|
|
Articles: TP Features | ఆరిన జ్వాల నక్సల్ బరీ - Site Administrator
| |
భూమి కోసం పేద రైతులు చేస్తున్నఆందోళన 1967 మే నెలలో కీలక మలుపు తిరిగింది. మొదటి బులెట్ పోలీసు తుపాకీ నుంచి దూసుకు వచ్చింది. అప్పటి నుంచే రైతాంగ ఉద్యమం హింసాత్మక దశలోకి మళ్ళింది. నక్సలైట్ ఉద్యమ నాయకుల్లో ఒకరైన పంజాబ్ సింగ్ భార్య సావిత్రి రావ్ ఈ సంఘటనకు ప్రత్యక్ష సాక్షి. ఆమె చెప్పిన కథనం ప్రకారం `ఒక రోజు ఉదయం కొంతమంది మగవాళ్ళు భూములు దున్నడానికి వెళ్ళారు. సాయంత్రం అయినా రాలేదు. వీళ్ళంతా తాగడానికి పోయారనుకున్నాం. మర్నాడూ వాళ్ళు రాకపోయే సరికి మేము ఆందోళనకు గురయ్యాం. భయపడ్డాం. మరుసటి రోజు కూడా భూముల్లోకి వెళ్ళిన మరో బృందం కూడా అదృశ్యమైంది. తర్వాతి రోజు ఉదయమే మేము కొంతమందిమి పొదల వెనకాల దాక్కుని పొలాల్లో ఏం జరుగుతుందో చూశాం. పొలాలు దున్నడానికి మగవాళ్ళు తయారుకాగానే పోలీసులు ప్రత్యక్షమయ్యారు. వాళ్ళను తీసుకుపోయారు. ఆ భూములను జోత్ దార్ సొంతం చేసుకున్నాడని, అక్రమంగా దున్నేవాళ్ళను అరెస్టు చేయమని ఉత్తర్వులు ఉన్నాయని పోలీసులు చెప్పారు. మరుసటి రోజున మేం అందరం బొరోజొరుజోట్ పొలాల్లో సమావేశమయ్యాం. ఏం జరిగినా కాని పోలీసులను పొలాల్లోకి రానివ్వకూడదని తీర్మానించుకున్నాం. దాంతో పోలీసులకు మాకు ఘర్షణ మొదలైంది. మాలో ఒకరు వేసిన బాణం తగిలి ఇనస్పెక్టర్ సోనమ్ వాంగ్డీ మరణించాడు. ఆ బాణం వేసింది ఎవరో ఇప్పటికీ మాకు తెలియద'ని ఆమె వివరించింది.
`ఇనస్పెక్టర్ వాంగ్డీ హత్యతో పోలీసులు దళాలు పొలాల్లో మొహరించాయి. ముందురోజు ఘర్షణలో పోలీసుల నుంచి లాక్కున్న తుపాకులను గిరిజనులు ఈ దళాలకు అప్పగించేశారు. కాని మే 25 వ తేదీన పెద్ద పోలీసు పటాలం నక్సల్ బరీ గ్రామం మీద విరుచుకుపడింది. దాంతో గ్రామస్థులు తమ చేతికి దొరికిన ఆయుధాలను అందుకున్నారు. మహిళలు తమ పసికందులను వీపున కట్టుకుని ముందుకు ఉరికారు. పోలీసులు తుపాకులు పేల్చారు. తొమ్మిది మంది మహిళలను, ఇద్దరు పసివాళ్ళను తూటాలకు బలి చేశారు. ప్రాణ త్యాగం చేసిన వీర వనితల పేర్లతో ఒక ఫలకం నక్సల్ బరీ రైల్వే స్టేషన్ సమీపంలో బెన్ గాయ్ జోట్ దగ్గర ఇప్పటికీ ఉంద'ని అభిజిత్ ముంజుందార్ వివరించారు.
ఈ సంఘటనతోనే నక్సల్ బరీ రైతాంగ ఉద్యమం వ్యవసాయ భూమి ఉద్యమ లక్షణాలను కోల్పోయింది. తీవ్రవాద సాయుధ పోరాట రూపం తీసుకుంది. సాయుధ పోరాటం పై కానూ సన్యాల్ కు వ్యక్తిగతంగా తనకు ఉన్న అభిప్రాయాలను పక్కనపెట్టి చారు ముజుందార్ తో పాటు ఆయుధాన్ని అందుకున్నాడు. నక్సల్ బరీ గ్రామానికి సమీపంలో ఉన్న ఫాన్సిద్వ గ్రామంలో 1967 జూన్ 28 న జరిగిన అతి పెద్ద రైతుల ప్రదర్శనలో ఈ సాయుధ పోరాటాన్ని చివరి వరకు అంటే భూమిపై హక్కును సాధించుకునే వరకు కొనసాగించాలని తీర్మానం చేసుకున్నారు. కాని ఈ పోరాటం సిపిఎం లో అంతర్గత ఆందోళనను రేపింది. హరే కృష్ణ కొనార్ లాంటి సిపిఎం నాయకులు మొదట్లో చాలా ఉత్సాహం చూపించారు. భూస్వాముల నుంచి భూములను స్వాధీనం చేసుకుని పేద రైతులకు పంచాలని ఉపన్యాసాలు దంచారు. తీరా పోరాటం మొదలయ్యే సరికి వారంతా పక్కకు తప్పుకున్నారు. `పేదలు హక్కులు సాధించుకోడానికి శాంతియుత మార్గం అంటూ ఏదీ ఉండదు. తుపాకీ గొట్టమే వాటిని సాధించిపెడుతుంద'ని అన్నారు ముజుబుర్ రహ్మాన్. అలనాటి విప్లవ స్మృతులను గర్తు చేసుకుని చెబుతున్నప్పుడు వృద్ధుని కళ్ళలో వెలుగు కనిపించింది.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|