|
|
Articles: TP Features | సంఘానికే వైద్యం కావాలి - Site Administrator
| |
భర్తను కోల్పోయిన తల్లి అన్నీ తానే అయి తన బిడ్డలను పెంచుకొంటుంది. తాను ఎదుగుతూ ఉంది. అదే సమయంలో తనలో ఉన్న అనేక పార్శ్వాలకు ఆయువులు పోస్తుంది. పరివ్రాజకులైన (బౌద్ధ సన్యాసినులైన) బౌద్ధ స్త్రీలు దేశం ఎల్లలు దాటి ప్రపంచం అంచులు చూశారు. జ్ఞానం పంచడానికి తల్లి ఉపక్రమిస్తే ప్రపంచమంతా జ్ఞాన దాహంతో దోసిళ్ళు పడుతుంది. అలాగే కరుణను పంచడానికి తల్లి ఉపక్రమిస్తే ప్రపంచం ఆర్ద్ర హృదయంతో మోకరిల్లుతుంది. ప్రేమను పంచడానికి తల్లి ఉపక్రమిస్తే ప్రపంచం నదీ ప్రవాహతకు గురై చలనశీలం అవుతుంది. తల్లి ప్రవక్త అవడానికి, తల్లి జ్ఞానదాత అవ్వడానికి అనేక ధర్మాలు విధించిన సంకెళ్ళను దోసిళ్ళలోకి తెచ్చుకోగలిగింది. బుద్ధుడు ఉగ్రహుని ఆతిథ్యాన్ని స్వీకరించిన సందర్భంలో తన కూతుళ్ళకు ఉపదేశం ఇవ్వమన్నపుడు బుద్ధుడు 'తల్లిదండ్రులను ఆదరించి శుశ్రూష చేయాలి. మీ ఇంటికే సన్యాసి వచ్చిన తనకు ఆతిథ్యం ఇవ్వాలి. (అదే పుస్తకం - అదే పేజి) అన్నాడు.
బౌద్ధాన్ని ప్రపంచవ్యాప్తంగా స్త్రీలు ఆదరించారు. సన్యాసులను పోషించారు. భిక్షకు వెళ్ళిన సన్యాసులు క్రమశిక్షణతో మెలిగారు. తమకు వచ్చిన వైద్యాన్ని ఆ కుటుంబంలో రుజగ్రస్తులకు చేసి బాగుచేశారు.'
తల్లితనానికి మారుపేరు :
భారతదేశంలో స్త్రీలు గణవ్యవస్థల్లో సమాజ పరిణామకర్తలుగా ఉన్నారు. గణ నాయకులుగా ఉన్నారు. సమసమాజ భావన అప్పుడుంది. సంపంద అందరూ సంపాదించి సమంగా అనుభవించే స్వభావం అప్పుడు ఉంది. వైదిక యుగంలో స్త్రీ ద్వితీయం అయ్యింది. పురుషుడు ప్రధానమయ్యాడు. అప్పటి నుండి ఆమెను తనలో భాగంగా చూపించడానికి విష్ణువు రొమ్ముపైన, బ్రహ్మకు ముఖంలో, శివునికి శరీరంలో భాగం చేయడం ద్వారా ఆమెను ద్వితీయం చేయాలనే పెద్ద ప్రయత్నం జరిగింది. మానవ సమాజ పరిణామంలో సుమారు 50 వేల సంవత్సరాల కాలంలో ఏ స్త్రీ తన వ్యక్తిగత పేరు ప్రఖ్యాతుల కోసం, తన నామస్మరణ కోసమో ఇతర మానవులను వధించలేదు. కాని వైదిక సమాజంలో జరిగిన ప్రతీ యజ్ఞంలో అశ్వమేధ, రాజసూయ మొదలైన అనేక యజ్ఞాల్లో ఆమెకు ద్వితీయస్థానం కూడా ఇవ్వకపోగా అవమానకర అంశాలను యజ్ఞాల్లో తీసుకువచ్చారు. అయితే పరుష మేధయాగం స్త్రీని అవమానించడంలో పరాకాష్టకు చేరింది. సంతానం కోసం ఆమెను ఒక సాధనంగా వాడారు.
ఆ దశ నుండి మళ్ళీ గౌతముడు తాత్విక రంగంలోకి వచ్చాకే తల్లి అనే అంశం ముందుకు వచ్చింది. ఒక ప్రవక్తనైనా, వక్తనైనా, ప్రయోక్తనైనా తల్లే కంటుంది. అతడు ఆర్జించిన జ్ఞానం ప్రాథమికంగా కూడా తల్లిదే. ప్రతి జ్ఞానవంతుడు ఆదిగురువు తల్లే అనే అంశాన్ని బౌద్ధులే ఎక్కువగా అనుభూతిచెందారు. కారణం బౌద్ధ పరివ్రాజకులకు (బౌద్ధసన్యాసులకు) 'తల్లే' కాని 'భార్య' ఉండదు.
అతడు ప్రపంచమంతా తిరుగుతాడు. ఎందరో సౌందర్యవతులను చూస్తాడు, రోగగ్రస్తులను చూస్తాడు, రుణగ్రస్తులను చూస్తాడు. వ్యధితులను చూస్తాడు, ఆయా దశల్లో ఉన్న వారందరికీ తన సేవలు అందిస్తాడు. కాని తనకు 'సేవ' అవసరమైనపుడు 'తల్లే' గుర్తుకు వస్తుంది. తల్లి అప్పటికి వృద్ధురాలైనా ఆమె చూపులు బిడ్డ మీదే ఉంటాయి. తన కళ్ళలోని క్రాంతి కిరణాలతో బిడ్డను లేవనెత్త గలుగుతుంది. తాను యవ్వనంలో ఉన్నప్పుడు కామించిన సౌందర్యవతి దగ్గరకు వెళతాడు. అక్కడ 'సేవ' దొరకదు. తన్ను నిరాకరించిన 'అహం' స్తబ్ధత రూపంలో కనిపిస్తుంది. అందుకే 'తల్లితనం' అనేదే ఒక తత్వంగా ముందుకు వచ్చింది. ఈ తల్లి వృద్ధురాలైనపుడు పరివ్రాజకునికి కబురు వస్తుంది. తనకు మలమూత్రాలు ఎత్తిన తల్లి దగ్గర తన చేతులు వెనక్కు లాగితే అతని పరివ్రాజకత్వంలో తల్లితనం లోపిస్తుంది. అతడు సేవ చేయగలిగితే అతని మానవత్వం వికసిస్తుంది. అందుకే బౌద్ధమంటే తల్లితనానికి మారుపేరుగా ముందుకు వచ్చింది.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|