|
|
Articles: My Thoughts | పై వాడున్నాడు... - Site Administrator
| |
(జి.వి.రమణ )
'రామంచంద్రమ్మ మెరిసిందా?' 'లేదు'. 'అదేం?' 'ఏమో తల్లికి కోపం వచ్చిందంటున్నారు. 'విశాఖ జిల్లా యలమంచిలి గ్రామదేవత రామచంద్రమ్మ గుడి బైపాస్ రోడ్డుకు ఆనుకుని వున్న చిన్న కొండమీద వుంది. ఇటీవలి కాలంలో క్రమం తప్పుతున్నా, రెండేళ్లకోసారి నిర్ణీత గురువారం నాడు అర్ధరాత్రి దాటిన తర్వాత గుడి లోపల, వెలుపల రెండు లేదా మూడు సార్లు ఆ దేవత మెరుపు రూపంలో భక్తులకు కనిపిస్తుంది. అదే సమయంలో అక్కడకు నాలుగైదు మైళ్ళ దూరంలో గల కొత్తూరు మామిడాడ గ్రామంలో కూడా అక్కడి గ్రామ దేవత మెరుస్తుంది. హేతువాదులు, నాస్తికులు 'అంతా బూటకమ'ని కొట్టి పారేస్తున్నా అనేకమంది స్వయంగా, కళ్లారా ఈ మెరుపుల దేవతను దర్శించుకుంటూనే వున్నారు. ఇటువంటి దైవ పూరిత సంఘటనలను దేవుని సందేశాలుగా అభివర్ణిస్తారు.
ఎంతో వింత గొలిపే ఈ అద్భుతాలకు శాస్త్రీయమైన వివరణలను ఇస్తున్నప్పటికీ భక్తుల నమ్మకంలో మాత్రం ఎటువంటి సడలింపు లేదు. ఈ అద్భుతాలు భక్తుల విశ్వాసానికి దేవుడు పెట్టే పరీక్షలుగానూ, ఆయా మతాల వ్యాప్తికి సాధనాలుగానూ భావిస్తున్నవారు కోకొల్లలు. తర్కానికి, హేతువాదానికి, శాస్త్ర బద్ధమైన వివరణలకు అతీతమైన ప్రపంచం ఒకటి వుంది. దీనిని నిర్ధారించే సాక్ష్యాధారాలు, రుజువులు లేనప్పటికీ భక్తుల నమ్మకం మీద వారికి గల విశ్వాసం మాత్రం అచంచలం. మానవాతీతమైన శక్తికి రూపకల్పనే అద్భుతం. దీనిని బూటకంగా తోసి పుచ్చడం ఎవరికీ సాధ్యం కాదు. మొన్న క్రైస్తవులు జరుపుకున్న ఈస్టర్ సమయంలో మెక్సికోలోని ఓ చర్చిలో మేరిమాత విగ్రహం కన్నీరు కార్చిందన్న వార్త ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పెడ్రోఎస్కోబెడో గ్రామంలో జరిగిన ఈ అద్భుతాన్ని వేలమంది వీక్షించారు. విగ్రహాలు కన్నీరు కార్చిన సంఘటనలు ఇటీవలి కాలంలో ఎన్నో చోట్ల జరిగాయి. 2005లో ఉక్రెయిన్, కాలిఫోర్నియాలలో, 2006లో కేరళ రాష్ట్రంలోని కొచ్చిన్ లో మేరిమాత విగ్రహాలు బాష్పాలు రాల్చినట్లు వార్తలు వెలువడ్డాయి.
విశ్వాసం అంటే ఏమిటి? ఒక అత్యున్నత శక్తి మీద గల నమ్మకమే విశ్వాసం అంటారు ఫతేపురి మసీదు షాహి ఇమామ్ ముఫ్తి ముకర్రం అహ్మద్. ఈ విశ్వాసం స్వచ్ఛమైన ఆలోచనల ద్వారా, భక్తి పూరకమైన మాటల ద్వారా, చర్చల ద్వారా వ్యక్తమవుతుందని, దృగ్గోచరం కాని దైవశక్తి మీద నమ్మకం భగవంతునికి, భక్తునికి అనుసంధానకర్తగా పని చేస్తుందనీ ముఫ్తి వివరణ ఇచ్చారు. ఈ అద్భుతాలు భగవంతుని చేష్టలని అటు మత ప్రచారకుల ప్రవచనాలు, ఇటు పురాణ ఇతిహాస గ్రంథాలు పేర్కొంటున్నాయి. క్రైస్తవుల పవిత్ర గ్రంథం బైబిలు ప్రచారంలోకి వచ్చినప్పటినుంచి జీసస్ క్రీస్తు అద్భుతాలు ఎన్నో వెల్లడయ్యాయి. జీసస్ నీటి మీదనడిచాడనీ, అసంఖ్యాకులైన భక్తుల ఆకలి తీర్చడానికి అనంతంగా రొట్టెలు సృష్టించాడనీ బైబిల్ లోని అధ్యాయాలు పేర్కొంటున్నాయి.
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|