|
|
Articles: My Thoughts | నీతి బీరకాయ - Editor
| |
ఇంకొకాయన అవినీతిని అంతమొందిస్తానంటాడు. అదేమన్నా మనిషా, పోన్లే అలా లాకప్పులో వేసి నాలుగు బాదులు బాదేసి అంతమొందించడానికి? అది పిశాచి. దానికి చావు లేదు. ఇదే నిజం. 'చెప్పటానికే నీతులు' అని ఓ కవి చెప్పిందే సత్యం.
కాబట్టి అవినీతిని యుగధర్మంగా భావించి గౌరవించాల్సిందే -
ఎంచేతనంటే బక్కచిక్కిన నీతికి బలమైన అవినీతిని ఎదుర్కొనే బలగం లేదు గాక లేదు గాబట్టి. ఆ మధ్య రేడియోలో ఉదయం పూట యుగధర్మం గురించి సుభాషితంగా ఇట్లా చెప్పారు. కృతయుగంలో అవసరమైన వాడికి అడక్కుండానే దానం చేసేవారట. త్రేతాయుగంలో అడిగినవాడికి లేదనకుండా దానం చేసేవారట. ద్వాపర యుగంలో, ప్రేమ లేక భక్తితో యిచ్చిన కానుకను స్వీకరించి పెద్ద కానుకలు యిచ్చేవారట. మరి ఈ కలియుగంలో పనిచేయించుకుని ప్రతిఫలాన్ని దానమిస్తున్నట్లుగా కుమిలిపోతారట. కాబట్టి ఈ యుగంలో తనగి లాభం లేందే ఎవడూ ఏ పనీ ఏ సేవా చెయ్యడుగాక చెయ్యడు.
ఒకప్పుడు సోమర్సెట్ మామ్ రాసిన కథ డిగ్రీవాళ్లకు పాఠ్యాంశంగా వుండేది. (ఇప్పుడూ వుందేమో తెలీదు) కథ స్థూలంగా యిది.
ఇద్దరన్నదమ్ములు. పెద్దవాడు చాలా నీతిపరుడు, జాగ్రత్తపరుడు, కష్టపడి జీవిస్తుంటాడు. తమ్ముడు - జులాయి, జూదరి, చదువులేదు. మోసాలు చేస్తూ బతుకుతుంటాడు. బాగా డబ్బున్న అమ్మాయిని వల్లో వేసుకొని గొప్ప ధనవంతుడవుతాడు. అన్న మాత్రం ఆర్థిక బాధల్తోనే మిగిలిపోతాడు. (ఆ మహానుభావుడు లోకం తీరుని వ్యంగ్యంగా రాసివుండొచ్చు).
మరి ఇట్టాంటి ఇంగ్లీషు కథలు చదివి ఎవడండీ నిజాయితీగా బతుకుదాం అనుకుంటాడు? ఇక ఇంగ్లీషు నవలమాటకొస్తే, అంతా నేరమయం. ఎత్తుకు పైఎత్తులు - ఇవే కదా. మన రాజకీయాలు, సినిమాలు, సీరియళ్లు ఇదే బాటన పరిగెడుతున్నాయి. ఈ మధ్య మన దేశంవాడే రాసిన ఇంగ్లీషు నవల్ని ప్రపంచంవాళ్లు, కీర్తించి కిరీటాలు పెట్టారు. ఆ కథేమిటో తెల్సా? ఓ పనివాడు చిన్నతనంలో యజమానిని చంపి ధనవంతుడు అవుతాడ(ట).
కాబట్టి ఇప్పటి జనానికి (యువతకుకూడా) నిజాయితీ అంటే అర్థం తెలీదు అనుకోవాడానికి వీల్లేదు. అర్థం బాగా తెలుసుగాబట్టే, దాని జోలికి ఎవరూ పోవడం లేదు. నీతిని, ధర్మాన్ని ప్రబోధించే రామాయణ, మహాభారతాలను పాఠ్యాంశాలుగా పెట్టడం అదో 'నేరం'గా ఎక్కువ మంది భావించే ఈ దేశంలో, అవినీతి విజయగాథలు చదివి జనం ఆ దారే 'వరం' అనుకుంటూ వారసత్వాన్ని అంది పుచ్చుకుంటున్నారు.
ఆ మధ్య ఓ పల్లెటూళ్లో చిన్న సంస్థకి ఎన్నికలు జరిగాయి. విన్నదాన్ని బట్టి గత రాత్రి ఒక పార్టీ ఓటుకి 500 ఇచ్చింది. అది తెల్సి మరో పార్టీ అర్థరాత్రి ఓటుకి వెయ్యిచ్చింది. తెలతెలవారుతుండగా మరో పార్టీ ఓటుకి 1500 ఇచ్చింది. చివరికి ఏ పార్టీ గెలిచిందో తెల్సా? 1500 పార్టీ! ఇదే అవినీతి విజయగాథ! ధన, బలవంతుడిదే రాజ్యం! ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. ఎక్కువమంది ఓటర్లు - 1500 తీసుకున్నా తెలివిగా మరో పార్టీకి వెయ్యలేదు. నిజాయితీ కనబరిచారు! అందుచేతే 1500 పార్టీ కొద్ది మెజార్టీతోనైనా గెలవగలిగింది. ఈ పిట్టకథలో నీతి గెలిచిందా లేక అవినీతి గెలిచిందా? లేక నీతి - అవినీతిని గెలిపించిందా? అవినీతి అవినీతిని గెలిపించిందా... అన్నది వదిలేయండి. జనంలో మాత్రం కొంత నిజాయితీ బతికే వుంది. అది భవిష్యత్తులో పెరుగుతుందా, తరుగుతుందా అన్నది వాళ్ల జ్ఞానసముపార్జన బట్టి వుంటుంది.
రేపు ఈ జయగాథలకు జనం జై కొడతారో ఈడ్చి కొడతారో వేచిచూద్దాం.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|