|
|
Articles: TP Features | రాష్ట్రంలో రాజకీయ మాంద్యం - Mrs. lakshmi cherukuri
| |
తీవ్ర ఆర్థిక మాంద్యం సమయంలో జరిగిన ఎన్నికలలో కూడా రాష్ట్రం ధన ప్రవాహాన్ని చవిచూసింది. పార్లమెంట్ అభ్యర్ధులలో రాజకీయ కుబేరులను బరిలోకి దించడంలో కూడా దేశంలో రాష్ట్రమే అగ్రస్థానంలో ఉంది. కాని ఎన్నికలకు, ఫలితాల విడుదలకు మధ్య ఉన్న మూడు వారాల వ్యవధిలో మాత్రం రాష్ట్రంలో రాజకీయ మాంద్యం నెలకొన్నట్లు కనిపిస్తోంది. అభ్యర్థులు, పార్టీలు ఎవరి లెక్కలలో వారుంటే మన చానల్స్ మాత్రం పొంతన లేని కధనాలు, చర్చలతో కాలక్షేపం చేసింది.
కేంద్ర సంకీర్ణాల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. గత రెండు ఎన్నికలలోను రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయటంలో కీలక పాత్ర వహించటంతో అటు దేశ ప్రజల దృష్టి, జాతీయ మీడియా దృష్టి రాష్ట్ర ఎన్నికల ఫలితాలపై ప్రత్యేకంగా నిలిచింది. కేంద్రంలో అధికారం చేపట్టబోయే ప్రభుత్వం విషయంలోనే కాకుండా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే ప్రభుత్వం విషయంలో కూడా సర్వత్రా ఉత్కంట నెలకొంది. ప్రధానంగా ఈ ఫలితాలు పార్టీలకు అధికారం కట్టపెట్టే విషయంలోనే కాకుండా ప్రధాన పార్టీల మనుగడను నిర్థారించే పరిస్థితి ఉండటంతో రాష్ట్ర ప్రజానీకమే కాకుండా ప్రవాసాంధ్రులు, వివిధ జాతీయ రాజకీయ పక్షాల నాయకులు కూడా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి ఎన్నికలకు, ఫలితాలకు ఉన్న వ్యవధి చాలా ఎక్కువగా ఉండటంతో వివిధ జిల్లాలలో ఎన్నికల ఫలితాలపై జోరుగా పందాలు కూడా సాగుతున్నాయి.
ఇక పార్టీ వర్గాలలో, మీడియా వర్గాలలో వస్తున్న ఊహాగానాలకు, ఉత్కంఠకు కొంతైనా విరామం ఇవ్వాలని ప్రధాన పార్టీల అగ్రనేతలు వేసవి విడిదుల పేరుతో ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు తరలి వెళ్ళారు. కాని అధికారం దక్కుతుందో లేదో అన్న ఆరాటం అక్కడ కూడా నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేయటంతో మళ్ళీ రాష్ట్రానికే చేరుకుని సమీక్షలు మొదలుపెట్టారు. ఒక వైపు ఊరిస్తున్న అధికార పీఠం, మరొక వైపు అంచనాలకు అందని సమీకరణాలతో అభ్యర్థులు, నాయకులు కూడా క్షణమొక యుగంగా గడిపారు.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|