|
|
Articles: Poetry | అంకిత యాత్ర - Site Administrator
| |
(కత్తి పద్మారావు)
మనం కొండల మీద నడిచేటప్పుడే కాదు
రథాల మీద పురవీధుల్లో ఊరేగేటప్పుడు కూడా
మన శిరస్సుకు ముళ్ళకంచెలు తగుల్తాయి.
ఆ కొమ్మల్ని పైకి నెట్టడానికి
మునివేళ్ళతో లేచిన అంకితభావం
మన గాయాల్ని నివారిస్తుంది.
మనుష్యులను మనమేదైనా కోరితే
వాళ్ళు రాళ్ళతో మనకెదురౌతారు.
కోరికేదైనా అది బానిసత్వానికే దారితీస్తుంది.
కిరీటం పెట్టుకొన్నవాడైనా
ఎవరి పాదాల వంకైనా చూస్తే
ఆ కిరీటం నేలవాలుతుంది.
ఆత్మగౌరవాన్ని రక్షించుకోవాలంటే
మన మెత్తని పాదాలతో
పచ్చిక గడ్డి మీద నడచిపోవలసిందే.
ఆ గడ్డిపరక మనకు స్ఫూర్తినిస్తుంది.
దాని వేరు బలం నుండి అది ప్రకృతిని శాసిస్తుంది.
ఆ ద్రాక్షపందిరిని చూడండి,
అది ముళ్ళకంచెలతో నిర్మించబడింది.
ఆ గుత్తులు దాని సందుల నుంచి వేలాడుతున్నాయి.
కోరుకొంటున్నవాడు దానిని సరుకు అనుకొంటున్నాడు.
అందుకే వాడి చేతికి రంధ్రాలయ్యాయి.
ప్రకృతిలో అన్నీ కంచెలే
కవాతు చేసేవాడికి పాదం నిండా గాయాలే
ఏ గమ్యమైనా సుదూరమే
నక్షత్రాలూ పాలపుంతలూ
అవి తమ కక్ష్యల్లోనే తిరుగుతున్నాయి.
అన్ని అంకెలూ శతం వైపే దారితీస్తాయి.
గడుస్తున్న రోజు ఒక చింతన
వర్తమానం మనది కాలేకపోతుంది.
ఒక నిర్దేశితమైన సూత్ర గడియలు
మనుష్యుల్ని బొమ్మలు చేస్తున్నాయి.
అక్బర్ అన్నట్టు,
'మనల్ని అనేక ఆధిపత్యాలు నడిపిస్తున్నాయి'
మనల్ని మనం నడిపించుకునేదెప్పుడు?
సమాజాన్నంతా మనం గెలిచామని అనుకొంటాం.
కాని, దాని నడిబొడ్డులో నిలబడ్డప్పుడు
దాని కొలతలు భిన్నంగా ఉంటాయి.
ఆ ముదుసలి ఆ చూరు అంచున నిలబడి
నీకు మంచి జరగాలయ్యా అంది.
అప్పుడు మన కళ్ళు మెరిశాయి.
ఆ మాటలో చరిత్ర దాగుంది.
నిరపేక్షత ఉంది.
చరిత్రకు గుర్తులయిన మనుష్యుల ఆకాంక్షలలో
మనం కదుల్తూనే ఉంటాం.
ఊరి చివరిలో ఎవరూ ఊపకుండానే ఆ చెట్టు పూలు రాలాయి.
అది అంతిమ విజయానికి గుర్తు
ఈ అంకిత యాత్ర ఆగదు.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|