|
|
Articles: Literature | విధి వంచిత ద్రౌపది - Mr. SATYANARAYANA PISKA
| |
మాట్లాడే తీరులోని తన విలక్షణతను ఆసరా చేసుకుని ఇంత నీచంగా మాట్లాడతాడా నలుగురిలో! పైగా, తనలో ఇల్లాలి లక్షణాలే లేవట! ఎంత దారుణం ! అయ్యో! తన బాధ ఎవరికర్థమౌతుంది? ...
ఇందాక - కీచకుణ్ణి అక్కడికక్కడే చంపేద్దామన్నంత కోపం భీముడికి రావటం, ధర్మరాజు ఆ కోపాన్ని రహస్యంగా చల్లార్చటం గుర్తు వచ్చింది.
ద్రౌపది కడుపు మండింది. తలెత్తి ధర్మరాజు ముఖంలోకి చూస్తూ రెండడుగులు వేసి,
'నాదు వల్లభుండు నటుడింత నిక్కంబు
పెద్దవారి యట్ల పిన్నవారు కాన
పతుల విధమ కాక, యే శైలూషి
కా ననంగరాదు కంకభట్ట!'
అని గద్దించింది.
'కంకుభట్ట' అన్న పిలుపులో ఉన్న సెగకు ధర్మరాజు వెనక్కి తగ్గాడు. రెండు క్షణాలు అతణ్ణే చూస్తూ నిలబడ్డది ద్రౌపది. 'మత్పతి శైలూషుండ కాడు, కితవుండునుం గావున జూదరి యాలికి గరువతనం బెక్కడియది?' అని ముఖాన అడిగేసి, అక్కడో క్షణం నిలవకుండా చరచరా అదృశ్యమైపోయింది.
ద్రౌపదికి ఆ రాత్రి ఓ పట్టాన తెల్లవారలేదు. అంతఃపురం సద్దుమణిగి, అందరూ నిద్రపోయాక, రహస్యంగా పాకశాలకు వెళ్ళి, భీముణ్ణి నిద్రలేపింది.
కీచకుని కథ చెప్పటం మొదలెట్టింది. భర్తల పరాక్రమం వర్ణించి అతణ్ణి తానెలా బెదరగొట్టిందో చెప్పింది. కీచకుడు కొన్ని ప్రల్లదాలు పలికాడని మాత్రం చెప్పి, ఆ ప్రల్లదాలేవో చెప్పక భీముణ్ణి రెచ్చగొట్టింది.
విరాటుని కొలువులో తనకు జరిగిన అవమానాన్ని ప్రస్తావించి 'మీ అన్న పెద్దతనము చూచితె!' అని ధర్మరాజును దెప్పిపొడిచింది.
'నన్ను కీచకుడు తన్నంగ, యెట్టులు
చూడనేర్చె ధర్మసూను డపుడు?'
అని ప్రశ్నిస్తూ భీముణ్ణి అన్నమీదికి ఉసికొలిపింది.
కాని...
ఏ గుణాన ఉన్నాడో భీముడు, ధర్మరాజు సహనాన్ని మెచ్చుకుని, కీచకుణ్ణి చంపబోయిన తన అజ్ఞానానికి నొచ్చుకుని, ధర్మరాజును తప్పుబట్టిన ద్రౌపది అవివేకాన్ని ఖండించాడు.
కథ అడ్డం తిరిగింది. ద్రౌపది నిర్ఘాంతపోయింది.
మరుక్షణం తన్ను తాను సంబాళించుకుని ధర్మరాజును ఆకాశానికెత్తేసింది.
'ఎవ్వాని వాకిట నిభమద పంకంబు
రాజభూషణ రజోరాశి నడగు'
అంటూ మొదలైన ఉపన్యాసాన్ని అనర్గళంగా, అతి సహజంగా, అద్భుతంగా సాగించింది. ధర్మజుని గొప్పతనంతో పాటు - భీముని బలసంపదను వర్ణించింది. అర్జునుని పరాక్రమాన్ని వర్ణించింది. నకులుని సౌందర్యాన్ని వర్ణించింది. సహదేవుని సౌకుమార్యాన్ని వర్ణించింది.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|