|
|
Articles: Literature | విధి వంచిత ద్రౌపది - Mr. SATYANARAYANA PISKA
| |
ద్రౌపది మెల్లగా లేచింది. ఒంటినిండా దుమ్ము. గుండెనిండా రొప్పు. జుట్టు చెల్లాచెదరయింది. రోషంతో కళ్ళు కారిపోతున్నాయి.
చేతనైనంత దృఢంగా అడుగులువేస్తూ ముందుకు నడిచింది. నడుస్తూ ఎర్రగా అందరినీ కలయజూచింది. తన భర్తలు కంటబడగానే ఛీ అనుకుంది.
'...గంధర్వు లేవురు నన్ను నిట్టు
లొకడు పరుపంగ నూరక యునికి చూడ
నచ్చెరువు కాదె? యెవ్వరి యాండ్రు రింక
పరిభవంబును బొందక బ్రతుకువారు!'
అని అందరి కళ్ళల్లోకీ చూస్తూ అడిగింది. కీచకు డక్కడే ఉన్నాడు. ఒక్కడూ నోరు మెదపలేదు.
'ఈ నరపతి యాస్థానము
లో నొక్కరుడైన ధర్మలోపభయమునన్
బూని తగవైన వెడపలు
కైనను బలుకంగఁ జాలడయ్యెడు నకటా!'
అని దిగ్భ్రాంతి ప్రకటించింది.
విరాటుడు నిస్సహాయంగా కీచకుడి వంక చూశాడు. ద్రౌపది గమనించింది. ఒళ్ళు మండి, కుడిచేతి చూపుడువ్రేలిని విరాటుని ముఖం వైపు గ్రుచ్చుతూ---
'ఐనను మత్స్యదేశమున నాజ్ఞ్జ కితం డొడయుండు
కాన నా కీ నరనాథు దూరదగు!'
అని విసురుగా పలికింది.
విరాటుడు కలవరపడ్డాడు. కీచకుణ్ణి బతిమాలాడు. బుజ్జగించాడు. ఇంటికి పంపించాడు.
ఇది చూసి కొలువులోని వారందరూ ఆశ్చర్యపడ్డారే గాని, ఒక్కడు నోరెత్తితే ఒట్టు. ధర్మరాజు ద్రౌపదికి నచ్చజెప్పి సుధేష్ణ మందిరానికి పంపే ప్రయత్నం చేశాడు. ద్రౌపది కదల్లేదు. పైగా ఏదో అనబోయింది.
'ఆగు. ఊరుకున్నకొద్దీ నాటకంలో వేషంలా చేతులు తిప్పుతూ, ఛీ! ఏమిటా అభినయం ? పైగా ఇల్లాలినంటావు. ఇల్లాళ్ళు ఇలాగే ప్రవర్తిస్తారా?' అని ధర్మరాజు కోప్పడ్డాడు.
ద్రౌపది విపరీతంగా గాయపడింది. నిజమే! తను ఏ పని చేసినా అభినయంలా ఉంటుంది. తన ప్రతి చూపూ, ప్రతి మాటా, ప్రతి కదలికా అందంగా తీర్చినట్లుంటాయని అందరూ అంటారు. మాట్లాడేటప్పుడు అప్రయత్నంగా చేతులు కదులుతాయని తనకూ తెలుసు. ఏ భావమైనా స్వచ్ఛంగా, స్పష్టంగా ప్రతిఫలించే ముఖం తనది. అయితే--
తను కొలువుకు రావటం తప్పా? వచ్చి మొర పెట్టుకోవటం తప్పా? మొరను ఆలకించకపోతే, ఎందుకు ఆలకించరని అడగటం తప్పా? ఏది తప్పు?...
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|