|
|
Articles: TP Features | తెలుగుజాతి కోసం... - Site Administrator
| |
మనలో మనకున్న రాజకీయ భేదాలు ప్రజావసరాలను, రాష్ట్ర ప్రగతిని దెబ్బతీయకూడదు. ప్రజలను తొలి నుండీ మోసగిస్తూనే ఉన్న రాజకీయ పార్టీల, నాయకుల స్వార్ధపూరిత రాజకీయాలే తెలుగు ప్రజల భాషా సాంస్కృతిక సంబంధాలను విచ్ఛిన్నం చేస్తున్నాయి. ప్రత్యేక రాష్ట్రాల వాదనలు ఈ దుష్ట రాజకీయుల పాప ఫలితాలే. వీటి ఫలితంగా పాలనాపరంగా వేర్వేరు రాష్ట్రాలుగా ఏర్పడినా, భాషా సాంస్కృతిక బాంధవ్యాల్ని మనం చెడగొట్టుకోకూడదు. సరికదా, భాషాబంధాన్ని చెడగొట్టే ప్రయత్నాల్ని మొదలంటా తుంచివెయ్యాలి. దేశంలోని తెలుగువారందర్నీ కలిపి ఒకే రాష్ట్రంగా ఉంచడం సాధ్యం కాదు. మొత్తం తెలుగువారిలో ఆంధ్రప్రదేశ్ లో సగంమందీ, బయటి రాష్ట్రాల్లో సగంమందీ ఉన్న పరిస్థితుల్లో అందరూ ఒకే రాష్ట్రంగా ఉండడం జరిగే పని కాదు. ఈ వాస్తవ నేపథ్యంలోనే మన భాషా సాంస్కృతిక వికాసం గురించి ఆలోచించాలి. మన భాషాజాతీయత గురించి ఆలోచించాలి. భాషోద్యమాలను కూడా ఈ వాస్తవాల ప్రాతిపదికపైనే నిర్మాణం చెయ్యాలి. మొత్తం తెలుగుజాతిలో పునరుజ్జీవన ఉద్యమాన్ని తేవడానికి భాషోద్యమాలు దోహదం చేస్తాయి. ఇందు కోసం తెలుగుజాతి కోసమే అంకితమయ్యే విధంగా, ప్రభుత్వాల, రాజకీయుల మెడలు వంచే ఉద్యమాలు రావాలి. ఏ దశలోనూ ఎవరికీ మినహాయింపులు లేని స్వాభిమానోద్యమాలు ఎక్కడికక్కడే తెలుగు యువతలో పెల్లుబకాలి. తెలుగు ప్రజలకు, తెలుగుజాతికి ఎక్కడ అన్యాయం జరిగినా తీవ్రంగా ప్రతిఘటించే ధోరణులు నెలకొనాలి. ప్రాచీన భాషా ప్రతిపత్తి కోసం అంత అలజడికి కారణం ఇదే.
స్వాభిమాన పోరాటాలకు భాషా జాతీయతే ఆధారం, ప్రాణం కూడా. అంతటి భారత స్వాతంత్ర్య ఉద్యమంలో కూడా భాషాజాతీయులుగానే ఈ దేశంలో వివిధ ప్రాంతాల్లోని ప్రజలు స్పందించారనీ, గుర్తింపును పొందారనీ మనం విస్మరించకూడదు. తెలుగువారి పట్ల వివక్ష ఆనాటి నుంచీ ఉన్నదే. అవసరాలకు వాడుకొని వదిలేసినా కిక్కురుమనకుండా, తమ స్వార్థ అవసరాల కోసం తెలుగు ప్రజల బాగోగుల్ని బలిపెట్టిన చరిత్ర మన నాయకులదే. ఈనాటి తెలుగు దుస్థితికి కూడా ప్రధాన బాధ్యత వీరిదే. అందుకే రాజ్యవ్యవస్థల్ని వదిలివేసి, కేవలం ప్రజలలో ప్రచార కార్యక్రమాల ద్వారా ఏదో సాధిస్తామని చెప్పడం గడుసుతనమో, మోసమో అవుతుంది తప్ప వేరేకాదు.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|