|
|
Articles: TP Features | రాజ్యాంగానికి షష్టిపూర్తి - Site Administrator
| |
(ఎ.రామలింగేశ్వరరావు)
మన దేశానికి స్వాతంత్ర్యం రాక ముందే రాజ్యాంగ రచనకి పునాది వేయడం జరిగింది. 9-12-1946న 296 మంది సభ్యులున్న రాజ్యాంగసభ 207 మంది సభ్యులతో తన మొదటి సమావేశం జరిపింది. తర్వాత స్వతంత్ర రాజ్యాలు మన దేశంలో విలీనం అవుతూ ఉండడంతో ఈ సంఖ్య మారుతూ వచ్చింది. 13-12-1946న రాజ్యాంగసభ లక్ష్యాల్ని ఉద్దేశిస్తూ తీర్మానాల్ని ప్రవేశపెట్టడం జరిగింది. భారతదేశం వివిధ రాష్ట్రాల సమాఖ్యగా ఉండాలని, రాష్ట్రాలకు, కేంద్రానికి ప్రత్యేక హక్కులు నిర్దేశించబడాలని, స్వతంత్ర భారతదేశం అధికారం ప్రజల నుండి పొందాలని, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో న్యాయం జరగాలని, న్యాయం ముందు అందరికీ సమానావకాశం ఉంటూ, పరిమితులకు లోబడి అందరికీ భావప్రకటనా స్వేచ్ఛ, ఆరాధనా స్వేచ్ఛ, వృత్తి చేసుకోవడానికి, ఏ సంఘంలోనైనా సభ్యులుగా ఉండడానికి స్వేచ్ఛగా ఉండాలని, మైనారిటీలను, వెనుకబడిన, గిరిజన ప్రాంతాలకు, వెనుకబడిన, అణచివేతకు గురైన ప్రజల రక్షణకు తగిన ఏర్పాట్లు చేయాలని లక్ష్యాలుగా పేర్కొన్నారు. రాజ్యాంగసభ ఏడుగురు సభ్యులతో రాజ్యాంగ రచనా కమిటీని ఏర్పాటు చేయగా ఆ కమిటీకి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. అనేక సమావేశాల తర్వాత 26-11-1949న రాజ్యాంగాన్ని సభ ఆమోదం పొందింది. చివరిగా 24-1-1950న సభ్యులంతా సంతకం చేశారు. రాజ్యాంగ రచనతో పాటు జాతీయ పతాకం, జాతీయ గీతం ఆమోదించడం, కామన్వెల్తు సభ్యదేశంగా మన దేశం ఉండడాన్ని అంగీకరించడం, ప్రథమ రాష్ట్రపతిని ఎన్నుకోవడం కూడా రాజ్యాంగసభ చేసింది. ఈ విధంగా రాజ్యాంగసభ తన కార్యక్రమాల్ని డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన జరిపింది.
తయారైన రాజ్యాంగాన్ని ప్రజల ముందుంచుతూ అధ్యక్షుడు డాక్టర్ రాజేంద్రప్రసాద్ అన్న మాటల్ని ఒకసారి మనం మననం చేసుకుంటే మంచిది.
'ఎన్నికైన ప్రజలు సమర్ధులూ, శీలం కలవారూ, చిత్తశుద్ధి ఉన్నవాళ్ళయితే లోపభూయిష్టమైన రాజ్యాంగాన్ని కూడా గొప్పగా నడిపించగలరు. వాళ్ళకవి లోపిస్తే రాజ్యాంగం రాజ్యాన్ని రక్షించలేదు. రాజ్యాంగం ఒక జీవంలేని యంత్రం. దాన్ని నియంత్రించి నడిపించే మనుషుల వల్ల దానికి జీవం వస్తుంది. తమకు దేశం ముఖ్యం అనుకునే కొద్దిమంది నిజాయితీపరులు ఈ రోజు భారతదేశానికి అవసరం. మన జీవితాల్లో అనేక విచ్ఛిన్నకర శక్తుల ప్రభావం ఉంది. మనకు మత భేదాలు, కుల భేదాలు, భాషా భేదాలు, ప్రాంతీయ భేదాలు వంటివి ఉన్నాయి. వీటివల్ల వచ్చే ఒడిదుడుకుల్ని తట్టుకొని నిలబడగలిగే ముందుచూపు గల, దృఢమైన ప్రవర్తన, కొద్దిమంది కోసమో, కొన్ని ప్రాంతాల కోసమో దేశ అవసరాన్ని బలిచేయనటువంటి వాళ్ళని ఎక్కువమందిని ఇస్తుందని ఆశిద్దాం'.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|