|
|
Articles: Devotion | శ్రీ సాయి లీలామృతం - Mr. Pratap Cherukuri Pratap
| |
భక్తుల పాలిట కల్పవృక్షం, దీన జన బాంధవుడు అయిన శ్రీ సాయినాధుడు తన భక్తులకు వివిధ రూపాలలో దర్శనం ఇచ్చి అనుగ్రహించేవారు. మొదట్లో ఆయనను గుర్తించలేకపోయిన భక్తులకు తాను వచ్చిన సంగతిని తిరిగి తెలియజేసి వారిని ఆశ్చర్య చకితులను చేసేవారు.
ఒక సందర్భంలో సాయి భక్తాగ్రేసరుడైన నానాసాహెబ్ చాందోర్కర్ బాబా కోసం నైవేద్యం తీసుకు వచ్చాడు. మహారాష్ట్రీయులకు అత్యంత ప్రీతిపాత్రమైన పోళీలను (బొబ్బట్లు) కూడా ప్రత్యేకంగా చేయించి తీసుకు వచ్చాడు. నానా మసీదుకు వచ్చేసరికే సాయి భోజనం పుర్తయింది. నైవేద్యం కొద్దిగానైనా రుచి చూడమని నానా ప్రార్ధించగా బాబా 'నా భోజనం ఇప్పుడే పుర్తయింది. నువ్వు ఈ పళ్ళాన్ని ఇక్కడ పెట్టి నీ బసకు వెళ్ళి భోజనం చెయ్యి' అన్నారు. సరే అని నానా వెళ్ళిపోయాడు కాని శ్యామాను పిలిచి బాబా తానిచ్చిన ప్రసాదాన్ని ముట్టుకున్నారో లేదో చూసి తనకు తెలియజేయమని చెప్పాడు. 'బాబా నేను సమర్పించిన ప్రసాదాన్ని ముట్టుకుంటే గాని ఈ పూట భోజనం చెయ్యను' అని కరాఖండగా చెప్పాడు నానా. గురు శిష్యుల మధ్య సంబంధం ఎలా ఉందో చూడండి. తానిచ్చిన ప్రసాదం గురువు ముట్టుకుంటే గాని శిష్యుడు మెతుకైనా తినడు. శిష్యుడు తృప్తిగా భోజనం చెయ్యకపోతే గురువుకు ఆందోళన.
కొంత సేపయ్యాక బాబా శ్యామాను పిలిచి నానా భోజనం చేశాడా అని అడిగారు. 'మీరు అతను సమర్పించిన నైవేద్యాన్ని ముట్టుకుంటే కాని ఏమీ తినడట' అని బదులిచ్చాడు శ్యామా.
అందుకు సాయి మందహాసంతో 'నేనెప్పుడో అతని నైవేద్యాన్ని ఆరగించానని చెప్పు' అన్నారు. తాను చూస్తుండగా బాబా ఆ పళ్ళాన్ని తాకనైనా లేదు, మరి తిన్నానని అబద్ధం ఎందుకు చెబుతున్నారా అని అనుకున్నాడు శ్యామా.
అతని మనసులోని ఆలోచనలను కనిపెట్టిన సాయి 'ఈ పళ్ళెంలో ప్రవేశించిన ఈగలు, దోమల రూపంలో నేనే ఆరగించాను. కనుక నానాను భోజనం చెయ్యమని చెప్పు' అన్నారు.
అప్పుడు అసలు సంగతి అర్ధమై శ్యామా కళ్ళు అర్ధ నిమీలితాలయ్యాయి. ఈ సృష్టిలో ప్రతీ జీవిలో తానున్నానని బోధించేందుకే శ్రీ సాయి మహరాజ్ ఈ లీల చేశారని అర్ధం చేసుకొని ఆనందంతో ఈ విషయం నానాకు చేరవేశాడు.
మరొక సందర్భంలో బాబా నానాతో 'నీ ఇంటి గడపలోకి ఎవరైనా వచ్చి సహాయమడిగితే నీ శక్తి సామర్ధ్యాల మేరకు వారికి దానమిచ్చి పంపు. ఏమీ లేకపోతే కనీసం రెండు మంచి మాటలైనా చెప్పు' అని సలహా ఇచ్చారు. అలాగేనని నానా తలూపి వెళ్ళిపోయాడు. నాలుగైదు రోజుల తర్వాత అతని ఇంటికి ఒక ముసలావిడ వచ్చి కాస్త అన్నం ఉంటే పెట్టమని అడిగింది. ఇంట్లో పెట్టేందుకు ఏమీ లేదని నానా పనిమనిషి ఆ ముసలిదానిని పంపించబోయింది కాని ఆ ముదుసలి ఏమైనా పెడితే కాని వెళ్ళబోనని భీష్మించుకు కూర్చుంది. ఇంతలో ఇంట్లోంచి నానా వచ్చి ఎవడబ్బ సొమ్మని నా ఇంట్లోకి వచ్చి బిచ్చమడుగుతున్నావని పెద్దగా తిట్టి ఆమెను మెడ బట్టి గెంటేశాడు.
నానా కొంతకాలానికి షిరిడీ వెళ్ళి సాయిని దర్శించుకున్నప్పుడు 'నీ ఇంటికి వచ్చినప్పుడు నన్ను మెడ బట్టి బయటకు గెంటేశావెందుకు?' అని అడిగారు.
బాబా మాటలకు నానా ఆశ్చర్యపోయాడు. తను తన సమర్ధ సద్గురువైన బాబాను బయటకు పంపించడమేమిటీ అని ఎంత తల పగలుకొట్టుకొని ఆలోచించినా అర్ధం కాలేదు.
'నేను బిచ్చగత్తె రూపంలో నీ ఇంటికి వచ్చినప్పుడు నేను నీకు ఉపదేశించిన సలహాను మరిచిపోయి నీళ్లైనా ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా తరిమేశావు. సాయి రూపంలో ఉన్న నాకు పంచ భక్ష్య పరమాన్నాలూ పెడతావు, కాని ముసలి రూపంలో వస్తే దూషిస్తావు. ఇంకెప్పుడు నా తత్వాన్ని అర్ధం చేసుకుంటావు ?' అని సాయి అడిగేసరికి సిగ్గుతో నానా తల వంచుకున్నాడు.
'మనుష్యులైనా, జంతువులైనా, క్రిమి కిటకాదులైనా ౠణానుబంధం వలనే మన వద్దకు వస్తారు. మన శక్తిని బట్టి వారిని ఆదరించాలి కానీ చీదరించుకోకూదదు. ఒకవేళ ఇచ్చేందుకు ఏమీ లేకపోతే అదే మాట సౌమ్యంగా చెప్పాలి గాని చీదరించుకోకూడదు. ఒకరు మరొకరిని దూషిస్తే నాకెంతో బాధ కలుగుతుంది. సర్వ జీవ సమానత్వం, సర్వ మానవ సౌభ్రాతృత్వం త్రికరణ శుద్ధిగా ఆచరించేవారు నాకెంతో ఇష్టులు' అని శ్రీ సాయి ఒక అద్భుతమైన బోధ చేశారు.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|