవుతున్నాయి.
శాసనసభ, లోక్ సభ సార్వత్రిక ఎన్నికల తేదీలు దగ్గర పడుతున్న కొద్దీ గెలుపోటములపై అన్ని పక్షాల్లోనూ గందరగోళం, అయోమయం, అనిశ్చిత పరిస్థితులు ఏర్పుడుతున్నాయే తప్ప స్పష్టత రావడం లేదు. ఓటరు నాడి ఎవ్వరికీ చిక్కడం లేదు. విజయం తమదేనంటూ పైకి బింకంగా మాట్లాడినా లోలోన గుబులు గూడుకట్టుకుంటోంది. అసలు సమయం వచ్చేసరికి ఆఖరి నిముషంలో... ఇవిఎం మీటపై వేలు పడేసరికి ఓటరు మనసును ఏ అంశాలు ప్రభావితం చేస్తాయోనని నేతలు హడలిపోతున్నారు. వోటరు నాడిని పట్టుకునే ప్రయత్నంలో భాగంగా వివిధ పత్రికలు, సంస్థలు ఏడెనిమిది సర్వేలు నిర్వహించాయి. సర్వేలు తమకు అనుకూలంగా ఉంటే ఒక మాట, ప్రతికూలంగా ఉంటే మరోమాట మాట్లాడడం మన నాయకులకు కొత్తకాదు. విజయం తమదేనంటూ అందుకు అనుకూలంగా వాదనలు రూపొందించుకుంటూ కడదాకా పోరాడటం పార్టీలకు పరిపాటే.
రాష్ట్రంలో తొలిసారిగా జరుగుతున్న ముక్కోణపు పోటీ రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. తెలంగాణలో పోటీ ప్రధానంగా కాంగ్రెస్, మహాకూటమి మధ్య సాగుతోంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో కొన్నిచోట్ల కాంగ్రెస్, ప్రజారాజ్యం మధ్య, మరికొన్ని చోట్ల కాంగ్రెస్, తెలుగుదేశం మధ్య పోటీ నెలకొంది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రం పోటీ చాలామటుకు కాంగ్రెస్, ప్రజారాజ్యం మధ్యనే సాగుతోంది. కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో చిరకాల ప్రత్యుర్థులైన కాంగ్రెస్ - తెలుగుదేశం మధ్యే హోరాహోరీ పోరు సాగుతోంది. రాయలసీమ లోని నాలుగు జిలాల్లో కూడా దాదాపుగా అదే పరిస్థితి ఉంది.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|