|
|
Articles: Devotion | సాయి లీలామృతం - Mr. Pratap Cherukuri Pratap
| |
శ్రీ సాయినాధునిది ఒక విశిష్టమైన, విలక్షణమైన అవతారం. మిగతా యోగి శ్రేష్టుల వలె కాక విభిన్నమైన పద్ధతులలో భక్తులను సంస్కరించేవారాయన. అనితర సాధ్యమైన వ్యాధులను చిత్రాతి చిత్రమైన పద్ధతుల ద్వారా నిర్మూలించేవారు. డాక్టర్ పిళ్ళై నారికురుపు, భీమాజీ పాటిల్ క్షయ వైద్యం, కాకామహాజని విరేచనాలను కేవలం నోటిమాటతో తగ్గించిన వైనం పరమాద్భుతం. ఇటువంటి మరొక విచిత్రమైన సంఘటనను ఇప్పుడు స్మరించుకుందాం.
ఒకసారి శిరిడీ గ్రామంలో కలరా వ్యాధి ఉధృతంగా వచ్చింది. ఎందరో గ్రామవాసులు ఆ వ్యాధి బారిన పడసాగారు. ఆ రోజులలో సరైన వైద్య సదుపాయాలు లేవు గనుక ఆ గ్రామ వైద్యుని వైద్యం మీదనే ప్రజలు ఆధారపడే వారు. ప్రతీ ఇంటిలో కనీసం ఒకరైనా ఈ వ్యాధి బారిన పడసాగారు. అందరూ సాయినే నమ్మి ఆయన నామస్మరణతోనే జీవితం గడుపుతున్నారు.
ఒకరోజు ఉదయం శ్రీ సాయి నిద్ర లేచి, ముఖప్రక్షాళనం చేసుకొని తిరగలి ముందు కూర్చొని గోధుమలు విసరడం ప్రారంభించారు. ఈ దృశ్యాన్ని చూసిన కొందరు 'శ్రీ సాయి ఇంత ప్రొద్దునే ఎందుకు గోధుమలను విసరడం ప్రారంభించారు? భిక్షాటనతో జీవించే ఫకీరుకు గోధుమలతో పనేమిటి?' అని అనుకోసాగారు. కొంత సేపటికి శిరిడీ గ్రామమంతటా ఆ వార్త వ్యాపించింది. వందల సంఖ్యలో ప్రజలు వచ్చి ఈ దృశ్యాన్ని చూడసాగారు.
ఇంతలో నలుగురు స్త్రీలు మసీదులోనికి వచ్చి బాబాను ప్రక్కకు జరిపి, ఆ గోధుమలను తామే విసరసాగారు. బస్తా నిండా గోధుమలు ఉన్నాయి. బాబాకు ఎలాగూ ఇల్లు, భార్యా, పిల్లలు కుటుంబం లేవు. ఈ గోధుమలను విసిరేస్తే ఆ పిండిని హాయిగా ఇంటికి తీసుకు వెళ్ళిపోవచ్చు. నెల రోజుల వరకూ ఇంటి గ్రాసం గురించి ఆలోచించనవసరం లేదు అనే విధంగా వారి ఆలోచనలు సాగుతున్నాయి.
గోధుమలను విసరడం పూర్తయ్యాక ఆ నలుగురూ పిండిని నాలుగు వాటాలు వేసి మూట కట్టుకోసాగారు. అంతవరకూ శాంతంగా జరిగే తంతును గమనిస్తున్న శ్రీ సాయి వెంటనే కోపంతో 'ఓ తల్లుల్లారా! మీకు పిచ్చి గానీ పట్టిందా ఏం? మీ వద్ద నేను ఏమైనా అప్పు తీసుకున్నానా? ఎందువలన ఈ పిండిని తీసుకుపోతున్నారు ?' అని అరిచారు. దాంతో ఆ స్త్రీలు ఆ పిండిని క్రింద వదిలేసి సిగ్గుతో లేచి నిల్చున్నారు. 'వెళ్ళండి. ఈ పిండినంతటినీ తీసుకువెళ్ళి గ్రామం సరిహద్దుల చుట్టూ చల్లండి. కలరా మహమ్మారి గ్రామమంతటా వ్యాపించింది. ఆమె ఎందరినో బలిగొనడానికి ప్రయత్నిస్తోంది. నా భక్తులను బదులుగా ఈ పిండిని ఆరగించి సంతుష్టి చెందమని ఆమెను ఆజ్ఞాపించాను' అని బాబా అన్నారు. ఆ మాటలకు అందరూ ఆశ్చర్యపోయారు.
తన భక్తులపై శ్రీ సాయి చూపించే అనిర్వచనీయమైన, అవాజ్యమైన ప్రేమకు అందరూ కళ్ళనీళ్ల పర్యంతరమయ్యారు. వెంటనే ఆ పిండిని తీసుకు వెళ్ళి శిరిడీ గ్రామం సరిహద్దు చుట్టూ చల్లారు. అద్భుతం! వర్ణింప శక్యంగాని విధంగా వెంటనే ఆ గ్రామంలో కలరా వ్యాధి తగ్గుముఖం పట్టింది. ఆ వ్యాధి బారిన పడి మృత్యువుతో పోరాడుతున్న వారందరూ తక్షణమే స్వస్థులయ్యారు. వ్యాధి నిర్మూలన కొరకు మందుల తయారీలో రేయింబవళ్ళూ కష్టపడుతున్న గ్రామ వైద్యునికి పనే లేకుండాపోయింది. కేవలం భగవంతుడైన శ్రీ సాయి ఆశీర్వాదం వల్లనే వ్యాధి తగ్గిపోయింది. వందలాది ప్రజలకు రక్షణ దొరికింది కలరా వ్యాధితో అతలాకుతలమౌతున్న శిరిడీ గ్రామంలో సుఖశాంతులు వెల్లివిరిశాయి. నాటి నుండి ఈ సృష్టికే గొప్ప వైద్యుడైన శ్రీ సాయినాధుని శిరీడీ గ్రామ ప్రజలు మరింత భక్తి శ్రద్ధలతో ఆరాధించసాగారు.
(సర్వం శ్రీ శిరిడీ సాయినాధ పాదారవిందార్పణమస్తు)
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|