|
|
Articles: My Thoughts | సాహసిక సమాజం - Site Administrator
| |
'ఏం, ఎందుకు రాలేదు' అనటానికి కొండరెడ్లు 'ఎలరానైతిరి' అంటూ శ్రీనాథుడి కాలంనాటి నుడికారంతో పలకరిస్తారు అని మద్రాస్ ప్రెసిడెన్సీ గిరిజనుల స్థితిగతుల గూర్చి నివేదిక రూపొందించిన (1948) అయ్యప్పన్ పేర్కొన్నాడు. ఉద్యోగరీత్యా, ఉద్యమాల కోసం గిరిజన ప్రాంతాలు చూసిన మన పండితులు, పరిశోధకులు, రచయితలు ఈ మాత్రంగానన్నా ఎందుకు స్పందించలేదో!
జీవితంలో, ప్రకృతిలో అందాలను అందుకునే కొండ ప్రాంతాల్లోని ఆ సాహసిక సమాజం - వారి దివి నుండి భువికి రావడానికి మనసు ఇచ్చగించేదే కాదు. భావదారిద్ర్యం, అజ్ఞానం, అహంకారంతో తమ చుట్టూ తాము పరిభ్రమించే భాషా సాహిత్యరంగాలలో వాతావరణం మీద క్రమంగా ఆసక్తి సన్నగిల్లింది. ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని గిరిజన ప్రాంతాలను దోచుకోవడం, గిరిజనులు మోసపోవడం. ఈ అవకాశాలను కొందరు గిరిజనులు కూడా ఉపయోగించుకొని తమవారినే వారు వంచించడం మనసును కలచివేసేవి. ఏం చేయాలో పాలుపోకపోయినా, మనసుంటే మార్గముంటుంది అన్నట్లు గిరిజనుల మధ్యనే ఉండి పనిచేయడానికి దారులు వెతకసాగాను.
ఆ రోజుల్లో (1978-82) 'అత్యవసర పరిస్థితి' తరువాత కేంద్రంలో జనతా ప్రభుత్వం ఏర్పడితే, హోం మంత్రిగా శ్రీకాకుళం పోరాటాన్ని అణచివేసిన వెంగళరావు నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వమే రాష్ట్రంలో కొనసాగింది. వామపక్ష తీవ్రవాదుల అభిమానులందరూ షా, విమద్ లాల్, భార్గవ కమిషన్ల ముందు ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాలని కసిగా పనిచేస్తుండేవారు. 1980లో మళ్ళీ ఇందిరాగాంధీ అధికారంలోకి వచ్చింది. హతాశులైన ఈ వామపక్ష బుద్ధి జీవులందరూ స్వచ్ఛందసంస్థల వైపు అడుగువేయసాగారు. అప్పటికే అనంతపురంలో ఫాదర్ ఫెర్రర్ దగ్గర పనిచేసిన కొందరు స్వచ్ఛంద సంస్థలు ప్రారంభించారు. ఈ సంస్థల గూర్చి తెలుసుకునే ప్రయత్నంలో సికింద్రాబాద్, తారనాకలో గల 'రూరల్ డెవలప్ మెంట్ ఎడ్వైజరీ సర్వీసెస్'కు (ఆర్.డి.ఎ.ఎస్) వెళితే, వారి సాంస్కృతిక విభాగానికి చెందిన పసుపులేటి పూర్ణచంద్రరావు, గొర్రెపాటి నరేంద్రనాధ్ ను పరిచయం చేశారు.
ఇటీవలే స్వర్గస్థుడైన నరేంద్రనాధ్, అప్పట్లో ప్రముఖ రాజనీతివేత్త రజనీ కొఠారీ సిద్ధాంతకర్తగా నడుస్తున్న 'లోకాయన్' (ప్రజా ఉద్యమాల సమాఖ్య) తరఫున, మత సామరస్యం, శ్రీశైలం ప్రాజెక్టు నిర్వాసితుల మీద అధ్యయనాల కోసం మేధావులను కూడగడుతుండేవారు. ఆయనతో పాటు ఒకసారి భద్రాచలం దగ్గర చింతూరులో గల స్వచ్ఛంద సంస్థ గిరిజనసీమ సంక్షేమ సంఘానికి వెల్ళడం (1983), అలా పెరిగిన పరిచయం 1985లో రంపచోడవరం లో 'శక్తి' సంస్థ ప్రారంభించడానికి దారితీసింది. కాని ఒకనాడు భూమి - అడవి - నీరు అని గర్జించిన వామపక్ష అభిమానులు పౌరహక్కులు, స్త్రీవాదం, దళితవాదం, పిల్లలహక్కులు, ఉపాధిహామీ కార్యక్రమాల వైపు మళ్ళితే నా కార్యక్రమాలు క్రమంగా భూమి - అడవి - నీరు దారిపట్టాయి.
'పుడమి తల్లికి పురిటి నొప్పులు-
క్రొత్త సృష్టిని స్ఫురింపించాయి!' శ్రీశ్రీ.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|