|
|
Articles: My Thoughts | చారిత్రక క్షణాలు - Site Administrator
| |
(వెంకట్ ఎక్కా)
గడచిన 19 రోజులు చరిత్రాత్మకమైనవి... కెసిఆర్ ఆమరణ నిరాహార దీక్షను మరొక ఎత్తుగడగా కొందరు పరిగణించారు. దీక్ష ప్రారంభించిన మరునాడే కెసిఆర్ పళ్ళరసం సేవించడం వంటి హంసపాదులతో కూడుకున్నది. ముఖ్యమంత్రి రోశయ్య, సోనియా గాంధి దిష్టిబొమ్మలతో 'శవ'యాత్రలను జరపసాగిన విద్యార్థులు కెసిఆర్ నిరాహారదీక్ష విరమించారన్న వార్త వినగానే అకస్మాత్తుగా ఆయనకు 'అంతిమ యాత్రను, అంత్యక్రియలను' నిర్వర్తించారు.
కెసిఆర్ త్వరగానే ఆర్.కె. నారాయణ్ నవలారాజం 'ది గైడ్'లోని ప్రధానపాత్రగా మారిపోయారు. నవలలో గ్రామస్థులు వర్షాల కోసం నిరాహార దీక్ష చేపట్టేట్లుగా హీరోను నిర్బంధిస్తారు. ఆ హీరో చివరకు మరణించగా అతనిని వారు అమరవీరునిగా పేర్కొంటారు. అయితే, ఇది చరిత్రే గాని నవల కాదు... రెండవసారి కెసిఆర్ సీరియస్ గా నిరాహారదీక్ష సాగించారు. ఈ దఫా తెలంగాణ కోసం తన ప్రాణాలైనా ఇచ్చేందుకు ఆయన సిద్ధమయ్యారు. 'మహాకూటమి'లో భాగం కావడానికి తెలుగుదేశం పార్టీ నుంచి రూ. 100 కోట్లు ఆయన తీసుకున్నారనడం వంటి ముందు వినవచ్చిన ఆరోపణలన్నీ నిమ్స్ నుంచి ఆయన ఆరోగ్య స్థితికి సంబంధించిన వీడియో దృశ్యాలతో అంతరించిపోయాయి... ఇది నటనేనని ఎవరైనా వ్యాఖ్యానించినట్లయితే పెద్ద పొరపాటు చేశారన్నమాటే... అనేక రుగ్మతలు ఉన్న మనిషి 11వ రోజు తన నిరాహారదీక్ష విరమించాలన్న వైద్యుల సలహాను పాటించలేదు... నిమ్స్ దృశ్యాలు 'తెలివైన, వ్యూహాల' రాజకీయ నాయకుని ఒక మహాత్మాగాంధీగా, ఒక పొట్టి శ్రీరాములుగా మార్చివేశాయి. మరి రెండు రోజులు దీక్ష సాగి ఉంటే అర్భకంగా ఉన్న కెసిఆర్ కోమాలోకి వెళ్ళిపోయేవారు లేదా ఆయన ఆరోగ్య స్థితి విషమించి ఉండేది. ఆ తరువాత కెసిఆర్ ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు త్యాగంచేసిన నేతగా ఖ్యాతి గడించి ఉండేవారు.
కాంగ్రెస్ చొరవ చూపి 'ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించడమైనది' అని కేంద్ర హోమ్ శాఖ మంత్రి పి. చిదంబరంతో ప్రకటన చేయించి హైదరాబాద్ లో పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా నివారించగలిగింది. నిరసన ర్యాలీలు విజయోత్సవాలుగా మారిపోయాయి... రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ 'ప్రక్రియ', 'తీర్మానం' వంటి పదాలకు తమకు తోచిన రీతిలో అన్వయించుకోసాగారు. అయితే, పరిస్థితి అనుహ్యంగా మరొక మలుపు తిరిగింది. 'తెలంగాణ' ప్రకటనపై ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో పెద్ద ఎత్తున అలజడి రేగింది. తెలంగాణ ఏర్పాటుకు తెలుగుదేశం పార్టీతో సహా పార్టీలన్నీ మద్దతు తెలియజేసినా ఆ రాష్ట్రం ఏర్పాటవుతుందని అవి అనుకోలేదు. వాస్తవానికి యథాతథ స్థితి సాగుతుందని, ఎటువంటి విపరిణామాలూ లేకుండానే తెలంగాణకు మద్దతును కొనసాగించవచ్చునని అవి భావించాయి.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|