|
|
Articles: My Thoughts | తప్పెవరిది?! - Site Administrator
| |
(విజయబక్ష్)
'మా అమ్మాయి సెల్ ఫోన్ లో ఏం మాట్లాడుతుందనుకొన్నారు...! ఎంత మంది ఫ్రెండ్సున్నారో చెప్పలేను. ఇంట్లో వుందంటే ఒక్క నిముషం కూడా ఖాళీగా ఉండదు'.
'మా అమ్మాయి బర్త్ డేకి మొన్నీ మధ్య మూడువేల రూపాయల డ్రెస్ కొన్నాను. వర్క్ అదిరిపోయిందనుకో'.
'మా అమ్మాయి బర్త్ డేకి ఫ్రెండ్స్ కి ట్రీట్ ఇచ్చింది. ఓ నాలుగు వేలైంది... పార్టీ, సినిమా ఖర్చు...'
నేటితరం తల్లులు కలిస్తే చెప్పుకొనే కబుర్లు తమ పిల్లల గురించి ఇవే! ఎవరెంతగా పిల్లలమీద ఖర్చు ఎక్కువ పెడితే అంత గొప్పని అనుకొంటున్నారు. పిల్లలు అడిగింది తక్షణమే తీర్చడం తమ 'కర్తవ్యం'గ భావిస్తున్నారు. అందునా ఇపుడు ప్రతివారికీ ఒకరిద్దరి కంటె పిల్లలు ఉండడం లేదు... ఆ ఒకరిద్దరి మీదనే తమ ఆశలు... ప్రేమలు... అతి గారాబంగా, ఎక్కడ నడిస్తే కందిపోతారో అన్నట్లు పెంచుతున్నారు.
తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమగా, ఆప్యాయంగా పెంచడంలో తప్పులేదు. కానీ అది శృతిమించితే వచ్చే అనర్థాలు అన్నీ ఇన్నీ కావు. అందరిలోకీ తమ పిల్లలు 'ప్రత్యేకం'గ కనిపించాలి అని కొందరికి ఓ విధమైన తపన ఉంటుంది. అదే ధోరణిలో పెంపకం కొనసాగటంతో పిల్లలు ఎదిగాక పెంకిగా, మొండిగా తయారవుతున్నారు. తల్లిదండ్రులు బిడ్డల్ని ముద్దు చెయ్యవచ్చు... తప్పులేదు. కాని వారిని సరయిన మార్గంలో నడిపించే బాధ్యత కూడా తల్లిదండ్రుల మీద ఉంది కదా! అది మరచిపోతేనే ప్రమాదం. ముఖ్యంగా పెంపకం విషయంలో తల్లి బరువు బాధ్యతలు గణనీయమైనవి. అందునా ఆడపిల్లల విషయంలో మరీ జాగరూకతతో ఉండాలి. నేటి సమాజంలో పిల్లలు నెగ్గుకురావాలంటే ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం కూడా పెంపొందింపచేయాలి. కేవలం మంచి డ్రస్సులు, ఫ్యాషన్లు, ఆకలి తీరేలా కడుపునిండా తిండి పెట్టడమే కాదు, మంచి చెడుల విశ్లేషణ, నైతిక ప్రవర్తన, వినయవిధేయతలు వీన్నింటినీ నేర్పవలసిన బాధ్యత ముఖ్యంగా తల్లిదే!
అట్లా అని ఎదిగిన పిల్లల్ని ఏదో కస్టడీలో పెడుతున్నట్లు కాకుండా స్నేహపూర్వకమైన ధోరణిలోనే అన్ని విషయాలూ చెప్పాలి. లేకుంటే 'అమ్మ ఏమిటి సీఐడీలా అన్నీ పరిశోధిస్తుంది' అనే భావం పిల్లల్లో కలుగుతుంది. అలా కాకుండా పిల్లలతో ఆత్మీయంగా మెలుగుతూనే క్రమశిక్షణలో పెట్టవచ్చు. పాఠశాలకు వెళ్ళే వయసు నుండి మొదలెట్టి కళాశాల విద్య పూర్తయ్యేవరకు కూడా తల్లి ఏ రోజుకారోజు అన్ని విషయాలను పిల్లల్ని అడిగి తెలుసుకుంటే తెలీకుండానే పిల్లలు అమ్మని 'ఆత్మీయురాలి'గా భావిస్తారు. మొదట అమ్మ ప్రేమగా అడగటం ప్రారంభిస్తే, ఆ తర్వాత పిల్లలు అడకుండానే తన విషయాలను తల్లితో చెప్పడం ప్రారంభిస్తారు. ఆ క్రమంలో చక్కగా మాట్లాడుకోవడం - చర్చించుకోవడం - సలహాలివ్వడం అన్నీ అలవుడుతాయి. కొందరు తల్లీ పిల్లలు ఎంత మంచి స్నేహితులుగా ఉంటారో! ఏ విధమైన అరమరికలు లేకుండా ఎంతో చక్కగా అన్ని విషయాలూ మట్లాడుకొంటారు.
సమాజంలో ఓ మనిషిలా జీవించటానికి చదువు ఎంత ముఖ్యమో, మానవత్వపు విలువలు, నైతిక బాధ్యత, కుటుంబం, దేశం పట్ల ప్రేమ ఇవన్నీ చాలా అవసరమని పిల్లలు గుర్తించాలి. దురదృష్టవశాత్తు మనం ఎంతకీ ర్యాంకులు సాధించడం, ఇంజనీరింగ్, మెడిసిన్ లో సీట్లు సాధించటం, విదేశాలకు వెళ్ళడం మీద చూపిన శ్రద్ధ జీవిత సత్యాలను గ్రహించడంలో చూపడం లేదు... పిల్లలకి చెప్పడం లేదు. సమాజం చూపుతున్న ఈ అలసత్వానికి శిక్షను అనేక రూపాల్లో అనుభవిస్తూనే ఉంది. మన భాషా సంస్కృతుల పట్ల పిల్లలకి ఏ మాత్రం గౌరవం లేకుండా మనమే తయారు చేస్తున్నాం.
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|