|
|
Articles: My Thoughts | చరిత్ర విజ్ఞాన శాస్త్రమా? - Site Administrator
| |
(డా.కొడవగంటి రోహిణీప్రసాద్)
చరిత్ర అంటే ఏమిటి? మనలో చాలామందికి స్కూలు రోజుల నుంచీ హిస్టరీ అంటే అయిష్టత ఏర్పడుతుంది. ఎందుకంటే చరిత్ర అంతా ఎప్పుడో జరిగిపోయిన సంఘటనల చిట్టాలాగా అనిపిస్తుంది. కాని అది నిజం కాదు. జరిగిన విషయాలను సకారణంగా వైజ్ఞానిక పద్ధతుల్లో విశ్లేషించవచ్చు. ప్రాచీన నాగరికతలు ప్రపంచంలో కొన్ని స్థలాల్లోనే ఎందుకు మొదలయ్యాయో, వేటవంటివి మానుకుని పొలం సాగు చెయ్యగలిగిన అవకాశాలు అక్కడే ఎందుకు వీలయిందో శాస్త్రవేత్తలు చెప్పగలరు. అంటే హిస్టరీకి మూలకారణం జాగ్రఫీయే. పంటమొక్కల్లోని జన్యుజాతులూ, అవి ఏపుగా పెరగగలిగేందుకు అవసరమైన పరిస్థితులూ శాస్త్రీయంగా వివరించబడ్డాయి. భౌగోళికంగా ఒక్కొక్క ప్రాంతంలోనూ ఎటువంటి వన్య ప్రాణులుండేవో, వాటిలో గొర్రెలూ, మేకలూ, పశువుల వంటివి ఇతరులకన్నా ముందుగా పశ్చిమాసియా వాసులకు మచ్చికకు ఎలా పనికొచ్చాయో మనకు తెలుసు. అలాగే తూర్పు పడమరులుగా ఎక్కువ వైశాల్యం కలిగిన ఆసియా - యూరప్ ఖండాల్లో నాగరికతలు విస్తరించిన పద్ధతిలో అమెరికా, ఆఫ్రికా ఖండాల్లో జరగకపోవడానికి వాటి స్వరూపం, వాతావరణ పరిస్థితులే కారణం. నాగరిక దశకు ముందుగా చేరుకున్న ప్రజలు ఇతర 'ఆదిమ' తెగలను లోబరుచుకోవడం కష్టం అనిపించలేదు. వివిధ నగరాలూ, సామ్రాజ్యాలూ, సైన్యాలూ, యుద్ధాలూ తప్పనిసరిగా తలెత్తుతూ వచ్చాయి. ఇదంతా చరిత్రకు భూమిక.
తరువాతి కాలంలో కూడా ప్రతి సంఘటనకూ భౌతిక ఆధారాలు కనబడతాయి. బాబర్ వంటి ఫలానా రాజు మనదేశం మీదికి దండెత్తి వచ్చాడని చరిత్ర చెబుతుంది. ఎంత గొప్పగా వర్ణించినప్పటికీ యుద్ధాలన్నీ పెద్ద ఎత్తున జరిగిన సాయుధ దోపిడీలే. ఇలాంటివన్నీ కేవలం 'పుర్రెకో బుద్ధి' అన్న పద్ధతిలో జరిగి ఉండకపోవచ్చు. మనం గుర్తుంచుకోవలసిన దేమిటంటే బాబర్ అయినా, చెంఘిజ్ ఖాన్ అయినా తన ప్రాంతంలో తలెత్తిన సామాజిక పరిస్థితుల వల్లనే దండయాత్రలు చెయ్యవలసి వచ్చింది. వీటికి సామాన్యంగా వ్యక్తిగత కారణాలు ఉండవు. ఉన్న పరిస్థితులు అసంతృప్తికి దారితీసినప్పుడే మార్పులు అవసరమౌతాయి. కూడూ, గుడ్డా వగైరాలకు లోటు కలిగితే తప్ప ప్రాణాలకు తెగించి ఎవరూ పోరాడరు. ప్రజలను కదిలించడానికి మతవైషమ్యాలూ, జాతివైరాలూ పనికొచ్చినప్పటికీ నిజమైన కారణాలన్నీ భౌతిక అవసరాలకు సంబంధించినవే. భౌగోళిక ప్రతికూలత వల్లనే వనరుల్లో ఇబ్బందులు కలిగేవి. జనాభా పెరిగి, అంతకంతకూ పరిమితమైపోతున్న వనరుల కోసం ఎన్నో యుద్ధాలు జరుగుతూ ఉండేవి.
ట్రోయ్ నగరాన్ని గ్రీకులు ముట్టడించడానికి కేవలం ఒక 'రాణి ప్రేమ పురాణం' కారణం కాకపోవచ్చు. ఏ కాలంలోనైనా, ఏ ప్రాంతంలోనైనా ఆహారోత్పత్తి తగినంతగా జరకపోవడం, జనాభా పెరగడం మొదలైనవన్నీ భౌగోళిక కారణాల వల్లనూ, వాతావరణంలో కలిగిన మార్పుల వల్లనూ తెలుత్తుతాయి. ఆధునిక విజ్ఞానం ద్వారా అప్పటి భౌతిక పరిస్థితులను మనం అంచనా వేసుకోవచ్చు. ప్రజల మధ్య జరిగిన (జరగనటువంటి కూడా) సంఘర్షణల వల్లనే చరిత్ర రూపొందుతూ వచ్చింది. అలాంటప్పుడు చరిత్ర అనేదాన్ని కూడా విజ్ఞాన శాస్త్ర పద్ధతిలోనే విశ్లేషించాలని జారెడ్ డయమండ్ అనే పరిశోధకుడి అభిప్రాయం.
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|